త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rohit Sharma | లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరిదేనా?.. జైస్వాల్‌కు ఛాన్స్‌ ఇవ్వాలన్న యోచనలో సెలెక్టర్లు..!

Rohit Sharma | భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు ఆదివారం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో వన్డేనే భారత జట్టు తరఫున చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్ పర్యటన అనంతరం రోహిత్‌ను కొనసాగించే విషయంలో సెలెక్టర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే భవిష్యత్ జట్టుపై దృష్టి సారించినట్లు పీటీఐ వెల్లడించింది.

P

Sports | Published On Jul 17, 2026, 8.20 am IST

Rohit Sharma | లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరిదేనా?.. జైస్వాల్‌కు ఛాన్స్‌ ఇవ్వాలన్న యోచనలో సెలెక్టర్లు..!
Advertisement

Rohit Sharma | భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు ఆదివారం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో వన్డేనే భారత జట్టు తరఫున చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్ పర్యటన అనంతరం రోహిత్‌ను కొనసాగించే విషయంలో సెలెక్టర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే భవిష్యత్ జట్టుపై దృష్టి సారించినట్లు పీటీఐ వెల్లడించింది. ఇటీవల కాలంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గత ఎనిమిది వన్డేల్లో 241 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 30.1 ఉండగా.. స్ట్రయిక్‌ రేటు 88.6గా నమోదైంది. కేవలం హాఫ్‌ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో 47 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసిన రోహిత్, విల్ జాక్స్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. భారత జట్టుతో కలిసి ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉన్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, జట్టు మేనేజ్‌మెంట్‌తో కలిసి భవిష్యత్ ప్రణాళికలపై ఒకే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ నాటికి యువ జట్టును సిద్ధం చేయాలనే లక్ష్యంతో రోహిత్‌కు బదులుగా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే నిర్ణయానికి సెలెక్టర్లు వచ్చినట్లు తెలుస్తోంది.

జైస్వాల్‌పై నమ్మకం

యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు వరుస అవకాశాలు కల్పించాలని సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు బాదిన జైస్వాల్‌కు వచ్చే సుమారు 20 వన్డేల్లో ఆడే అవకాశం కల్పిస్తేనే అంతర్జాతీయ స్థాయిలో మరింత పరిణతి సాధిస్తాడని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత కూడా రోహిత్‌ను కొనసాగిస్తే జైస్వాల్‌కు అవకాశాలు తగ్గుతాయని సెలెక్టర్లు భావిస్తున్నారని సమాచారం. ‘రోహిత్‌ను రిటైర్మెంట్ ప్రకటించమని ఎవరూ చెప్పలేరు. సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే స్వదేశీ సిరీస్ నుంచి భవిష్యత్ జట్టుపై దృష్టి పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇకపై తన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది రోహిత్‌నే’ అని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి పీటీఐతో చెప్పారు.

గంభీర్, అగార్కర్‌ది ఒకే అభిప్రాయం..

సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్ విషయంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒకే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అద్భుత ఫామ్, ఫిట్‌నెస్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఎంపికపై ఎలాంటి సందేహాలు లేకపోయినా, రోహిత్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని సమాచారం. ఇదే సమయంలో గంభీర్ రోహిత్‌కు పూర్తి మద్దతుగా నిలిచినట్లు ఓ నివేదిక తెలిపింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా తన సహజశైలిలోనే బ్యాటింగ్ చేయాలని కోచ్ సూచించినట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. ‘వైట్‌బాల్ క్రికెట్‌లో రోహిత్ భారత జట్టుకు అసాధారణ సేవలు అందించాడు. తన కెరీర్ మొత్తం ఎలా ఆడాడో అదే విధంగా స్వేచ్ఛగా ఆడాలని కోచ్ కోరుకుంటున్నారు’ అని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ‘ఇటీవల రోహిత్‌పై అనవసర ఒత్తిడి కనిపిస్తోంది. అతనికి ఇప్పుడు కావాల్సింది విమర్శలు కాదు, కొంత సమయం, మానసిక ప్రశాంతత. అతని స్థాయి ఆటగాళ్లు ఎలాంటి బాహ్య ఒత్తిడి లేకుండా ఆడినప్పుడే అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు. ప్రతి ఇన్నింగ్స్‌ను అతిగా విశ్లేషించకుండా, ఎన్నో విజయాలు అందించిన ఆటగాడిపై విశ్వాసం ఉంచాలి. ఆత్మవిశ్వాసంతో ఆడే రోహిత్ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు’ అని పేర్కొన్నారు.

ప్రపంచకప్ దృష్టిలోనే పెట్టుకొని నిర్ణయాలు

2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రోహిత్ నుంచి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుని శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. 2027 ప్రపంచకప్ ప్రారంభమయ్యే సమయానికి రోహిత్ వయసు 41 సంవత్సరాలు ఉండనుండటంతో దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో అంతకాలం అత్యున్నత స్థాయిలో ఆడడం కష్టమేనన్న అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ప్రస్తుతం భారత్ తరఫున కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ కెరీర్‌ను మరికొంతకాలం కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

తుది నిర్ణయం రోహిత్ చేతుల్లోనే..

కొద్ది నెలల క్రితమే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ భవిష్యత్‌పై అప్పట్లో కూడా భిన్న కథనాలు వచ్చాయి. అయితే, తాజా వన్డే కెరీర్‌పై సైతం నీలినీడలు అలుముకున్నాయి. ఒకవేళ లార్డ్స్ వన్డేనే రోహిత్‌కు భారత జట్టు తరఫున చివరి మ్యాచ్‌గా నిలిస్తే.. భారత వైట్‌బాల్ క్రికెట్‌లో ఓ స్వర్ణయుగానికి తెరపడినట్లే అవుతుంది. రోహిత్‌ నాయకత్వంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్‌గా ఇప్పటికే తన ముద్ర వేసిన రోహిత్.. ఇక తన అంతర్జాతీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement