త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC | పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ ఆగ్ర‌హం.. మంకు ప‌ట్టు ప‌డితే నిషేధం విధించే దిశ‌గా..?

ICC | త్వ‌ర‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు కేవలం కొన్ని రోజులే మిగిలి ఉండగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) టోర్నీ నుంచి తప్పుకునే సూచనలు ఇవ్వడంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు సమాచారం.

S

Sports | Published On Jan 25, 2026, 1.30 pm IST

ICC | పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ ఆగ్ర‌హం.. మంకు ప‌ట్టు ప‌డితే నిషేధం విధించే దిశ‌గా..?
Advertisement

ICC | త్వ‌ర‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు కేవలం కొన్ని రోజులే మిగిలి ఉండగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) టోర్నీ నుంచి తప్పుకునే సూచనలు ఇవ్వడంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు సమాచారం. మొహ్సిన్ నక్వీ నేతృత్వంలోని పీసీబీ బంగ్లాదేశ్ బాటలోనే భారత్‌కు వెళ్లకుండా టోర్నీని బహిష్కరించే ఆలోచన చేస్తే, పాకిస్థాన్ క్రికెట్‌పై కఠినమైన ఆంక్షలు విధించేందుకు ఐసీసీ సిద్ధంగా ఉందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. పాకిస్థాన్ కూడా టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనకుండా తప్పుకుంటే, ద్వైపాక్షిక సిరీస్‌లను పూర్తిగా నిలిపివేయడం, పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో విదేశీ ఆటగాళ్లకు ఎన్ఓసీలు ఇవ్వకుండా నిషేధించడం, ఆసియా కప్‌లో పాల్గొనే హక్కును రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీసీ వర్గాలు హెచ్చరించినట్లు ఆ క‌థ‌నం వెల్లడించింది. ఇది వాస్తవంగా అమలైతే, పాకిస్థాన్ క్రికెట్‌పై దాదాపు సంపూర్ణ నిషేధం విధించినట్లే అవుతుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వివాదాస్ప‌ద‌మ‌వుతున్న మొహ్సిన్ నక్వీ వ్యాఖ్య‌లు..

ఒక ప్రధాన క్రికెట్ దేశంపై ఇలాంటి ఆంక్షలు విధించేందుకు ఐసీసీ ఏ నిబంధనలను ఉపయోగిస్తుందో స్పష్టత లేకపోయినా, ఇంతకుముందు అపార్థైట్ పాలన సమయంలో దక్షిణాఫ్రికాపై 22 సంవత్సరాల పాటు విధించిన నిషేధమే ఏకైక ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్ జట్టును టీ20 ప్రపంచకప్ నుంచి తప్పిస్తూ ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో జరిగే గ్రూప్ దశ మ్యాచ్‌లకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) జట్టును పంపేందుకు నిరాకరించింది. ఐసీసీ ఈ వాదనను తిరస్కరించడంతో పాటు, మూడు వారాల పాటు సాగిన చర్చలు ఫలించకపోవడంతో చివరకు బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లండ్ జట్టును ఎంపిక చేసింది. ఈ వ్యవహారం సద్దుమణిగిందని అనుకుంటున్న తరుణంలో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ మరో వివాదానికి తెరలేపారు. పాకిస్థాన్ టోర్నీలో పాల్గొనడం కూడా ఖరారు కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. టీ20 ప్రపంచకప్‌లో మేము ఆడాలా వద్దా అన్న నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుంది. మా ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయం. వారు వద్దు అంటే ఐసీసీ మరే జట్టునైనా ఆహ్వానించుకోవచ్చు, అని నక్వీ తెలిపారు. ప్రస్తుతం ఆయన దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు.

భారీగా ఆదాయం కోల్పోయే అవ‌కాశం..

ఐసీసీ బోర్డు సమావేశంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచిన ఏకైక దేశం పాకిస్థానే కావడం గమనార్హం. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించే తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో పాకిస్థాన్ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ వివాదంలో బంగ్లాదేశ్‌కు తాము ఏకైక మిత్రులమని పీసీబీ భావిస్తున్నట్లు స్పష్ట‌మైంది. బంగ్లాదేశ్ ఈ టోర్నీలో కీలక భాగస్వామి. కానీ ఈ విషయంలో వారిని అన్యాయంగా చూడటం జరిగింది. బుధవారం జరిగిన సమావేశంలో కూడా నేను ఇదే విషయాన్ని ప్రస్తావించాను. వారి వైఖరి వెనుక అనేక కారణాలున్నాయి. పరిస్థితి వచ్చినప్పుడు అవన్నీ వెల్లడిస్తాను, అని నక్వీ పేర్కొన్నారు. పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటే ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. వందల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని అంచనా. అంతేకాదు, పాకిస్థాన్ స్థానంలో ఉగాండా వంటి చిన్న క్రికెట్ దేశాన్ని చేర్చే అవకాశముంది. అలా జరిగితే, ప్రపంచంలో అత్యధిక ఆదాయం తెచ్చే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా జరగదు. మ‌రి ఐసీసీ ఈ విష‌యంలో ఏం చేస్తుందో చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement