త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | 3 నెలల్లో రూ.5 వేల కోట్లు తెస్తా : మహేష్ కుమార్ గౌడ్ హామీ

గత పదేళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని, తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భీంగల్ రూపురేఖలు మార్చే బాధ్యత తనదని, 3 నెలల్లో రూ.5 వేల కోట్ల నిధులు తెస్తానని హామీ ఇచ్చారు.

J

Nizamabad | Published On Feb 9, 2026, 5.22 pm IST

Mahesh Kumar Goud | 3 నెలల్లో రూ.5 వేల కోట్లు తెస్తా : మహేష్ కుమార్ గౌడ్ హామీ
Advertisement
  • భీంగల్ గడ్డ.. కాంగ్రెస్ అడ్డా
  • కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంది
  • కేసీఆర్ లాగా గాలి మాటలు చెప్పం
  • మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్ : "కేసీఆర్ లాగా గాలి మాటలు చెప్పే సంప్రదాయం మాది కాదు.. చెప్పిన మాట ప్రకారం ఇప్పటికే రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశాం. భీంగల్ గడ్డ ఎప్పుడూ కాంగ్రెస్ అడ్డానే.. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యత నాది," అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు.

దోచుకున్నోళ్లు వాళ్లు.. పంచేటోళ్లు మేము

గత పదేళ్ల పాలనకు, ప్రస్తుత ఇందిరమ్మ ప్రజాపాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని మహేష్ గౌడ్ అన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంపదను ప్రజలకు పంచుతోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం నుంచి సన్న బియ్యం పంపిణీ వరకు అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.

Will Bring Rs 5000 Cr Funds says TPCC Chief Mahesh Kumar Goud

మూడు నెలల్లో రూ.5 వేల కోట్ల నిధులు

నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు. రాబోయే మూడు నెలల్లో జిల్లా అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. భీంగల్ అభివృద్ధిలో భాగంగా రూ.365 కోట్లతో భారీ 'టెంపుల్ కారిడార్ రోడ్డు' నిర్మాణం చేపడుతున్నామన్నారు. అలాగే లింబాద్రి గుట్టలో రూ.8 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతోందని వివరించారు.

విద్యకు పెద్దపీట

జిల్లా విద్యార్థుల కోసం ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాలలను తీసుకువచ్చామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, కానీ తాను భీంగల్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జీ సునీల్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, అనిల్ కుమార్, పీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్, మానాల మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement