త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | ‘స‌ర్’ పేరుతో ఓట్లు తీసేస్తున్న‌రు.. 2002కు ఇప్ప‌టికి చాలా తేడా ఉంది

Mahesh Kumar Goud | 2002లో జరిగిన ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ప్రస్తుతం అమలు చేస్తున్న విధానానికి చాలా వ్యత్యాసం ఉందని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పెద్దఎత్తున ఓటర్ల పేర్ల తొలగింపుకు అవకాశం కల్పించేలా ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

S

Telangana | Published On Jun 19, 2026, 3.20 pm IST

Mahesh Kumar Goud | ‘స‌ర్’ పేరుతో ఓట్లు తీసేస్తున్న‌రు.. 2002కు ఇప్ప‌టికి చాలా తేడా ఉంది
Advertisement
  • ఓటు హ‌క్కు ఎంతో విలువైంది
  • దాన్ని కాపాడే బాధ్య‌త ఎన్నిక‌ల సంఘంపైనే ఉంది
  • రౌండ్ టేబుల్ స‌మావేశంలో టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌

Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: 2002లో జరిగిన ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ప్రస్తుతం అమలు చేస్తున్న విధానానికి చాలా వ్యత్యాసం ఉందని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. గతంలో ఓటర్ల జాబితాను మరింత పకడ్బందీగా రూపొందించేందుకు ఒక్క ఓటు కూడా తొలగించ‌కుండా జాగ్రత్తలు తీసుకునేవారన్నారు. కానీ ప్రస్తుతం పెద్దఎత్తున ఓటర్ల పేర్ల తొలగింపుకు అవకాశం కల్పించేలా ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్‌లో "జీవించే హక్కును కాలరాస్తున్న ఎస్‌ఐఆర్ (Special Intensive Revision)" అంశంపై శుక్ర‌వారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయ‌న‌ పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైంద‌న్నారు. ఆ హక్కును పరిరక్షించేలా ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.

ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు. అలాంటి ఓటును రక్షించాల్సిన సంస్థలే ఇప్పుడు ఓటర్ల హక్కులను హరించేలా వ్యవహరించడం బాధాకరం. కొన్ని ప్రాంతాల్లో ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా లేని ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి. ప్రధాన ఎన్నికల మాజీ కమిషనర్ టి.ఎన్. శేషన్ హయాంలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పాక్షికంగా పనిచేసేది. కానీ ప్రస్తుతం ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై దేశవ్యాప్తంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి అని మ‌హేశ్‌కుమార్ గౌడ్ సందేహం వ్య‌క్తం చేశారు.

న‌క్క‌కు నాగ‌లోకానికి ఉన్న తేడా ఉంది..

శేషన్ కాలంలోని ఎన్నికల సంఘానికి, ప్రస్తుత ఎన్నికల సంఘానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుబంధ సంస్థల్లా కొన్ని రాజ్యాంగ సంస్థలు వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. ఎన్నికల సంఘం పూర్తిస్థాయి స్వతంత్రతను కాపాడుకుంటూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అని ఆయ‌న సూచించారు.

మీనాక్షికి జ‌రిగిన అన్యాయాన్ని దేశం మొత్తం చూసింది..

రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో మీనాక్షికి జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం చూసింది. కేవలం ఒక నోటీసును ఆధారంగా చేసుకుని రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. మీనాక్షి విషయంలో ఆర్వో దుర్మార్గంగా వ్యవహరించారు. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రతి సంస్థపై ఉంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement