త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhishek Sharma | అభిషేక్ శ‌ర్మ బ్యాట్‌ను చెక్ చేసిన కివీస్ ప్లేయ‌ర్లు.. ఏంటి సంగ‌తి..?

Abhishek Sharma | గువాహటిలో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చేసిన విధ్వంసకర బ్యాటింగ్ న్యూజిలాండ్ ఆటగాళ్లను విస్మయానికి గురిచేసింది. యువరాజ్ సింగ్ పేరిట ఉన్న భారత ఆటగాడి అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డును అతను కేవలం రెండు బంతుల తేడాతో కోల్పోయినా, అతని ఇన్నింగ్స్ మైదానంలోనూ, బయట‌ పెద్ద చర్చకు దారితీసింది.

S

Sports | Published On Jan 26, 2026, 6.46 am IST

Abhishek Sharma | అభిషేక్ శ‌ర్మ బ్యాట్‌ను చెక్ చేసిన కివీస్ ప్లేయ‌ర్లు.. ఏంటి సంగ‌తి..?
Advertisement

Abhishek Sharma | గువాహటిలో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చేసిన విధ్వంసకర బ్యాటింగ్ న్యూజిలాండ్ ఆటగాళ్లను విస్మయానికి గురిచేసింది. యువరాజ్ సింగ్ పేరిట ఉన్న భారత ఆటగాడి అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డును అతను కేవలం రెండు బంతుల తేడాతో కోల్పోయినా, అతని ఇన్నింగ్స్ మైదానంలోనూ, బయట‌ పెద్ద చర్చకు దారితీసింది. మ్యాచ్ అనంత‌రం అభిషేక్ బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న కారణంగా ఆశ్చర్యపోయిన డివాన్ కాన్‌వే, జేకబ్ డఫీ అతని బ్యాట్‌ను పరిశీలిస్తున్న దృశ్యాలు వైర‌ల్ అయ్యాయి. భారత్ చేధించాల్సిన లక్ష్యం 155 పరుగులు మాత్రమే. కానీ ఆ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే చేధించి ప్రత్యర్థిపై పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించింది.

సంజూ గోల్డెన్ డ‌క్‌..

చేజ్ తొలి బంతికే సంజూ శాంసన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినా, ఆ తర్వాత భారత బ్యాటింగ్ న్యూజిలాండ్ బౌలర్లకు ఎలాంటి ఊపిరి పీల్చుకునే అవకాశమే ఇవ్వలేదు. అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి, టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో రెండో వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ముందున్నది మాత్రం యువ‌రాజ్ సింగ్ కావ‌డం విశేషం. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే అర్ధసెంచరీ చేయ‌డం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ పవర్‌ప్లేలోనే 94/2 స్కోరు చేసి, టీ20ల్లో తన‌ రెండో అత్యుత్తమ పవర్‌ప్లే రికార్డును నమోదు చేసింది. ఇషాన్ కిషన్ 13 బంతుల్లో వేగంగా 28 పరుగులు చేసి అవుట్ కాగా, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగగానే స్కోరు వేగం మరింత పెరిగింది. తన ప్రత్యేక స్కూపులు, ఫ్లిక్స్‌తో బౌండరీలను బాదుతూ సూర్య, అభిషేక్ కలిసి న్యూజిలాండ్ బౌలింగ్‌ను చిత్తుచేశారు.

బౌలింగ్‌లోనూ ఆధిప‌త్యం..

బౌలింగ్ విభాగంలో కూడా భారత్ పూర్తి ఆధిపత్యం చూపించింది. దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన రవి బిష్ణోయ్‌ విశ్రాంతి తీసుకున్న వరుణ్ చక్రవర్తి స్థానంలో అవకాశం దక్కించుకుని దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ 4 వికెట్లకు 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత్ పవర్‌ప్లేలోనే న్యూజిలాండ్‌ను 36/3కు కట్టడి చేసి మ్యాచ్‌పై పట్టుబిగించింది. హార్దిక్ పాండ్యా తొలి ఓవర్‌లోనే వెనక్కి పరుగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ పట్టి డివాన్ కాన్‌వే (1) పెవిలియన్‌కు పంపాడు. తరువాతి ఓవర్‌లో ర‌చిన్ రవీంద్ర (4) షాట్ మిస్ చేయడంతో డీప్ స్క్వేర్ లెగ్‌లో బిష్ణోయ్ క్యాచ్ పట్టాడు. రెండో మార్పుగా వచ్చిన బుమ్రా వెంటనే ప్రభావం చూపుతూ 3 వికెట్లకు 17 పరుగులు ఇచ్చి మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా త‌న‌దైన బౌలింగ్‌తో టిమ్ సీఫర్ట్ (12) ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టాడు.

నిరాశ ప‌రిచిన కుల్దీప్‌..

ఇక కుల్దీప్ యాదవ్‌కు మాత్రం ఈ మ్యాచ్‌లో ఆశించిన ఫలితం దక్కలేదు. తొలి ఓవర్‌లో కేవలం మూడు పరుగులు ఇచ్చిన అతను, రెండో ఓవర్‌లో 19 పరుగులు ఇచ్చి న్యూజిలాండ్ బ్యాటర్లకు తాత్కాలిక ఊపునిచ్చాడు. అయితే బుమ్రా, హార్దిక్, బిష్ణోయ్‌ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్ మళ్లీ నియంత్రణ సాధించి ప్రత్యర్థికి పెద్ద స్కోరు చేసే అవకాశం ఇవ్వలేదు. ఇక టూకీగా చెప్పాలంటే అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్, సూర్యకుమార్ చురుకైన ఇన్నింగ్స్, బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శనతో భారత్ గువాహటిలో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి, సిరీస్‌పై పూర్తిస్థాయి పట్టు సాధించింది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0 ఆధిక్యాన్ని సాధించ‌డ‌మే కాక‌, సిరీస్‌ను కైవ‌స్ం చేసుకుంది. ఇక 4వ టీ20 మ్యాచ్‌ను ఈ నెల 28వ తేదీన విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement