త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NASA | నాసా ఆశలన్నీ కీటకాలపైనే.. చంద్రుడు, మార్స్‌పై మనుషులు బతికేందుకు ఇవి ఎలా సహాయపడతాయి?

NASA | భూమికి అవతల, అంతరిక్షంలో మనుషులు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం సాధ్యమేనా? ప్రయోగాల కోసం అంతరిక్షంలోకి వెళ్లిన కొంతమంది వ్యోమగాముల ఆహారం, వ్యర్థాల నిర్వహణే పెద్ద సవాలుగా ఉంది.

S

Science | Published On Dec 25, 2025, 10.30 am IST

NASA | నాసా ఆశలన్నీ కీటకాలపైనే.. చంద్రుడు, మార్స్‌పై మనుషులు బతికేందుకు ఇవి ఎలా సహాయపడతాయి?
Advertisement

NASA | భూమికి అవతల, అంతరిక్షంలో మనుషులు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం సాధ్యమేనా? ప్రయోగాల కోసం అంతరిక్షంలోకి వెళ్లిన కొంతమంది వ్యోమగాముల ఆహారం, వ్యర్థాల నిర్వహణే పెద్ద సవాలుగా ఉంది. అలాంటిది శాశ్వాత నివాసం అంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. అందుకే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రత్యామ్నయ మార్గాలపై దృష్టిసారించింది. టెక్నాలజీతో పాటు బయాలజీపై ఆధారపడితే మెరుగైన ఫలితాలు వస్తాయని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతరిక్ష ప్రయోగంలో కీటకాలను వినియోగించాలని ప్లాన్ చేస్తున్నారు.

అంతరిక్ష పరిశోధనలకు కీటకాలు కొత్తేమీ కాదు

భూమిపై పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీటకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొక్కల పరాగ సంపర్కం, వ్యర్థాల నిర్వహణ, నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతున్నాయి. కీటకాల ఈ పనితీరునే చంద్రుడు, మార్స్‌పై వాతావరణ సమతుల్యత ఏర్పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నిజానికి అంతరిక్ష పరిశోధనాల్లో కీటకాల పాత్ర కొత్తదేమీ కాదు. 1947లోనే నాసా తొలిసారిగా పండ్లపై వాలే ఈగలు (ఫ్రూట్ ఫ్లైస్)ను అంతరిక్షంలోకి పంపించింది. తక్కువ జీవితచక్రం, మానవ జన్యు లక్షణాలతో సారూప్యత కారణంగా వాటిని ఎంపిక చేశారు. వాటితో రేడియేషన్, రోగనిరోధక ప్రతిస్పందన వంటి వాటిపై పరిశోధనలు చేశారు. ఆ తర్వాత చీమలు, సీతాకోకచిలుక లార్వా వంటి కీటకాలను కూడా ప్రయోగాల కోసం పంపించారు. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మ గురుత్వాకర్షణ (మైక్రోగ్రావిటీ) కారణంగా కీటకాలు భూమిపై మాదిరిగా అంతిరక్షంలో కదలలేకపోయాయి. దీనివల్ల అవి తమ సహజ విధులైన పరాగ సంపర్కం, నేల సంరక్షణ చేయలేకపోయాయి.

చంద్రుడు, అంగారకుడిపై కొత్త అవకాశాలు

అంతరిక్షంలో అంటే మైక్రోగ్రావిటీ కారణంగా కీటకాలు కదలలేకపోయాయి. కానీ చంద్రుడు, మార్స్‌పై గురుత్వాకర్షణ ఉంది. ఇది భూమితో పోలిస్తే తక్కువే అయినప్పటికీ కీటకాలు నడవడానికి, ఎగరడానికి, ఆహారం తీసుకోవడానికి, పునరుత్పత్తి చేయడానికి సరిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో అంతరిక్ష కేంద్రాల్లో కేవలం పరిశోధన అంశాలకే కాకుండా జీవ వ్యవస్థలో భాగస్వాములుగా కీటకాలను వినియోగించే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

అంతరిక్షంలో వ్యవసాయం సాధ్యమే!

భూమిని దాటి అంతరిక్షంలో ఆవాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఆహార ఉత్పత్తినే పెద్ద సవాలు. అయితే చంద్రుడు, మార్స్‌పైకి కీటకాలను పంపించడం వల్ల వాటి సాయంతో అక్కడ వ్యవసాయం చేయడం కూడా సాధ్యపడుతుందని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా తక్కువ సమయంలో పండే టమాటాలు, మిరపకాయలు, స్ట్రాబెర్రీలు, ఆకుకూరలను పండించాలని అనుకుంటున్నారు. కానీ వీటిని పండించేందుకు మొక్కల పరాగ సంపర్కం ఒక సమస్యగా మారుతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు తుమ్మెదలు సహాయపడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే భూమిపై గ్రీన్ హౌస్‌ల్లో తుమ్మెదలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. దీంతో నియంత్రిత ఉష్ణోగ్రత, వెలుతురు, తేమతో కూడిన పరిస్థితుల్లో చిన్న కాలనీలు ఏర్పాటు చేసి చంద్రుడు, అంగారకుడిపై పంట దిగుబడి పెంచవచ్చని అంచనా వేస్తున్నారు.

వ్యర్థాలను వనరులుగా మార్చేయొచ్చు

వ్యర్థాల నిర్వహణలో కూడా కీటకాలు కీలకం. బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలు సేంద్రీయ వ్యర్థాలను త్వరగా విచ్ఛిన్నం చేయగలవు. దీంతో ఎరువుగా ఉపయోగించబడే పోషక పదార్థాలు, ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న జీవ ద్రవ్యం లభిస్తుంది. అలాగే మీల్‌వార్మ్స్ మొక్కల వ్యర్థాలను ప్రాసెస్ చేయగలవు. అవసరమైతే వ్యోమగాములకు అదనపు ప్రోటీన్ ఆహారంగా కూడా ఉపయోగించవచ్చు. ఇవి భూమిపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన నేల అంటే కేవలం ఖనిజాలను మాత్రమే కాదు.. సూక్ష్మీజీవులు, చిన్న జీవులతో కలిసి సమతుల్యం పాటించాలి. భూమిపై స్ప్రింగ్‌టెయిల్స్, మైట్స్ వంటి కీటకాలు నేల నిర్మాణాన్ని కాపాడతాయి. అంతరిక్ష ఆవాసాల్లో ఇవి మూసివేసిన పర్యావరణ వ్యవస్థల్లో పనిచేస్తూ పంటల పెరుగుదలకు దోహదపడతాయి.

అంతరిక్ష నివాసాలు క్లోజ్‌డ్ లూప్ వ్యవస్థలపై ఆధారపడాలని నాసా భావిస్తోంది. అంటే.. ఒక ప్రక్రియలో వచ్చిన వ్యర్థాలను, మరో ప్రక్రియకు ముడి పదార్థంగా మారుతుంది. ఈ వ్యవస్థకు కీటకాలు అనువైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో సంక్లిష్ట యంత్రాల అవసరం తగ్గించి, భూమిపై సహజంగా జరిగే జీవ చక్రాల్లో సమతుల్యం కొనసాగేలా చేస్తుందని భావిస్తున్నారు. చంద్రుడు, మార్స్‌పై మానవ జీవనం కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాలనే భావనకు ఇది పూర్తి భిన్నమైన ఆలోచన కానీ.. కోట్ల సంవత్సరాలుగా భూమిపై జీవనాన్ని కీటకాలే నిలబెట్టాయి. కాబట్టి భవిష్యత్తులో మనుషులు భూమి అవతల జీవించేందుకు కూడా కీటకాలే పునాది వేయవచ్చని నాసా శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement