త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alex Carey | ఆసీస్ ప్లేయ‌ర్ అలెక్స్ క్యారీ నాటౌట్ పై దుమారం.. ప‌నిచేయ‌ని టెక్నాల‌జీ..

S

Cricket | Published On Dec 18, 2025, 11.44 am IST

Alex Carey | ఆసీస్ ప్లేయ‌ర్ అలెక్స్ క్యారీ నాటౌట్ పై దుమారం.. ప‌నిచేయ‌ని టెక్నాల‌జీ..
Advertisement

Alex Carey | అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల‌లో ప్ర‌స్తుతం టెక్నాల‌జీని బాగా వినియోగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్లేయ‌ర్ల బ్యాటింగ్ లేదా బౌలింగ్ నైపుణ్యాల‌ను ప‌రిశీలించేందుకు, డీఆర్ఎస్‌, స్నికో వంటి అనేక అంశాల్లో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని విస్తృతంగా ఉప‌యోగిస్తున్నారు. అయితే ఎంత టెక్నాల‌జీ అయినా 100 శాతం క‌చితత్వంతో ప‌నిచేయ‌దు. అందులోనూ కొన్ని లోపాలు ఉంటాయి. అలాగే అప్పుడ‌ప్పుడు కొన్ని వైఫ‌ల్యాలు కూడా చోటు చేసుకుంటాయి. దీని వ‌ల్ల మ్యాచ్‌ల ఫ‌లిత‌మే ఊహించ‌ని విధంగా మారిపోతుంది. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా అడిలైడ్‌లో కొన‌సాగుతున్న మూడో టెస్ట్‌లో స్నికో మీట‌ర్ వైఫ‌ల్యం కార‌ణంగా ఆసీస్ ప్లేయ‌ర్ ఔట్ అయిన‌ప్ప‌టికీ అంపైర్లు నాటౌట్‌గా ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. దీంతో ఆస్ట్రేలియా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో మ‌రిన్ని ఎక్కువ ప‌రుగులు రాబ‌ట్టింది.

అడిలైడ్ లో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న యాషెస్ సిరీస్ 3వ టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలోనే ఆసీస్ జ‌ట్టు త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 371 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అయితే ఆసీస్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా క్రీజులో అలెక్స్ క్యారీ 72 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద కొన‌సాగుతున్న‌ప్పుడు ఇంగ్లండ్ బౌల‌ర్ జాష్ టంగ్ వేసిన బంతి అత‌ని బ్యాట్‌ను తాకుతూ వెళ్లింది. ఈ క్ర‌మంలో శ‌బ్దం కూడా వ‌చ్చింది. దీంతో ఇంగ్లండ్ ప్లేయ‌ర్లు అప్పీల్ చేశారు. కానీ ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వెంట‌నే డీఆర్ఎస్ తీసుకోగా రీప్లేలో స్నికో మీట‌ర్‌లో బ్యాట్‌ను బంతి త‌గ‌ల‌క ముందే పెద్ద స్పైక్ క‌నిపించింది. కానీ బ్యాట్‌ను బంతి వీడి వెన‌క్కి వెళ్లే స‌మ‌యంలో ఎలాంటి స్పైక్ క‌నిపించ‌లేదు. అయితే బంతి అలా వెళ్లే స‌మ‌యంలో మాత్రం శ‌బ్దం వినిపించింది. దీంతో క‌చ్చితంగా అది ఔట్ అని అంద‌రూ భావించారు. కానీ స్నికోలో మాత్రం బ్యాట్ వ‌ద్ద బంతి ఉన్న‌ప్పుడు ఎలాంటి స్పైక్ క‌నిపించ‌లేద‌ని థ‌ర్డ్ అంపైర్ ప్లేయ‌ర్‌ను నాటౌట్‌గా ప్ర‌క‌టించాడు. దీంతో ఇంగ్లండ్ ప్లేయ‌ర్లు ఆగ్ర‌హం, అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

అయితే మ్యాచ్ తొలి రోజు ఆట అనంత‌రం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో అలెక్స్ క్యారీ ఆ సంఘ‌ట‌న‌పై స్పందించాడు. ఆ స‌మ‌యంలో బంతి బ్యాట్ ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ప్పుడు త‌న‌కు కూడా ఏదో శబ్దం వినిపించింద‌ని, అది వింత‌గా ఉంద‌ని, అయితే అది ఔటా, కాదా అన్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని అన్నాడు. తాను నిజంగా ఔట్ అయి ఉంటే త‌న‌కు తెలుస్తుంద‌ని, తాను అప్పుడు వెళ్లిపోయి ఉండేవాడిన‌ని తెలిపాడు. అయితే ఆ బంతికి అంపైర్ నాటౌట్ ఇచ్చాడ‌ని, కానీ త‌న‌ను ఔట్‌గా ప్ర‌క‌టించినా కూడా తాను రివ్యూ తీసుకునేవాడిన‌ని, అది సందేహంగా ఉంది క‌నుక బ్యాట్స్‌మ‌న్‌కు అనుకూలంగా అంపైర్లు నిర్ణ‌యం తీసుకున్నార‌ని, అదృష్టం త‌న వైపు ఉండ‌డం వ‌ల్లే అలా జ‌రిగింద‌ని అత‌ను చెప్పుకొచ్చాడు. అయితే ఇంగ్లండ్ శిబిరం మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

యాషెస్ సిరీస్ తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల‌లోనూ అంపైర్లు స‌రిగ్గా ఇలాంటి అనుమాస్ప‌ద నిర్ణ‌యాల‌నే తీసుకున్నారు. అలాగే ప‌లు సంద‌ర్భాల్లోనూ టెక్నాల‌జీ ఫెయిల్ అయింది. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకుంది. అయితే తాజా సంఘ‌ట‌న‌పై అటు స్నికో మీట‌ర్ టెక్నాల‌జీని అందించే సంస్థ బీబీజీ స్పోర్ట్స్ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పడం విశేషం. ఈ క్ర‌మంలోనే అలెక్స్ క్యారీ క‌చ్చితంగా ఔట్ అయ్యాడ‌ని ఇంగ్లండ్ ప్లేయ‌ర్లు వాదిస్తున్నారు. కాగా అలెక్స్ క్యారీకి ఆ లైఫ్ వ‌చ్చాక అత‌ను మ‌రో 34 ప‌రుగులు చేశాడు. దీంతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో మ‌రికొన్ని ఎక్కువ ప‌రుగుల‌ను రాబ‌ట్టుకోగ‌లిగింది.

https://twitter.com/i/status/2001191078913782215

Advertisement

తాజావార్తలు

Advertisement