త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌ నుంచి బంగ్లాను తప్పించిన ఐసీసీ.. ఇది పక్షపాతమేనన్న ట్రోఫీ చోర్‌ నఖ్వీ..!

T20 World Cup | బంగ్లాదేశ్‌ పట్టుదల వీడకపోవడంతో టీ20 ప్రపంచకప్‌ నుంచి తప్పించింది. ఆ దేశం స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది. ఈ మేరకు అన్ని బోర్డులకు సమాచారం ఇచ్చింది. అయితే, ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్‌ బోర్డు వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నది.

P

Sports | Published On Jan 24, 2026, 7.33 pm IST

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌ నుంచి బంగ్లాను తప్పించిన ఐసీసీ.. ఇది పక్షపాతమేనన్న ట్రోఫీ చోర్‌ నఖ్వీ..!
Advertisement

T20 World Cup | బంగ్లాదేశ్‌ పట్టుదల వీడకపోవడంతో టీ20 ప్రపంచకప్‌ నుంచి తప్పించింది. ఆ దేశం స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది. ఈ మేరకు అన్ని బోర్డులకు సమాచారం ఇచ్చింది. అయితే, ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్‌ బోర్డు వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ.. బంగ్లాపై ఐసీసీ పక్షపాతం చూపించిందని ఆరోపించారు. మరో వైపు రాబోయే ప్రపంచకప్‌ నుంచి పాక్‌ సైతం వైదొలగుతామని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రధాని ప్రస్తుతం దేశంలో లేరని.. ఆయన తిరిగి దేశానికి తిరిగి వచ్చిన తర్వాత తుది నిర్ణయాన్ని చెబుతామన్నారు. తాము ప్రభుత్వ సలహాను పాటిస్తామని.. ఐసీసీ సలహాలు కాదన్నారు.

టీ20 ప్రపంచకప్‌లో ఆడొద్దని పాక్‌ ప్రభుత్వం చెబితే.. అప్పుడు ఐసీసీ 22వ జట్టును టోర్నీలోకి తీసుకోవచ్చని.. ఇది ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు. పాక్‌ మ్యాచులన్నీ శ్రీలంక వేదికగా జరుగనున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం.. టోర్నీ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న నెదర్లాండ్‌తో ఆడనున్నది. ఈఎస్‌పీఎన్‌ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్‌ బోర్డు ఇటీవల ఐసీసీకి ఇ-మెయిల్‌ పంపింది. భారత్‌లో మ్యాచులు ఆడడం చుట్టూ ఉన్న భద్రత, రాజకీయ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన బంగ్లాదేశ్‌ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఐసీసీ తుది నిర్ణయం తీసుకోవడానికి కేవలం ఒక రోజు ముందు పీసీబీ ఈ ఇ-మెయిల్‌ను బోర్డు సభ్యులకు సైతం పంపింది. బంగ్లాదేశ్‌ మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు పీసీబీ ముందుకువచ్చింది. బంగ్లాదేశ్‌ స్టార్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐపీఎల్‌ 2026 నుంచి విడుదల చేసిన తర్వాత ఆ దేశ బోర్డు వివాదానికి తెరలేపింది.

భారత్‌లో భద్రతాపరమైన ఆందోళనలు లేవనెత్తింది. టీ20 ప్రపంచకప్‌ మ్యాచులను భారత్‌లో ఆడబోమని, మ్యాచులన్నీ శ్రీలంకకు మార్చాలని డిమాండ్‌ చేసింది. గ్రూప్ సీ నుంచి బంగ్లాదేశ్‌ను గ్రూప్‌ బీకి మార్చి.. ఐర్లాండ్‌ను గ్రూప్‌ సీకి పంపాలనే ప్రతిపాదన చేసింది. దీనికి కారణం గ్రూప్ బీ మ్యాచ్‌లు శ్రీలంకలో జరగాల్సి ఉండడమే. ఐసీసీ అధికారులు బంగ్లాదేశ్‌లో బీసీబీ అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత జనవరి 21న ఐసీసీ బోర్డు సమావేశం జరిగింది. మెజారిటీ ఆధారంగా బంగ్లాదేశ్ డిమాండ్‌ను తిరస్కరించారు. షెడ్యూల్ ప్రకారం భారతదేశంలో ఆడాలని.. లేకపోతే వారి స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంటామని బంగ్లా బోర్డుకు అల్టిమేటం ఇచ్చింది. ఈ నెల 22న బంగ్లాదేశ్‌ మళ్లీ పాత పల్లవినే ఎత్తుకుంది. భారత్‌లో ప్రపంచకప్‌ ఆడటానికి నిరాకరించింది. శనివారం ఐసీసీ అధికారికంగా బీసీబీని టోర్నమెంట్ నుంచి తొలగించి.. ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను గ్రూప్ సీలో చేరుస్తున్నట్లుగా ప్రకటించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement