త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJI Justice Surya Kant | మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలో భాగమే : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

CJI Justice Surya Kant | వివాదాల పరిష్కారానికి కోర్టులే అంతిమ మార్గం కాదని, పరస్పర చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా సైతం సాధ్య‌మేన‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. భారతీయ సంప్రదాయంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వం సైతం భాగ‌మేన‌ని తెలిపారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ మధ్యవర్తిత్వ సదస్సు రెండో రోజు శనివారం ఆయన కీలక ప్రసంగం చేశారు.

P

National | Published On Aug 1, 2026, 9.45 pm IST

CJI Justice Surya Kant | మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలో భాగమే : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
Advertisement

CJI Justice Surya Kant | వివాదాల పరిష్కారానికి కోర్టులే అంతిమ మార్గం కాదని, పరస్పర చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా సైతం సాధ్య‌మేన‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. భారతీయ సంప్రదాయంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వం సైతం భాగ‌మేన‌ని తెలిపారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ మధ్యవర్తిత్వ సదస్సు రెండో రోజు శనివారం ఆయన కీలక ప్రసంగం చేశారు. మధ్యవర్తిత్వ చట్టం 2023లో అమల్లోకి వచ్చినా.. ఈ విధానం భారతీయ సంస్కృతిలో శతాబ్దాలుగా భాగమైందని సీజేఐ పేర్కొన్నారు. ఇటీవల శాసన, న్యాయ వ్యవస్థలు దీనికి మరింత బలం చేకూర్చాయని చెప్పారు. కోర్టు వివాదాల కంటే పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల సమయం, ఖర్చుతో పాటు సంబంధాలు కూడా నిలిచి ఉంటాయని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన ఇద్దరు సోదరీమణుల కథను ఉదాహరణగా చెప్పారు. ఒకే నారింజ పండు కోసం ఇద్దరూ వాదించుకోవడంతో చివరకు దాన్ని సగం సగం పంచుకున్నారని తెలిపారు. అయితే ఒకరికి పండు గుజ్జు, మరొకరికి తొక్క మాత్రమే అవసరమనే విషయాన్ని ముందుగానే పరస్పరం చెప్పుకుని ఉంటే ఇద్దరికీ పూర్తి ప్రయోజనం దక్కేదని పేర్కొన్నారు. సమస్యలపై స్పష్టమైన సంభాషణ ఉంటే వివాదాలకు మెరుగైన పరిష్కారం లభిస్తుందనే సందేశాన్ని ఈ ఉదాహరణ ద్వారా వివరించారు. వేదాలు, రామాయణం, మహాభారతం వంటి భారతీయ ప్రాచీన గ్రంథాల్లో కూడా మధ్యవర్తిత్వానికి సంబంధించిన అనేక ప్రస్తావనలు ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ గుర్తు చేశారు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పేర్కొన్న సామ, దాన, భేద, దండోపాయం అనే నాలుగు విధానాల్లో మొదటిదైన 'సామ' సూత్రం ఆధునిక మధ్యవర్తిత్వానికి మూలంగా భావించవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రాచీన భారతీయ వ్యవస్థలో ఏ వివాదమైనా ముందుగా కుటుంబ స్థాయిలో పరిష్కరించే ప్రయత్నం జరిగేదని, అది సాధ్యం కాకపోతే వర్గం, సభ స్థాయికి తీసుకెళ్లేవారని చెప్పారు. అక్కడా పరిష్కారం లభించనప్పుడే రాజును ఆశ్రయించేవారని వివరించారు. దీనివల్ల సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించడానికే భారతీయ సమాజం తొలి ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ చెప్పిన మాటలను కూడా సీజేఐ ప్రస్తావించారు. ఇరుపక్షాల మధ్య స్నేహపూర్వక రాజీ కుదిరేలా చేయడం తన న్యాయవాద జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన అంశమని గాంధీజీ చెప్పారని గుర్తుచేశారు. మధ్యవర్తిత్వం అనేది కేవలం చట్టపరమైన విధానం మాత్రమే కాదని, భారతీయ జీవన విధానంలో అంతర్లీనంగా ఉన్న విలువ అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement