త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCB | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి తొల‌గించ‌డంపై బంగ్లాదేశ్ తొలి రియాక్ష‌న్‌..!

BCB | ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు రావడానికి భద్రతా కారణాలు చూపిస్తూ బంగ్లాదేశ్ జట్టు నిరాకరించడంతో, వారిని టోర్నీ నుంచి తప్పించి వారి స్థానంలో స్కాట్లండ్ జట్టును చేర్చినట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

S

Cricket | Published On Jan 25, 2026, 12.12 pm IST

BCB | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి తొల‌గించ‌డంపై బంగ్లాదేశ్ తొలి రియాక్ష‌న్‌..!
Advertisement

BCB | ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు రావడానికి భద్రతా కారణాలు చూపిస్తూ బంగ్లాదేశ్ జట్టు నిరాకరించడంతో, వారిని టోర్నీ నుంచి తప్పించి వారి స్థానంలో స్కాట్లండ్ జట్టును చేర్చినట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ 2026కు ముందు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ విడుదల చేసిన అనంతరం, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్ ప్రయాణంపై తమ అభ్యంతరాలను మరింత స్పష్టంగా వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ వరుసగా పలు సమావేశాలు నిర్వహించింది. పూర్తి సభ్య దేశాలన్నింటితో కలిసి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తన వైఖరిని మార్చుకోలేదు. చివరకు టోర్నీలో పాల్గొనకుండా తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఐసీసీ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే బంగ్లాదేశ్ కూడా అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది.

ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కే నిర్ణ‌యం..

ఈ నిర్ణయం ప్రభుత్వ ఆదేశాల మేరకే తీసుకున్నామని బీసీబీ మీడియా కమిటీ చైర్మన్ అమ్జాద్ హొస్సేన్ వెల్లడించారు. ఐసీసీ బోర్డును తాము గౌరవిస్తామని, కానీ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వెళ్లలేమని ఆయన స్పష్టం చేశారు. సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశామని, భారత్‌కు బదులుగా శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహిస్తే ఆడేందుకు సిద్ధమని ఐసీసీకి సూచించామని, అయితే ఆ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించిందని తెలిపారు. మేము ప్రభుత్వంతో చర్చించాం. భారత్‌లో జరిగే ప్రపంచకప్‌కు వెళ్లడం మా ఆటగాళ్లకు, జర్నలిస్టులకు, జట్టుతో పాటు వెళ్లే ఇతరులకు సురక్షితం కాదని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. అందుకే మా మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరాం. కానీ ఐసీసీ అనేక రౌండ్ల చర్చల తర్వాత కూడా అంగీకరించలేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం కావడంతో మేము ఏమీ చేయలేకపోయాం. భద్రతా కారణాల వల్ల భారత్‌లో ఆడటం మాకు సురక్షితం కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం, అని అమ్జాద్ హొస్సేన్ మీడియా సమావేశంలో తెలిపారు.

పాకిస్థాన్ మ‌ళ్లీ అదే పాట‌..

మా వంతు ప్రయత్నం పూర్తిగా చేశాం. ఐసీసీ బోర్డు తీసుకున్న మెజారిటీ నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. మ్యాచ్ వేదిక మార్చడం సాధ్యం కాదని చెప్పిన తర్వాత కూడా మేము మా తరఫున ప్రయత్నాలు కొనసాగించాం. కానీ వారు అంగీకరించకపోవడంతో ఇక చేసేదేమీ లేదని భావించాం, అని పేర్కొన్నారు. కాగా ఈ వ్యవహారంలో పాకిస్థాన్ వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది. గత మూడేళ్లలో పాకిస్థాన్ పలుమార్లు టోర్నీలను బహిష్కరిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. 2023 ఆసియా కప్ కోసం భారత్ పాకిస్థాన్‌కు వెళ్లలేమ‌ని చెప్పినప్పుడు, వన్డే ప్రపంచకప్ 2023ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ హెచ్చరించినా చివరకు ఆడింది. అలాగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా భారత్ పాకిస్థాన్‌కు వెళ్లకపోవడంతో, పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకుంటామని బెదిరించింది. ఈసారి కారణం భిన్నమైనప్పటికీ, మళ్లీ పాకిస్థాన్ పాత పాట‌నే మ‌రోసారి ఆల‌పించింది. అయితే బంగ్లాదేశ్ తప్పుకోవడం, స్కాట్లండ్ ప్రవేశం, భద్రతా కారణాలతో దేశాల మధ్య పెరుగుతున్న వివాదాలు.. ఇవన్నీ కలిసి 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందే రాజకీయ, క్రీడా వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement