త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

INDW Vs SLW | స‌త్తా చాటిన భార‌త్‌.. లంక‌పై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్‌..

INDW Vs SLW | తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన మ‌హిళ‌ల టీ20 5వ మ్యాచ్‌లో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజ‌యంతో భార‌త్ 5 టీ20ల సిరీస్ ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 5 మ్యాచ్‌లలోనూ భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు శ్రీ‌లంక‌పై పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది.

S

Sports | Published On Dec 30, 2025, 10.39 pm IST

INDW Vs SLW | స‌త్తా చాటిన భార‌త్‌.. లంక‌పై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్‌..
Advertisement

INDW Vs SLW | తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన మ‌హిళ‌ల టీ20 5వ మ్యాచ్‌లో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజ‌యంతో భార‌త్ 5 టీ20ల సిరీస్ ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 5 మ్యాచ్‌లలోనూ భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు శ్రీ‌లంక‌పై పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్ విభాగాల్లో టీమిండియా స‌మిష్టి కృషితో రాణించింది. ఈ క్ర‌మంలో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయ‌గ‌లిగింది. ఈ ఏడాదిలో భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ సాధించ‌గా ఆ త‌రువాత నిర్వ‌హించిన ఈ టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయ‌డంతో ఈ ఏడాదికి ఘ‌నంగా ముగింపు ప‌లికిన‌ట్లు అయింది. ఇక ఇవాళ్టి మ్యాచ్‌లో భార‌త్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో శ్రీ‌లంక జ‌ట్టు త‌డ‌బ‌డింది. ఆరంభంలో ల‌క్ష్యాన్ని ఛేదించేట్లుగానే క‌నిపించింది. కానీ చివ‌ర్లో వ‌రుస‌గా వికెట్ల‌ను కోల్పోయారు. దీంతో ఓట‌మి పాల‌వ‌క త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక‌పై భార‌త్ 15 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీ‌లంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భార‌త్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 68 ప‌రుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. దీంతో వ‌రుస‌గా వికెట్ల‌ను కోల్పోయిన‌ప్ప‌టికీ భార‌త్ గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌గలిగింది. ఇక హ‌ర్మ‌న్ త‌ప్ప మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకునేలా బ్యాటింగ్ చేయ‌లేదు. చివ‌ర్లో అరుంధ‌తి రెడ్డి మాత్రం కాసేపు మెరుపులు మెరిపించింది. కేవ‌లం 11 బంతుల్లోనే ఆమె 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 27 ప‌రుగులు చేసింది. ఇక లంక బౌల‌ర్ల‌లో క‌విష దిల్హ‌రి, ర‌ష్మిక సెవ్వండి, చ‌మారి ఆట‌ప‌ట్టులు త‌లా 2 వికెట్లు తీశారు. నిమాషా మీపాగెకు 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. కెప్టెన్ చ‌మారి ఆట‌ప‌ట్టు కేవ‌లం 2 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరుకే ఔట‌వ్వ‌గా ఆ త‌రువాత క్రీజులో నిలిచిన హాసిని పెరిరా, ఇమెషా దుల‌ని 2వ వికెట్‌కు 79 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని జోడించారు. అయితే ఆ త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన ప్లేయ‌ర్లు కాసేపు షాట్లు ఆడే ప్ర‌య‌త్నం చేశారు. కానీ వికెట్ల‌ను స‌మ‌ర్పించుకున్నారు. ఇక లంక ప్లేయ‌ర్ల‌లో ఓపెన‌ర్ హాసిని పెరీరా 42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 65 ప‌రుగులు చేయ‌గా, మ‌రో ప్లేయ‌ర్ ఇమెషా దుల‌ని 39 బంతుల్లో 8 ఫోర్ల‌తో 50 ప‌రుగులు చేసింది. వీరిద్ద‌రూ భార‌త్‌ను కాసేపు ఇబ్బంది పెట్టారు. కానీ వీరి వికెట్ల‌ను కోల్పోయిన అనంత‌రం లంక ఏ ద‌శ‌లోనూ కోలుకోలేక‌పోయింది. ఆ త‌రువాత వ‌చ్చిన ప్లేయ‌ర్లు వ‌చ్చిన‌ట్లే వెను దిరిగారు. దీంతో భార‌త్ సునాయాసంగా విజ‌యం సాధించింది. మొత్తం 20 ఓవ‌ర్లు ఆడిన లంక 7 వికెట్ల‌ను కోల్పోయి 160 ప‌రుగులే చేయ‌గ‌లిగింది. ఇక భార‌త్ బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ‌, అరుంధ‌తి రెడ్డి, స్నేహ రానా, వైష్ణ‌వి శ‌ర్మ‌, శ్రీ చ‌ర‌ణి, అమ‌న్‌జోత్ కౌర్‌ల‌కు త‌లా 1 వికెట్ చొప్పున ద‌క్కింది. ఈ సిరీస్‌ను 5-0 తేడాతో భార‌త్ క్లీన్ స్వీప్ చేయ‌గా, మ‌రికొద్ది రోజుల్లో భార‌త ప్లేయ‌ర్లు డ‌బ్ల్యూపీఎల్‌తో మ‌ళ్లీ మైదానంలో అడుగు పెట్ట‌నున్నారు. జ‌న‌వ‌రి 9 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement