త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IS Bindra | మాజీ బీసీసీఐ అధ్య‌క్షుడు ఐఎస్ బింద్రా క‌న్నుమూత‌.. క్రికెట్ అభివృద్ధికి ఎన‌లేని సేవ‌లు..

IS Bindra | భారత క్రికెట్ పరిపాలన రంగంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్ బింద్రా (ఐ.ఎస్. బింద్రా) కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. బింద్రా మృతితో భారత క్రికెట్ పరిపాలన రంగం ఒక గొప్ప అధ్యాయాన్ని కోల్పోయిందని క్రీడా వర్గాలు నివాళులు అర్పిస్తున్నాయి.

S

Sports | Published On Jan 26, 2026, 7.22 am IST

IS Bindra | మాజీ బీసీసీఐ అధ్య‌క్షుడు ఐఎస్ బింద్రా క‌న్నుమూత‌.. క్రికెట్ అభివృద్ధికి ఎన‌లేని సేవ‌లు..
Advertisement

IS Bindra | భారత క్రికెట్ పరిపాలన రంగంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్ బింద్రా (ఐ.ఎస్. బింద్రా) కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. బింద్రా మృతితో భారత క్రికెట్ పరిపాలన రంగం ఒక గొప్ప అధ్యాయాన్ని కోల్పోయిందని క్రీడా వర్గాలు నివాళులు అర్పిస్తున్నాయి. బింద్రా 1993 నుంచి 1996 వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1978 నుంచి 2014 వరకు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) అధ్యక్షుడిగా కొనసాగుతూ, రాష్ట్ర స్థాయిలో క్రికెట్ అభివృద్ధికి కీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపై ఐసీసీ చైర్మన్, మాజీ బీసీసీఐ కార్యదర్శి జైషా తీవ్ర సంతాపం తెలిపారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ పరిపాలనకు స్తంభంలాంటి వ్యక్తి అయిన ఐ.ఎస్. బింద్రా మరణం చాలా బాధాకరం. ఆయన వారసత్వం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలవాలి. ఓం శాంతి.. అని జైషా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

తొలిసారిగా ఇంగ్లండ్ వెలుప‌ల‌..

1975లో క్రికెట్ పరిపాలన రంగంలో అడుగుపెట్టిన బింద్రా, క్రమంగా దేశంలోని అత్యంత ప్రభావశీల క్రికెట్ నిర్వాహకుల్లో ఒకరిగా ఎదిగారు. 1987 ప్రపంచకప్ నిర్వహణలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1975, 1979, 1983 ప్రపంచకప్‌లు అన్నీ ఇంగ్లాండ్‌లోనే జరిగిన తర్వాత, తొలిసారిగా ఇంగ్లాండ్ వెలుపల టోర్నమెంట్ నిర్వ‌హించ‌డం విశేషం. భారత్, పాకిస్థాన్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచకప్‌ను అప్పట్లో రిలయన్స్ కప్ గా పిలిచేవారు. జగ్మోహన్ దాల్మియా, అప్పటి బీసీసీఐ అధినేత ఎన్‌కేపీ సాల్వే వంటి నేతలతో కలిసి బింద్రా భారత క్రికెట్‌ను వాణిజ్యపరంగా కొత్త దిశలో నడిపించారు. టెలివిజన్ ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనల ద్వారా క్రికెట్ కు భారీ ఆదాయం తెచ్చే రంగంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనంతరం శరద్ పవార్ ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, బింద్రా ఆ సంస్థకు ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా కూడా సేవలందించారు. 2014లో క్రికెట్ పరిపాలన నుంచి అధికారికంగా ఆయ‌న ప‌ద‌వీ విరమణ పొందారు.

ప్ర‌పంచంలోనే అతి పెద్ద క్రికెట్ మార్కెట్‌గా..

భారత క్రికెట్ చరిత్రలో మరో కీలక ఘట్టం 1994లో చోటుచేసుకుంది. ఆ సమయంలో బింద్రా భారత సుప్రీంకోర్టును ఆశ్రయించి, క్రికెట్ ప్రసారాలపై దూరదర్శన్‌కు ఉన్న ఏకాధిపత్యాన్ని సవాల్ చేశారు. కోర్టు అనుకూల తీర్పుతో ఈ మోనోపోలీ ముగిసింది. దాంతో ఈఎస్‌పీఎన్, టీడబ్ల్యుఐ వంటి అంతర్జాతీయ ప్రసార సంస్థలు భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టాయి. దీని ఫలితంగా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్‌గా అవతరించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బింద్రా ప్రస్థానం వివాదాల్లేకుండా సాగలేదు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం అనంతరం లలిత్ మోదీకి మద్దతుగా నిలవడంపై ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే క్రికెట్ సౌత్ ఆఫ్రికా సీఈవోగా హరూన్ లోర్గాట్ నియామకంలో తన పాత్రపై కూడా ప్రశ్నలు వచ్చాయి. అయినప్పటికీ, వాణిజ్యపరంగా ఆధునిక భారత క్రికెట్ నిర్మాణానికి బింద్రా ప్రధాన శిల్పుల్లో ఒకరన్నది క్రీడా వర్గాల ఏకగ్రీవ అభిప్రాయం.

ఆయన సేవలకు గుర్తింపుగా 2015లో మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి ఐ.ఎస్. బింద్రా స్టేడియంగా పేరు పెట్టారు. ఇది భారత క్రికెట్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు శాశ్వత స్మారకంగా నిలిచింది. బింద్రా మృతితో ఒక తరం క్రికెట్ నిర్వాహకుల అధ్యాయం ముగిసినట్లైందని, ఆయన వేసిన బాటలోనే భారత క్రికెట్ ప్రపంచస్థాయిలో మరింత ఎదగాలని అభిమానులు, అధికారులు ఆకాంక్షిస్తున్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement