త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NASA | సూపర్‌ సునామీని పట్టేసిన నాసా.. తొలిసారిగా అంతరిక్షం నుంచి ఫొటో..!

NASA | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పసిఫిక్ మహాసముద్రాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లిన భారీ సునామీని అంతరిక్షం నుంచి తొలిసారిగా చిత్రీకరించింది. నాసా అత్యాధునిక ఉపగ్రహం తీసిన ఈ చిత్రాలు శాస్త్రవేత్తలు సైతం విస్మయపోయారు.

P

Science | Published On May 3, 2026, 1.30 pm IST

NASA | సూపర్‌ సునామీని పట్టేసిన నాసా.. తొలిసారిగా అంతరిక్షం నుంచి ఫొటో..!
Advertisement

NASA | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పసిఫిక్ మహాసముద్రాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లిన భారీ సునామీని అంతరిక్షం నుంచి తొలిసారిగా చిత్రీకరించింది. నాసా అత్యాధునిక ఉపగ్రహం తీసిన ఈ చిత్రాలు శాస్త్రవేత్తలు సైతం విస్మయపోయారు. సునామీ అనేది ఒకేలా సూటిగా దూసుకెళ్లే అల కాదని, మార్గమధ్యంలో రూపం మార్చుకుంటూ సాగే సంక్లిష్ట శక్తి వ్యవస్థని ఈ దృశ్యాలు స్పష్టంచేశాయి. ‘ది సిస్మిక్ రికార్డ్’లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఈ చారిత్రాత్మక పరిశీలనను నాసా, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ సీఎన్‌ఈఎస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ’ (SWOT) ఉపగ్రహం నమోదు చేసింది.

సముద్ర నిర్మాణాన్ని అర్థం చేసుకునే..

జూలై 29న రష్యా కమ్చట్కా ద్వీపకల్పానికి సమీపంలోని కురిల్-కమ్చట్కా సబ్‌డక్షన్ జోన్‌లో సంభవించిన 8.8 తీవ్రతతో భూకంపం వల్ల ఏర్పడిన సునామీని ఇది సవివరంగా రికార్డ్ చేసింది. 1900 తర్వాత నమోదైన అతిపెద్ద భూకంపాల్లో ఇది ఆరో స్థానంలో నిలిచింది. నాసా వివరాల ప్రకారం.. భూమిపై ఉన్న జలవనరుల ఉపరితల ఎత్తును కొలవడానికి ఎస్‌డబ్ల్యూఏటీ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇప్పటివరకు సునామీలపై శాస్త్రవేత్తలకు లభించిన సమాచారం ప్రధానంగా సముద్రంలో అమర్చిన డీప్-ఓషన్ అసెస్‌మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ సునామీస్ (డార్ట్) వంటి పరికరాల ద్వారానే వచ్చేది. అయితే అవి కొద్దిమాత్రంలోనే పాయింట్ల నుంచి సమాచారం అందించేవి. ఇప్పుడు ఎస్‌డబ్ల్యూఓటీ ఉపగ్రహం సుమారు 120 కిలోమీటర్ల వెడల్పు పరిధిలో సముద్ర ఉపరితలాన్ని ఒకేసారి స్కాన్ చేయగలగడం వల్ల, సునామీ మొత్తం నిర్మాణాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే అవకాశం లభించింది.

వాస్తవ డేటాకు దగ్గరగా..

తాజా పరిశోధనల్లో తరంగాల వ్యాప్తి (డిస్పర్షన్) అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రూపొందించిన సిమ్యులేషన్లు, వాస్తవ డేటాకు మరింత దగ్గరగా ఉన్నట్లు తేలింది. దీని ద్వారా ప్రస్తుతం వినియోగంలో ఉన్న సునామీ అంచనా మోడ‌ల్స్‌ను గణనీయంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఐస్‌లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త ఏంజెల్ రుయిజ్-ఆంగులో ఈ పరిశీలనను ‘సముద్రాన్ని ఒకేసారి విస్తృతంగా చూడగల కొత్త కళ్ల జంట’గా అభివర్ణించారు. ఇప్పటివరకు భారీ సునామీలు విరగకుండా ఒకే అల రూపంలో ముందుకు సాగుతాయని భావించేవారు. అయితే, ఎస్‌డబ్ల్యూఓటీ ఉపగ్రహం అందించిన తాజా డేటా ఆ అభిప్రాయాన్ని పూర్తిగా ఖండించింది.

విభిన్న దశల్లో విస్తరించి.. చిన్న చిన్న అలలుగా..

ఈ పరిశీలనల ప్రకారం.. సునామీ శక్తి ఒకే దిశలో ప్రయాణించకుండా మార్గమధ్యంలో విభిన్న దిశల్లో విస్తరించి, అనేక చిన్న అలలుగా విడిపోతుంది. ఈ ప్రక్రియను ‘డిస్పర్షన్’గా వ్యవహరిస్తారు. అంటే, సునామీ ఒక స్థిర అల కాదని, నిరంతరం రూపం మారుస్తూ కదిలే డైనమిక్ వ్యవస్థగా చూడాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ కొత్త డేటాను సంప్రదాయ కంప్యూటర్ నమూనాలతో పోల్చినప్పుడు, వాస్తవ పరిస్థితులను పూర్తిగా ప్రతిబింబించలేకపోతున్నాయని స్పష్టమైంది. దీంతో భవిష్యత్తులో సునామీ హెచ్చరికలు, అంచనాలు మరింత ఖచ్చితంగా ఇవ్వాలంటే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కొత్త మోడల్స్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం అత్యవసరంగా మారింది.

Advertisement
Advertisement