త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

R Ashwin | అప్పుడే జ‌ట్టులో చోటు లేద‌ని తెలిసిపోయింది.. టెస్టు రిటైర్మెంట్‌పై అశ్విన్ కీల‌క కామెంట్స్‌..!

R Ashwin | టీమిండియా మాజీ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన టెస్ట్ కెరీర్ ముగింపుకు దారితీసిన పరిణామాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. జట్టులో తన పాత్ర క్రమంగా తగ్గుతోందని గ్రహించిన క్షణమే రిటైర్మెంట్‌పై సీరియస్‌గా ఆలోచించడం ప్రారంభించానని చెప్పాడు.

P

Sports | Published On Mar 17, 2026, 10.15 pm IST

R Ashwin | అప్పుడే జ‌ట్టులో చోటు లేద‌ని తెలిసిపోయింది.. టెస్టు రిటైర్మెంట్‌పై అశ్విన్ కీల‌క కామెంట్స్‌..!
Advertisement

R Ashwin | టీమిండియా మాజీ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన టెస్ట్ కెరీర్ ముగింపుకు దారితీసిన పరిణామాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. జట్టులో తన పాత్ర క్రమంగా తగ్గుతోందని గ్రహించిన క్షణమే రిటైర్మెంట్‌పై సీరియస్‌గా ఆలోచించడం ప్రారంభించానని చెప్పాడు. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన అశ్విన్, 2024 ఆస్ట్రేలియా టూర్‌ను తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా పేర్కొన్నాడు. ముఖ్యంగా పెర్త్ టెస్టులో తాను అందుబాటులో ఉన్నప్పటికీ తుది జట్టులో చోటు దక్కకపోవడం త‌న‌కు పెద్ద సంకేతమైందని తెలిపాడు. తనకంటే తక్కువ అనుభవం ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయడం చూసిన తర్వాత, జట్టులో తన ప్రాధాన్యం తగ్గిందని అర్థమైందని వివరించాడు. ఆ సిరీస్ పూర్తయ్యాక బ్రిస్బేన్ టెస్టు అనంతరం టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పినట్టు గుర్తుచేశాడు.

ఇదిలా ఉంటే, అదే సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా టెస్టులకు వీడ్కోలు పలకడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జట్టులో సీనియర్ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతున్నారని, అప్పటి కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తిన సందర్భంలో అశ్విన్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు. గంభీర్‌ను సమర్థిస్తూ అతడు ఎప్పుడూ జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాడని పేర్కొన్నాడు. వ్యక్తిగత విజయాల కంటే టీమ్ ఫలితాలపై దృష్టి పెట్టడం అతడి ప్రత్యేకతని పేర్కొన్నాడు. భారత క్రికెట్ విజయం కొద్దిమంది ఆటగాళ్లపై ఆధారపడదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లీలతో తన అనుభవాలను పంచుకుంటూ, జట్టులో ఎప్పుడూ పరస్పర నిందలు లేవని చెప్పాడు. దేశం కోసం గెలవాలన్న లక్ష్యమే అందరినీ కలిపి ఉంచిందని తెలిపాడు.

టెస్టుల్లో 500కి పైగా వికెట్లు సాధించిన అశ్విన్, ప్రస్తుత భారత జట్టు పరిస్థితిని కూడా విశ్లేషించాడు. జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉన్నప్పటికీ భవిష్యత్తుపై నమ్మకం ఉందని అన్నాడు. బ్యాటింగ్ విభాగంలో పెద్ద సమస్యలు కనిపించడం లేదని, అవసరమైతే కొత్త ప్రతిభను తీర్చిదిద్దే సామర్థ్యం భారత క్రికెట్‌కు ఉందని పేర్కొన్నాడు. అయితే బౌలింగ్ విభాగం మరింత పదునెక్కాల్సిన అవసరం ఉందని, అదే జట్టుకు ప్రధాన సవాల్‌గా మారిందని సూచించాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement