త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earth Rotation Speed | త‌గ్గుతున్న భూ భ్ర‌మ‌ణ వేగం.. పెరుగుతున్న రోజు నిడివి..

Earth Rotation Speed | మనుషుల చర్యల వల్ల ఏర్ప‌డుతున్న వాతావరణ మార్పులు భూమి భ్రమణ వేగాన్ని తగ్గిస్తున్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. గత 3.6 మిలియన్ సంవత్సరాల్లో చూడని రీతిలో భూమి భ్ర‌మ‌ణ‌ వేగం తగ్గుతుంద‌ని ఈ అధ్యయనం నిర్ధారించింది. Phys.org నివేదిక ప్రకారం ఈ పరిణామాన్ని సాధారణంగా ఫిగర్ స్కేటర్ ఎఫెక్ట్ గా ప‌రిగ‌ణిస్తారు.

S

Science | Published On Mar 15, 2026, 1.20 pm IST

Earth Rotation Speed | త‌గ్గుతున్న భూ భ్ర‌మ‌ణ వేగం.. పెరుగుతున్న రోజు నిడివి..
Advertisement

Earth Rotation Speed | మనుషుల చర్యల వల్ల ఏర్ప‌డుతున్న వాతావరణ మార్పులు భూమి భ్రమణ వేగాన్ని తగ్గిస్తున్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. గత 3.6 మిలియన్ సంవత్సరాల్లో చూడని రీతిలో భూమి భ్ర‌మ‌ణ‌ వేగం తగ్గుతుంద‌ని ఈ అధ్యయనం నిర్ధారించింది. Phys.org నివేదిక ప్రకారం ఈ పరిణామాన్ని సాధారణంగా ఫిగర్ స్కేటర్ ఎఫెక్ట్ గా ప‌రిగ‌ణిస్తారు. ధ్రువప్రాంతాల్లోని మంచు పర్వతాలు, గ్లేసియర్‌లు కరిగిపోవడంతో నీరు భూమధ్యరేఖ వైపు చేరుతుంది. ఈ బరువు మార్పు కారణంగా గ్రహం మోమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగి భూమి భ్రమణ వేగం తగ్గుతుంది. 2000 నుంచి 2020 మధ్య కాలంలో వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడిన ఈ భారీ మార్పుల వల్ల శతాబ్దానికి భూమి రోజు నిడివి 1.33 మిల్లీసెకన్ల మేర పెరిగినట్లు అధ్యయనం తెలిపింది.

పెరుగుతున్న రోజు నిడివి..

వియన్నా విశ్వవిద్యాలయంలోని వాతావరణ శాస్త్రం, భూభౌతిక విభాగానికి చెందిన మోస్తఫా కియానీ షహ్వాంది మాట్లాడుతూ త‌మ‌ గత పరిశోధనల్లో 21వ శతాబ్దంలో ధ్రువప్రాంతాల మంచు చరియలు, పర్వత గ్లేసియర్‌లు వేగంగా కరుగుతున్నాయని చూపించామ‌ని, దీని వల్ల సముద్ర మట్టం పెరుగుతోంద‌ని తెలిపారు. అదే సమయంలో భూమి భ్రమణం మందగించి రోజు నిడివి పెరుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. చేతులను చాపినప్పుడు నెమ్మదిగా తిరిగే ఫిగర్ స్కేటర్‌లా, చేతులను దగ్గరగా ఉంచినప్పుడు వేగంగా తిరిగే విధంగా ఇది పనిచేస్తుంద‌ని వివరించారు. అయితే గతంలో కూడా వాతావరణ మార్పులు ఇదే స్థాయిలో రోజు నిడివిని పెంచిన ప‌రిస్థితులు ఉన్నాయా అనే విషయం స్పష్టంగా తెలియలేదని షహ్వాంది తెలిపారు. ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు వియన్నా విశ్వవిద్యాలయం, ఈటీహెచ్‌ జ్యూరిక్‌కు చెందిన పరిశోధకులు సముద్రాల్లో నివసించే సూక్ష్మ జీవులైన బెంథిక్ ఫోరామినిఫెరా అనే జీవుల శిలాజాలను అధ్యయనం చేశారు. ఈ ఫోరామినిఫెరా శిలాజాల్లోని రసాయనిక నిర్మాణాన్ని విశ్లేషించడం ద్వారా సముద్ర మట్టంలో జరిగిన మార్పులను అంచనా వేయవచ్చు. ఆ మార్పుల ఆధారంగా భూమి రోజు నిడివిలో వచ్చిన మార్పులను కూడా శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతున్నారు.

సంక్లిష్ట వ్య‌వ‌స్థ‌ల‌పై ప్ర‌భావం..

ఇప్పటివరకు భూమి భ్రమణ వేగం తగ్గడానికి ప్రధాన కారణం చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడి ప్రభావం వల్ల శతాబ్దానికి సుమారు 2.4 మిల్లీసెకన్ల మేర భూమి భ్రమణం మందగిస్తోంది. అయితే 21వ శతాబ్దం చివరికి వాతావరణ మార్పుల ప్రభావమే ప్రధాన కారణంగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కొన్ని మిల్లీసెకన్ల మార్పులు మనుషులకు గుర్తించలేనివిగా అనిపించినప్పటికీ, అత్యంత క‌చ్చితమైన సమయాన్ని అవసరం చేసే వ్యవస్థలకు ఇవి కీలకం. ఉదాహరణకు జీపీఎస్‌ ఉపగ్రహాలు, అంతరిక్ష నావిగేషన్ వ్యవస్థలు, సంక్లిష్ట ఆర్థిక నెట్‌వర్క్‌లపై ఇది ప్రభావం చూపే అవ‌కాశం ఉంద‌ని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈటీహెచ్ జ్యూరిక్‌కు చెందిన అంతరిక్ష జియోడెసీ ప్రొఫెసర్ బెనెడిక్ట్ సోజా మాట్లాడుతూ రోజు దైర్ఘ్యం (నిడివి) ఈ వేగంతో పెరుగుతోంది అంటే ఆధునిక కాలంలో జరుగుతున్న వాతావరణ మార్పులు కనీసం 3.6 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న లేట్ ప్లియోసీన్ కాలం తర్వాత ఎన్నడూ లేనంత వేగంగా జరుగుతున్నాయని సూచిస్తుంద‌ని అన్నారు. ప్రస్తుతం రోజు నిడివి వేగంగా పెరుగుతోంది ప్రధానంగా మానవ చర్యల వల్లనే అని చెప్పవచ్చ‌ని తెలిపారు.

నెగెటివ్ లీప్ సెకండ్ చ‌ర్య వాయిదా..

అదే సమయంలో ఆయన మరో విషయం కూడా ప్రస్తావించారు. 21వ శతాబ్దం చివరికి చంద్రుడి ప్రభావం కంటే వాతావరణ మార్పుల ప్రభావమే రోజు నిడివిపై ఎక్కువగా కనిపించే అవకాశం ఉంద‌ని అన్నారు. మార్పులు కేవలం మిల్లీసెకన్ల స్థాయిలో ఉన్నప్పటికీ, భూమి భ్రమణంపై క‌చ్చితమైన సమాచారం అవసరమయ్యే అంతరిక్ష నావిగేషన్ వంటి అనేక రంగాల్లో ఇవి సమస్యలకు దారితీయవచ్చ‌ని ఆయన అన్నారు. భూమి భ్రమణం మందగించడం ఇప్పటికే ప్రపంచ సమయ కొలతలపై ప్రభావం చూపడం ప్రారంభించింది. రోజు నిడివి పెరగడం వల్ల 2026లో అమలు చేయాల్సిన నెగెటివ్ లీప్ సెకండ్ చ‌ర్య‌ 2029 వరకు వాయిదా పడింది. దీంతో అంతర్జాతీయ సమయ నియంత్రణ వ్యవస్థలకు మార్పులు చేసుకునేందుకు కొంత సమయం లభించింది.

క‌చ్చితమైన సమయ కొలత కంప్యూటింగ్ వ్యవస్థలకు అత్యంత ముఖ్యమైంది. ముఖ్యంగా జీపీఎస్‌, అంతరిక్ష నావిగేషన్ వ్యవస్థలు నిర్దిష్ట అణువుల ఫ్రీక్వెన్సీ ఆధారంగా పనిచేసే అటామిక్ క్లాక్‌లపై ఆధారపడతాయి. అయితే ఈ మార్పులు మానవ జీవశాస్త్రంపై, ముఖ్యంగా నిద్ర విధానాలు లేదా సర్కేడియన్ రిథమ్‌లపై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వేడిని బంధించే ఉద్గారాల కారణంగా గ్లోబల్ వార్మింగ్ కొనసాగితే శతాబ్దం చివరికి ఒక రోజు నిడివి మరో 2.62 మిల్లీసెకన్ల వరకు పెరిగే అవకాశం ఉందని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement
Advertisement