త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WABA | తల్లి పాలే శిశువుకు తొలి టీకా

WABA | తల్లి పాలు శిశువుకు ప్రకృతి అందించిన సంపూర్ణ పోషకాహారమని, అవే బిడ్డకు తొలి టీకాలా పనిచేస్తాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి తల్లి, ప్రతి కుటుంబానికి తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలని అధికారులను ఆదేశించారు.

P

Telangana | Published On Aug 1, 2026, 7.57 pm IST

WABA | తల్లి పాలే శిశువుకు తొలి టీకా
Advertisement
  • ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను విజయవంతం చేయాలి
  • తొలి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి
  • మంత్రి సీత‌క్క పిలుపు

WABA | తల్లి పాలు శిశువుకు ప్రకృతి అందించిన సంపూర్ణ పోషకాహారమని, అవే బిడ్డకు తొలి టీకాలా పనిచేస్తాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి తల్లి, ప్రతి కుటుంబానికి తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని మంత్రి సూచించారు. తల్లి పాలు ప్రతి శిశువు తొలి హక్కు అని పేర్కొన్న ఆమె.. పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రమ్‌) శిశువులో రోగనిరోధక శక్తిని పెంచే సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయని తెలిపారు.

బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు అందించడం అత్యంత కీలకమని మంత్రి చెప్పారు. తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలనే ఇవ్వాలని, ఆ తర్వాత వయస్సుకు తగిన అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్ల వరకు తల్లిపాలను కొనసాగించడం వల్ల శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు. తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించి, శాస్త్రీయ అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాలు, వార్డుల్లో అవగాహన సమావేశాలు, ఇంటింటి సందర్శనలు, కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అంగ‌న్‌డీ టీచర్లు, హెల్పర్లు, సూపర్‌వైజర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి గర్భిణీలు, బాలింతలు, ఆరు నెలలలోపు శిశువుల తల్లులు, రెండేళ్లలోపు పిల్లల తల్లులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇవ్వాలని సూచించారు.

ప్రసవం జరిగే ప్రతి ఆసుపత్రిలో శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలు అందేలా వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. తల్లి పాల ప్రోత్సాహంలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని, ప్రతి అంగన్‌వాడీ కేంద్రం తల్లి-శిశు ఆరోగ్యానికి మార్గదర్శక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. పోషకాహార లోపం లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి శిశువు ఆరోగ్యవంతమైన జీవితానికి తల్లి పాలే తొలి మెట్టని పేర్కొంటూ.. తల్లి పాల వారోత్సవాల్లో ప్రజాప్రతినిధులు, వైద్యులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement