త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 Case | మారుతీకి షాక్ ఇచ్చిన క‌న్జ్యూమ‌ర్స్ కోర్టు.. కొత్త కార్ లేకుంటే.. రూ.20.50ల‌క్ష‌లు చెల్లించాల‌ని ఆదేశం..!

E20 Case | ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ (E20) వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. ఈ20 పెట్రోల్ వాడకంతో వాహనం పనితీరు దెబ్బతిన్నదని ఫిర్యాదు చేసిన వినియోగదారుడికి అనుకూలంగా నిర్ణయం వెలువ‌రించింది.

P

National | Published On Jul 16, 2026, 9.30 pm IST

E20 Case | మారుతీకి షాక్ ఇచ్చిన క‌న్జ్యూమ‌ర్స్ కోర్టు.. కొత్త కార్ లేకుంటే.. రూ.20.50ల‌క్ష‌లు చెల్లించాల‌ని ఆదేశం..!
Advertisement

E20 Case | ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ (E20) వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. ఈ20 పెట్రోల్ వాడకంతో వాహనం పనితీరు దెబ్బతిన్నదని ఫిర్యాదు చేసిన వినియోగదారుడికి అనుకూలంగా నిర్ణయం వెలువ‌రించింది. సంబంధిత కారుకు బదులుగా ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలమైన కొత్త వాహనాన్ని అందించాలని, లేదంటే వాహనం కొనుగోలు కోసం చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మారుతీ సుజుకీ సంస్థతో పాటు డీలర్‌ను ఆదేశించింది. ఈ20 కేసు వివాదంలో భార‌త్‌లో వెలువడిన మొద‌టి తీర్పు ఇదే కావడం విశేషం.

వివ‌రాల్లోకి వెళితే.. రాయ్‌పూర్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ ప్రేమ్‌రాజ్ దేవతా 2023లో మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ జెటా ప్లస్ కారును కొనుగోలు చేశారు. వాహనంలో ఈ20 పెట్రోల్ వినియోగించిన తర్వాత ఇంజిన్ ఆగిపోవడం, పనితీరులో లోపాలు కనిపించడంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్ జూలై 14న 23 పేజీల తీర్పును ప్రకటించింది. వాహనం ఈ20 ఫ్యూయ‌ల్ వినియోగానికి సరిపడే విధంగా లేదనే అంశాన్ని విక్రయ సమయంలో వినియోగదారుడికి స్పష్టంగా తెలియజేయలేదని పేర్కొంది. ఈ వివరాలను వెల్లడించకపోవడం సేవల్లో లోపంగా, అనుచిత వ్యాపార విధానంగా పరిగణించాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

తీర్పు ప్రకారం.. 45 రోజుల్లోగా ఫిర్యాదుదారుడికి కొత్త వాహనం అందించాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.18.29 లక్షలు, ఆర్‌టీఓ రుసుములు రూ.1.86 లక్షలు, బీమా ప్రీమియం రూ.34,644 కలిపి మొత్తం రూ.20.50 లక్షలు తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. అదనంగా వినియోగదారుడు ఎదుర్కొన్న మానసిక వేదనకు రూ.1 లక్ష పరిహారం, న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.10 వేల చెల్లించాలని ఆదేశించింది. అయితే, వాహనంలో ఎలాంటి తయారీ లోపం లేదని మారుతీ సుజుకీ సంస్థ, డీలర్ వాదించారు. ఇంధన నాణ్యత, కల్తీ కారణంగానే సమస్యలు వచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ తీర్పుపై ఉన్నతస్థాయి వినియోగదారుల ఫోరమ్‌లను ఆశ్రయించే అవకాశం సంస్థకు ఉంది. ఇంధన మార్పులకు అనుగుణంగా వాహనాల సామర్థ్యం, వినియోగదారులకు అందించే సమాచారం వంటి అంశాలపై ఈ తీర్పు భవిష్యత్తులో ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement