త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | మేం అందుక‌నే ఓడాం.. పాక్ ఓట‌మికి అస‌లు కార‌ణాలు చెప్పిన కోచ్‌..

T20 World Cup 2026 | భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో అసలు పాకిస్థాన్ ఎక్కడ ఓడింది? టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించినప్పుడేనా? 5 నుంచి 8వ‌ ఓవర్ల మధ్య ఇషాన్ కిషన్ విధ్వంసంతో భారత్ 52 పరుగులు రాబట్టిన దశలోనా? లేక త‌మ ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే ముగిసే సరికి 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సందర్భంలోనా?

S

Cricket | Published On Feb 16, 2026, 7.49 am IST

T20 World Cup 2026 | మేం అందుక‌నే ఓడాం.. పాక్ ఓట‌మికి అస‌లు కార‌ణాలు చెప్పిన కోచ్‌..
Advertisement

T20 World Cup 2026 | భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో అసలు పాకిస్థాన్ ఎక్కడ ఓడింది? టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించినప్పుడేనా? 5 నుంచి 8వ‌ ఓవర్ల మధ్య ఇషాన్ కిషన్ విధ్వంసంతో భారత్ 52 పరుగులు రాబట్టిన దశలోనా? లేక త‌మ ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే ముగిసే సరికి 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సందర్భంలోనా? ఈ ప్రశ్నలన్నీ మ్యాచ్ అనంతరం చర్చకు వచ్చాయి. అయితే పాకిస్థాన్ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సన్ అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉంది. చివరి రెండు దశల్లోనే తమ ఆటగాళ్లు తప్పు నిర్ణయాలు తీసుకుని, వ్యూహాత్మకంగా విఫలమయ్యారని ఆయన తేల్చి చెప్పారు. భారత్ ఒత్తిడిని పెంచుతూ పాకిస్థాన్‌ను పూర్తిగా కట్టడి చేయడం వల్లే ఈ దారుణ పరాజయం ఎదురైందన్నారు. ఈ ఓటమి మార్జిన్ 61 పరుగులు కాగా, గతంలో భారత్‌పై ఎదురైన 11 పరుగుల ఓటమితో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువగా ఉండడం పాకిస్థాన్‌కు మరింత బాధ కలిగించే అంశంగా మారింద‌ని అన్నారు.

ఒత్తిడిలో నిర్ణ‌యాలు త‌ప్పాయి: హెస్స‌న్‌

ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా వేసిన వేగవంతమైన స్వింగ్ యార్కర్‌కు సైమ్ అయూబ్ బోల్తా పడ్డాడు. అయితే షాహిబ్ జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా, బాబర్ ఆజమ్‌ల షాట్ సెలెక్షన్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పరిస్థితులకు తగ్గట్లుగా కాకుండా వారు చెత్త షాట్ల‌ను ఆడిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది. అదే వికెట్ల పతనానికి కారణమైంది. ఇలాంటి అవమానకర ఓటమి తర్వాత వెంటనే నిజాయితీగా విశ్లేషణ చేయడం కష్టమే అయినా, హెస్సన్ మాత్రం ఏమాత్రం వెనుకాడలేదు. ప్రత్యర్థులు ఒత్తిడి పెడుతున్నప్పుడు మౌలిక అంశాలకు కట్టుబడి ఉంటారా, లేక వాటిని వదిలేస్తారా అన్నదే అసలైన పరీక్ష. టోర్నీ ముందుకు సాగేకొద్దీ మళ్లీ మళ్లీ ఒత్తిడి వస్తుంది. అప్పుడు మనం ఎలా స్పందిస్తామన్నదే కీలకం.. అని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఆటగాళ్లయినప్పటికీ ఒత్తిడిలో నిర్ణయాలు తప్పుతాయి. అదే ఈ మ్యాచ్‌లో జరిగిందని హెస్సన్ స్పష్టం చేశారు.

ప్ర‌మాద‌క‌ర‌మైన షాట్లు ఆడారు..

భారీ లక్ష్యాన్ని చూసి బ్యాటర్లు సూపర్‌మ్యాన్‌లా ఆడాలనే ఆలోచనకు వెళ్లారని హెస్సన్ అభిప్రాయపడ్డారు. భారత్ నిర్దేశించిన స్కోరు సగటు కంటే సుమారు 25 పరుగులు ఎక్కువగా ఉండటంతో, తొందరగా మ్యాచ్‌ను తేల్చేయాలనే ప్రయత్నంలో ప్రమాదకరమైన షాట్లు ఆడారని చెప్పారు. ఈ పిచ్‌పై ఆ షాట్లు చాలా కఠినమైనవి. వేగంగా ఉండే ఇతర మైదానాల్లో అయితే అవి పని చేసి ఉండొచ్చు. కానీ పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకోవడంలో మేం వెనకబడ్డాం.. అన్నారు. టాస్ నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్నపై కూడా హెస్సన్ స్పష్టత ఇచ్చారు. టాస్ వల్ల మ్యాచ్ ఫలితం నిర్ణయించబడదని ముందే చెప్పిన సల్మాన్ ఆఘా మాటలకే ఆయన మద్దతిచ్చారు. పిచ్ సాఫ్ట్‌గా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో బంతి ఎక్కువగా స్పిన్ అయ్యింది, స్కిడ్ అయింది. అందుకే ఇరు జట్లు ఫీల్డింగ్ ఎంచుకునేవే. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడం తప్పు కాదు.. అని చెప్పారు. ఆస్ట్రేలియా-జింబాబ్వే మ్యాచ్‌తో పోలికలు చేయడాన్ని కూడా ఆయన కొట్టిపారేశారు. అది డే గేమ్, ఇది నైట్ గేమ్ అని, టాస్‌కు సంబంధం లేదని తేల్చారు.

మ‌ళ్లీ బ‌లంగా వ‌స్తాం: హెస్స‌న్

అయితే ఈ మ్యాచ్‌లో ఓట‌మి త‌రువాత త‌మ డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర నిరాశ నెలకొందన్నారు. పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో ఆటగాళ్లకు తెలుసు. అందుకే బాధ ఎక్కువగా ఉంది. కానీ ఇది టోర్నీ క్రికెట్. ప్రతిసారీ ఫలితం మనకు అనుకూలంగా ఉండదు. మళ్లీ లేచి నిలబడి వచ్చే రెండు మూడు రోజుల్లో బలంగా తిరిగి రావాల్సిందే.. అని హెస్సన్ అన్నారు. కాగా గ్రూప్ దశలో పాకిస్థాన్‌కు ఇక చివరి మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 18న ఎస్‌ఎస్‌సీ మైదానంలో నమీబియాతో జరిగే ఆ మ్యాచ్‌ను తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో పాకిస్థాన్ నిలిచింది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించకపోతే, పాయింట్ల పట్టికలో పాక్ మూడో స్థానానికి ప‌రిమితం అవుతుంది. దీంతో రెండో స్థానంలో ఉన్న యూఎస్ఏ సూప‌ర్ 8 చేరేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అయితే నమీబియాపై పాక్ విజ‌యం సాధిస్తుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement