త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CWG 2026 | భారత్‌ మ్యాప్‌లో క‌నిపించ‌ని ఈశాన్య రాష్ట్రాలు.. అభ్యంత‌రం తెలిపిన ల‌వ్లీనా

CWG 2026 | కామన్వెల్త్‌ గేమ్స్‌-2026లో భారత బాక్సింగ్‌ జట్టు చరిత్రాత్మక విజయాన్ని న‌మోదు చేసింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్య‌క్ర‌మంలో అనూహ్యంగా వివాదం చోటు చేసుకుంది. గ్లాస్గోలోని ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌ 'మిస్టర్ సింగ్స్ ఇండియా – ది హోమ్‌ ఆఫ్‌ కర్రీ'లో ముద్రించిన భారత మ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రాలను చూపించ‌క‌పోవ‌డంపై ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

P

Sports | Published On Aug 2, 2026, 3.16 pm IST

CWG 2026 | భారత్‌ మ్యాప్‌లో క‌నిపించ‌ని ఈశాన్య రాష్ట్రాలు.. అభ్యంత‌రం తెలిపిన ల‌వ్లీనా
Advertisement

CWG 2026 | కామన్వెల్త్‌ గేమ్స్‌-2026లో భారత బాక్సింగ్‌ జట్టు చరిత్రాత్మక విజయాన్ని న‌మోదు చేసింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్య‌క్ర‌మంలో అనూహ్యంగా వివాదం చోటు చేసుకుంది. గ్లాస్గోలోని ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌ 'మిస్టర్ సింగ్స్ ఇండియా – ది హోమ్‌ ఆఫ్‌ కర్రీ'లో ముద్రించిన భారత మ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రాలను చూపించ‌క‌పోవ‌డంపై ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలోని ప్రతి ప్రాంతాన్ని సరిగ్గా ప్రతిబింబించేలా మ్యాప్‌లను ఉపయోగించాలని రెస్టారెంట్‌ యాజమాన్యానికి సూచించింది. అసోంకు చెందిన లవ్లీనా మాట్లాడుతూ.. రెస్టారెంట్‌లో టేబుల్‌పై ఉంచిన న్యాప్‌కిన్‌లపై మాత్రమే కాకుండా బయట ప్రదర్శించిన భారత మ్యాప్‌లో కూడా ఈశాన్య రాష్ట్రాలు కనిపించలేదని చెప్పారు.

ఈ విషయం తనను ఎంతో బాధించిందన్నారు. "దయచేసి నా మాటల‌ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. భారత మ్యాప్‌లో మా ఈశాన్య ప్రాంతాలు కనిపించలేదు. బయట ప్రదర్శించిన మ్యాప్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. ఈశాన్య ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఇది మాకు బాధ కలిగించే విషయం. ఇకపై ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని మాత్రమే కోరుతున్నాను. ధన్యవాదాలు" అని లవ్లీనా పేర్కొంది. లవ్లీనాకు భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అధ్యక్షుడు అజయ్‌ సింగ్ సైతం మద్దతు తెలిపారు. ఆ మ్యాప్‌లో జమ్మూ–కాశ్మీర్‌ను కూడా పూర్తిస్థాయిలో చూపలేదని పేర్కొన్నారు. తప్పుగా ముద్రించిన మ్యాప్‌లను వెంటనే తొలగించి, భారత భౌగోళిక సరిహద్దులను సక్రమంగా ప్రతిబింబించే మ్యాప్‌లను ఏర్పాటు చేయాలని రెస్టారెంట్‌ యాజమాన్యానికి విజ్ఞ‌ప్తి చేశారు.

భారత బాక్సింగ్‌ జట్టు కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన కొద్ది గంట‌ల‌కే ఈ వివాదం తెర‌పైకి వ‌చ్చింది. మహిళల విభాగంలో ప్రీతి పవార్‌, జైస్మిన్‌ లాంబోరియా, సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి, ప్రియా ఘంగాస్‌ తమ తమ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో సచిన్‌ సివాచ్‌, అంకుశ్‌ పంఘాల్‌ మరో రెండు స్వర్ణాలు అందించడంతో భారత్‌ రికార్డు స్థాయిలో మొత్తం ఏడు బాక్సింగ్ గోల్డ్ మెడ‌ల్స్ ఖాతాలో వేసుకుంది. మహిళల 70 కేజీల ఫైనల్లో లవ్లీనా బోర్గొహైన్‌ ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా-స్యూ గ్రీన్‌ట్రీ చేతిలో 4-1 తేడాతో ఓడి రజత పతకంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. అయితే, భారత బాక్సర్ల చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విందు వేడుకలో పతకాల సంబరాల కంటే.. భారత మ్యాప్‌లోని లోపాలే చర్చనీయాంశంగా మారాయి. దేశ భౌగోళిక సమగ్రతను ప్రతిబింబించేలా మ్యాప్‌ను సవరించాలని భారత బాక్సింగ్‌ బృందం రెస్టారెంట్‌ యాజమాన్యాన్ని కోరింది.

Advertisement
Advertisement