త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | పాక్ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ రెడీ.. హ్యాండ్‌షేక్‌పై సూర్య సస్పెన్స్..

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌ 2026లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఆదివారం జరగనున్న హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియా నుంచి కీలక సంకేతం వచ్చింది. గత మ్యాచ్‌లో నమీబియాతో ఆడని ఓపెనర్ అభిషేక్ శర్మ పాక్‌ మ్యాచ్‌లో ఆడతాడని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు ఖరారు చేశాడు.

S

Cricket | Published On Feb 15, 2026, 6.47 am IST

T20 World Cup 2026 | పాక్ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ రెడీ.. హ్యాండ్‌షేక్‌పై సూర్య సస్పెన్స్..
Advertisement

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌ 2026లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఆదివారం జరగనున్న హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియా నుంచి కీలక సంకేతం వచ్చింది. గత మ్యాచ్‌లో నమీబియాతో ఆడని ఓపెనర్ అభిషేక్ శర్మ పాక్‌ మ్యాచ్‌లో ఆడతాడని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు ఖరారు చేశాడు. కెప్టెన్ నుంచి ఈ నిర్ధారణ వెలువడిన కొద్దిసేపటికే అభిషేక్ నెట్స్‌లో ప్యాడ్లు కట్టి చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం విశేషం. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లలో భారత్‌ విజయం సాధించినప్పటికీ, టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో రాణించలేదన్న విమర్శలు ఉన్నాయి. అభిషేక్ శర్మ లేమి నమీబియా మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. యూఎస్ఏతో మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే ఔటైనప్పటికీ, పవర్‌ప్లేలో అతని దూకుడు బ్యాటింగ్ భారత్‌కు కీలక ఆయుధంగా మారనుంది. పాక్ మ్యాచ్ లో అభిషేక్ ఆట తప్పనిసరి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కూడా అభిషేక్ ఆడాలని ముందుగానే కోరడం గమనార్హం.

వాళ్లు కోరితే ఆడిస్తాం: సూర్య కుమార్ యాద‌వ్‌

ఈ నేపథ్యంలో సూర్యకుమార్ స్పందిస్తూ వాళ్లు (పాకిస్థాన్) కోరితే మేం అతడిని ఆడిస్తాం అంటూ సంక్షిప్తంగా సమాధానమిచ్చాడు. అలాగే మ్యాచ్‌కు ముందు భారత్‌-పాక్ ఆటగాళ్ల మధ్య హ్యాండ్‌షేక్ జరుగుతుందా? అన్న ప్రశ్నకు మాత్రం సూర్య సస్పెన్స్ కొనసాగించాడు. ఇంకా 24 గంటలు ఆగండి. బాగా తినండి, బాగా నిద్రపోండి. రేపు చూస్తాం అంటూ స‌మాధానం దాట‌వేశాడు. ఇదే అంశంపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కూడా రేపు చూద్దాం అంటూ సమాధానం ఇచ్చాడు. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై ఉన్న ఒత్తిడి గురించి మాట్లాడిన సూర్య, ఆ ఒత్తిడిని తప్పించుకోలేమని అంగీకరించాడు. ఏ మ్యాచ్ అయినా ఒత్తిడి ఉంటుంది. కానీ పాకిస్థాన్‌తో ఆడితే అది ఒక ప్రత్యేక సందర్భం అవుతుంది. మేం వాళ్లతో తరచుగా ఆడం. అందుకే ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అయినా సింపుల్‌గా ఉండి, మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.. అని చెప్పాడు.

ఉస్మాన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలుసు..

పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌పై వచ్చిన ప్రశ్నలకు కూడా సూర్య ఆసక్తికరంగా స్పందించాడు. పరీక్షల్లో సిలబస్ బయట ప్రశ్నలు వస్తాయి. అలా అని వాటిని వదిలేయం. ఉస్మాన్ ప్రత్యేకమైన బౌలర్. కానీ మేం అతడికి లొంగిపోం. అతనిపై ఎలా ఆడాలో సిద్ధమయ్యాం.. అని తెలిపాడు. గత సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పటికీ, అప్పటి నుంచి పాక్ జట్టు మరింత బలంగా మారిందని సూర్య అభిప్రాయపడ్డాడు. కొలంబోలో స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లు ఉండనున్న నేపథ్యంలో ఇరు జట్లు సమాన స్థాయిలో పోటీ పడనున్నాయని పేర్కొన్నాడు. వాళ్లు ఇటీవలి మ్యాచ్‌ల్లో మంచి క్రికెట్ ఆడుతున్నారు. మేమూ బాగా సిద్ధమయ్యాం. మా ప్రణాళికలకు కట్టుబడి ఆడతాం.. అని సూర్య స్పష్టం చేశాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement