త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సిటీలో 373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు: మ‌ంత్రి పొన్నం

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని అన్ని శివారు ప్రాంతాల‌కు ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించేలా మ‌రో 373 కాల‌నీల‌కు బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్టు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు

a

News | Published On Dec 10, 2025, 4.22 pm IST

సిటీలో 373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు: మ‌ంత్రి పొన్నం
Advertisement

సిటీలో 373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు: మ‌ంత్రి పొన్నం
Trinethra.news: హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని అన్ని శివారు ప్రాంతాల‌కు ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించేలా మ‌రో 373 కాల‌నీల‌కు బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్టు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ హిత విధానాల‌తో న‌గ‌రాన్ని కాలుష్య ర‌హితంగా తీర్చిదిద్దే య‌త్నంలో భాగంగా ఆర్టీసీలో ఈవీ బ‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహణలో నడిచే e బస్సులను రాణిగంజ్ డిపో లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధ‌వారం (2025 డిసెంబ‌రు 10న‌) జెండా ఊపి ప్రారంభించారు. ఆ తరువాత రాణిగంజ్ డిపో నుంచి తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి వరకు బస్సులో ప్రయాణించారు. ఆర్టిసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి ,హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఈవీ ట్రాన్స్ సీఈఓ సందీప్ రైజాడ , సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, నార్త్ జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పీవీ మునిశేఖర్, సిహెచ్ వెంకన్న, ఎం రాజశేఖర్, కార్పొరేటర్ సుచిత్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఢిల్లీలా కాకూడ‌ద‌నే
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రవాణా శాఖ తరుపున ఆర్టీసీ రాణిగంజ్ డిపో నుండి 65 బస్సులు ప్రారంభించామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ ,కరీంనగర్ , నిజామాబాద్ , నల్గొండ ,సూర్యాపేట మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఢిల్లీ లో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో ప్రజలు జీవించలేని పరిస్థితి, ఇక్కడ అలాంటి పరిస్థితి రాకుండా రవాణా శాఖ ఈవీ పాలసీ , స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వివిధ పుణ్యక్షేత్రాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతాము. ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం వల్ల నగరంలో ప్రయాణికులకు మరిన్ని బస్సులు అందుబాటులోకి వచ్చాయి. నగర శివారు ప్రాంతాలకు బస్సులు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఎక్కడెక్కడ బస్సులు అవసరమో సర్వే చేసి ముఖ్యమంత్రి సూచనలతో 373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇప్పటి నుంచి ఆ కాలనీ లకు బస్సులు నడుస్తాయి అన్నారు. ఆర్టీసీ ఎండీ వై . నాగిరెడ్డి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే రెండు సంవత్సరాల్లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. ప్రతి బస్ ఒక రోజు ఒక టన్ కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గిస్తుంది అన్నారు. ఈవీ ట్రాన్స్ సీఈఓ సందీప్ రైజాదా మాట్లాడుతూ “ఈరోజు ప్రారంభించిన ఈ బస్సులతో దేశవ్యాప్తంగా మా బస్సులు నడిచే డిపోల సంఖ్య 69కి చేరింది. తెలంగాణలో రాణిగంజ్ డిపో ఐదోది. రాష్ట్రంలో మొత్తం ఆరు డిపోల మా విస్తరణ ప్రణాళికలో ఇది కీలకమైన ముందడుగు. ప్రస్తుతం దేశంలోని 10 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 3,100కుపైగా బస్సులను విజయవంతంగా నడుపుతున్నాం. నేడు మరో 65 ఎలక్ట్రిక్ బస్సులను మా ఫ్లీట్‌లో చేర్చడం గర్వంగా ఉంది. మిగిలిన బస్సులను 2026 జనవరి నాటికి అందజేస్తాము " అన్నారు.

 

12 మీట‌ర్ల లోఫ్లోర్ ఎలక్ట్రిక్ సిటీ బ‌స్సు
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్‌ఆర్టీసీ ) భాగస్వామ్యంతో 65 కొత్త 12-మీటర్ల లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ సిటీ బస్సులను ఈవీ ట్రాన్స్ ప్రారంభించింది. పర్యావరణ హిత , ఆధునిక, విశ్వసనీయమైన ప్రజా రవాణా సేవలను హైదరాబాద్ నగరానికి అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టీజీఎస్‌ఆర్టీసీ 500 లో-ఫ్లోర్ సిటీ ఈ-బస్ ప్రాజెక్ట్‌లో ఈ బస్సులను ప్రవేశ పెట్టడం ఓ ముఖ్యమైన దశగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 450 నాన్-ఏసీ , 50 ఏసీ లో-ఫ్లోర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు 325 బస్సులను ఈవీ ట్రాన్స్ సరఫరా చేసింది. మిగిలిన 175 బస్సులను 2026 జనవరి నాటికి టీజీఎస్ ఆర్టీసీకి ఈవీ ట్రాన్స్ అందించనుంది. ఈ బస్సుల సరఫరాతో హైదరాబాద్ నగరంలో సుస్థిర రవాణా మౌలిక వసతులు మరింతగా బలోపేతం కానున్నాయి. 36 సీట్ల సామర్థ్యంతో కొత్తగా ప్రవేశపెట్టిన 12-మీటర్ల లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను లిథియమ్-అయాన్ బ్యాటరీలు, రీజెనరేటివ్ బ్రేకింగ్, రియల్ టైమ్ ట్రాకింగ్‌తో కూడిన ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, ఫైర్ డిటెక్షన్, సప్రెషన్ సిస్టమ్, అధునాతన మోటార్–కంట్రోలర్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించారు. ఈ బస్సుల్లో ఆటోమేటెడ్ అనౌన్స్‌మెంట్స్, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్లు, వృద్ధులు , దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ బస్సులు సికింద్రాబాద్, కొండాపూర్, ఇస్నాపూర్, బొరబండ, రామాయంపేట్, గచ్చిబౌలి, మియాపూర్ వంటి ప్రధాన రూట్లలో నడవనున్నాయి. దీంతో రోజువారీ ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఈ కొత్త బస్సుల వల్ల శబ్ధ, వాయు కాలుష్యం, ఆపరేషనల్ ఖర్చులు తగ్గడం తో పాటు హైడెన్సిటీ రూట్లపై ప్రయాణించే ప్రజలు మరింత సుఖవంతమైన, పర్యావరణ హితం ప్రయాణ అనుభవం పొందనున్నారు. రాణిగంజ్ డిపో నుంచి నడపనున్న వంద ఈ బస్సుల్లో నేడు ప్రారంభించిన 65 బస్సులు కూడా ఉన్నాయి. నగరంలోని కంటోన్మెంట్, మియాపూర్ , హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హయత్‌నగర్, రాణిగంజ్ డిపో సహా మొత్తం అయిదు ముఖ్య డిపోల నుంచి ఎలక్ట్రిక్ బస్సులను ఆర్ టి సి నడుపుతోంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభంతో టీజీఎస్‌ఆర్టిసీ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయి, పర్యావరణహిత, ప్రయాణీకులకు అనుకూలమైన ప్రజా రవాణా సేవలను అందించాలనే తమ లక్ష్యాన్ని మరోసారి చాటుకున్నాయి.

 

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement