త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

పోలీస్ క‌స్ట‌డీకి ప్ర‌భాక‌ర్‌రావు… ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క మ‌లుపు

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ (IPS) అధికారి టి. ప్రభాకర్‌రావు (Prabhakar Rao)ను పోలీసు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా ఈ కేసు దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని నిర్దేశించింది. ఈమేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

A

News | Published On Dec 11, 2025, 6.16 pm IST

పోలీస్ క‌స్ట‌డీకి ప్ర‌భాక‌ర్‌రావు… ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క మ‌లుపు
Advertisement

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ (IPS) అధికారి టి. ప్రభాకర్‌రావు (Prabhakar Rao) ను పోలీసు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా ఈ కేసు దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని నిర్దేశించింది. ఈమేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

కస్టడీ విచారణ సమయంలో భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని దర్యాప్తు సంస్థకు స్పష్టం చేసింది. అతనికి అవసరమైన మందులు, కోరితే ఇంటి నుంచి ఆహారం అందించాలని సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు సాగిన కస్టోడియల్ విచారణ ఆధారంగా తదుపరి ఏం చేయాలన్నది ఆ రోజు చెబుతామని పేర్కొంది.
విచారణ ప్రారంభం అవ్వగానే.... తొలుత ప్ర‌భాక‌ర్‌రావు తరుఫు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇది పూర్తి రాజకీయ కక్షతో కూడిన కేసు అని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాక ముందే... తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభాకర్రావును అరెస్ట్ చేయిస్తానని 2021, ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారని ధర్మాసనం దృష్టికి తీసుకువ‌చ్చారు. పిటిషనర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్ ధ్వంసం జరిగినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోందని, కానీ ఆ పని తానొక్కడే చేయలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే నిబంధనల ప్రకారం దాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి ఇలాంటి సమాచారాన్నంతా ధ్వంసం చేస్తారని చెప్పారు.

ఏ ప్రాతిపదికన ఫోన్ ట్యాపింగ్ చేపట్టారు? అందుకోసం ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ డాక్యుమెంట్లు చూపెట్టాలని జస్టిస్‌ నాగరత్న రంజిత్‌కుమార్‌ను ప్రశ్నించగా.... ప్రామాణిక నిబంధనల ప్రకారమే తాము ఆ పని చేసినట్లు రంజిత్‌కుమార్‌ సమాధాన‌మిచ్చారు ఫోన్ ట్యాపింగ్‌కు అవసరమైన పరిపాలన, ఆర్థికపరమైన అనుమతులన్నీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన ఏడీజీ అనిల్‌కుమార్‌ ఇచ్చారని చెప్పారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా... ఏడీజీ అనిల్‌కుమార్‌పై ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవంగా అతని ఫోన్‌ కూడా వీళ్లు ట్యాప్ చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

కేసు నేపథ్యం గురించి ఇది వరకే విన్నందున... మే 29న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రభాకర్‌రావు దర్యాప్తునకు సహకరిస్తున్నారా? లేదా? అన్నది మాత్రం చెప్పండి అని రంజిత్‌కుమార్‌ను ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. అందుకు... పిటిషనర్ ఇప్పటి వరకు సిట్ అధికారుల ముందు ఆరు సార్లు హాజరై, అవసరమైన సమాచారం అందించినట్లు చెప్పారు. ఆయనకున్న అమెరికా ఫోన్ నెంబర్ క్లౌడ్‌పాస్‌వర్డ్‌ మినహాయించి మిగిలిన అన్ని క్లౌడ్లలో ఉన్న పాస్‌వర్డ్ రీసెట్ చేసి సమాచారం అందించినట్లు చెప్పారు. అమెరికా ఫోన్ డిస్కనెక్ట్ అయినందున అందులోని వివరాలను మాత్రం చూపలేకపోయారని రంజిత్‌ కుమార్‌ వివరించారు. మిగిలిన గూగుల్, యాపిల్ అకౌంట్ల నుంచి సమాచారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు.

"పిటిషనర్ దాదాపు 26 హార్డ్‌డిస్క్‌లు తొలగించి, ఏడు కొత్త హార్డ్ డిస్క్‌లు పెట్టార‌ని, ఇదివరకు క్లౌడ్‌ పాస్‌వర్డ్ ఇవ్వమని ఆదేశించినప్పుడు అన్నీ మరిచిపోయినట్లు పిటిషనర్ చెప్పారు. తర్వాత ఆయనకు అన్నీ గుర్తుకొచ్చాయి... దాని ఆధారంగా పోలీసులు వాటిని తెరిచి చూసినప్పుడు అందులో ఏమీ కనిపించలేదు.... పదేళ్ల నుంచి సేకరించిన డేటా కనిపించలేదు... అది నేరం కాదా? 26 హార్డ్ డిస్క్‌లను ఎలా ధ్వంసం చేస్తారు" అని జస్టిస్‌ మహదేవన్‌ ప్రశ్నించగా.... రివ్యూ కమిటీ ఆదేశాల మేరకు అలా ధ్వంసం చేసినట్లు ప్రభాకర్‌రావు న్యాయవాది చెప్పారు. “మొత్తం హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయమని చెప్పిన ఉత్తర్వులు ఎక్కడున్నాయో చూపండి. మీకు హార్డ్ డిస్క్‌లోని డేటా తొలగించడానికే అనుమతి ఉంటుంది తప్పితే వాటిని ధ్వంసం చేయడానికి కాదు. అందుకే దర్యాప్తునకు మీవ్యక్తిగత హాజరు అవసరం. 26 హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్లడానికి ఏ అధికారికీ అనుమతి ఉండదు“ అని జస్టిస్‌ మహదేవన్‌ పేర్కొన్నారు. పిటిషనర్‌ వాటిని తీసుకుపోలేదని రంజిత్‌కుమార్‌ చెప్పగా... అలాగైతే డేటా ఎక్కడుందో చెప్పాలని రంజిత్‌కుమార్‌ని జస్టిస్‌ నాగరత్న నిలదీశారు. పిటిషనర్ క్లౌడ్ అకౌంట్ల నుంచి ఏం డేటా రికవరీ చేశారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు.

ప్రభాకర్‌రావు ఐక్లౌడ్‌లో ఎలాంటి డేటా కనిపించలేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనానికి నివేదించారు. దర్యాప్తు అధికారుల ముందుకు వచ్చే ముందే.... ఐక్లౌడ్ అకౌంట్ల డేటా అంతా ఖాళీ చేసినట్లు, అందుకు అనుగుణంగా కార్యకలాపాలు జరిగినట్లు యాపిల్ నిర్ధారించిందని, ఆ తర్వాత అందులో ఏమీ కనిపించలేదన్నారు. డేటా అంతా.... డిలీట్ చేశారా? ఇంకేమైనా జరిగిందా? అన్నదాని పై విచారించాల్సి ఉందని తుషార్‌ మెహతా ధర్మాసనానికి విన్నవించారు.

"క్లౌడ్‌లో డేటాయే లేకపోవడం వల్ల దర్యాప్తు అధికారులు ఈకేసుకు అవసరమైన మెటీరియల్‌ని సేకరించలేకపోయినట్లు చెబుతున్నారు. మీరు డేటాను ఇంకెక్కడైనా దాచి ఉండొచ్చని వాళ్లు అనుమానిస్తున్నారు. అందువల్ల పిటిషనర్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించనివ్వండి" అని పేర్కొంటూ... ఆమేరకు కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు జస్టిస్‌ బివి నాగరత్న అనుమతించారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను పెండింగ్‌లో పెడుతూనే మే 29న ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను సవరించి ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు అనుమతిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్ సీనియర్ సిటిజన్ కాబట్టి భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకూడదని పోలీసు అధికారులను నిర్దేశిస్తూ తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు.

ఆయన విచారణకు సహకరించకపోతే ఆరోజు మళ్లీ కస్టడీని పొడిగించమని అడుగుతామని సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా పేర్కొనగా, ఆరోజు పరిస్థితులను బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement