త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MGNREGA | ఉపాధి హామీ ప‌థ‌కానికి గాంధీ పేరు తొల‌గింపును నిర‌సిస్తూ గ్రామ స‌భ‌ల్లో తీర్మానం చేయాలి: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

MGNREGA | కొత్త సర్పంచ్‌లు మొదటి గ్రామ సభలో ఉపాధి హామీ పథకానికి (MGNREGA) మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తీర్మానం చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) సూచించారు. కేంద్ర‌ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా గ్రామ‌గ్రామాన గాంధీ ఫొటోల‌తో నిర‌స‌న తెల‌పాల‌ని పిలుపునిచ్చారు.

A

Telangana | Published On Dec 28, 2025, 2.10 pm IST

MGNREGA | ఉపాధి హామీ ప‌థ‌కానికి గాంధీ పేరు తొల‌గింపును నిర‌సిస్తూ గ్రామ స‌భ‌ల్లో తీర్మానం చేయాలి: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

కేంద్ర‌ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా గ్రామాల్లో గాంధీ ఫొటోల‌తో నిర‌స‌న తెల‌పాల‌ని పిలుపు

MGNREGA | గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచ్‌లు మొదటి గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి (MGNREGA) మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తీర్మానం చేయాలని రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) సూచించారు. కేంద్ర‌ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా గ్రామ‌గ్రామాన గాంధీ ఫొటోల‌తో నిర‌స‌న తెల‌పాల‌ని పిలుపునిచ్చారు. గాంధీభ‌వ‌న్‌ (Gandhi Bhavan)లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో పొన్నం మాట్లాడుతూ దేశంలో గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ (BJP) ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి బిల్లులో చేసిన మార్పులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామీణ ప్ర‌జ‌ల జీవితాలు మార్చేందుకే ఉపాధి హామీ ప‌థ‌కం

2004లో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఉన్న పరిస్థితుల్లో అంత‌కుముందు ప్రభుత్వాల పనితీరు వల్ల ఏర్పడిన ఇబ్బందులను స‌రిచేసేందుకు అనేక మంది మేధావులు, సామాజిక వేత్తలతో చ‌ర్చించి, గ్రామీణ ప్రాంతాలను బతికించేందుకు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రజల ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా వలసలు పోకుండా ఉండేందుకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి ప్రజల జీవితాలు మార్చిన ఈ పథకం దేశ రూపు రేఖలు మార్చిందని అభివర్ణించారు. 2014 ఎన్నికల్లో ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరిస్తామని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆది చేయకపోగా ఉన్న పథకానికి తూట్లు పొడుస్తోందని మండిప‌డ్డారు. మహాత్మా గాంధీ పేరు తీసేసి జీ రామ్ జీ (G RAM G) పేరు పెట్టింద‌ని దుయ్య‌బ‌ట్టారు. గతంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు ఇచ్చే ప‌థ‌కానికి 60:40 నిధులు భరించేలా చేసి రాష్ట్రాలపై మరింత భారం మోపుతోంద‌ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపాధి హామీ పథకంపై చేసిన బిల్లుల మార్పుపై వెనక్కి త‌గ్గాల‌ని డిమాండ్ చేశారు.

గాంధీ, నెహ్రూల చ‌రిష్మా చెరిపివేయాల‌నే...

స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, దేశ అభివృద్ధి నిర్మాణంలో మహోన్నత కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీల చరిష్మా చెరిపేయాలని చూస్తోందని ఆరోపించారు. వారు చేసిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాయ‌ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్ని గ్రామాల్లో గాంధీ ఫోటోలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలు తెలిపాలని పిలుపునిచ్చారు.

ఉపాధి హామీ ప‌థ‌కానికి కేంద్రమే 90 శాతం నిధులు ఇవ్వాలి: మంత్రి వివేక్

ఉపాధి హామీ ప‌థ‌కంలో మ‌హాత్మాగాంధీ పేరు తొల‌గించ‌డం కుట్రపూరిత‌మైన నిర్ణ‌య‌మ‌ని మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి ఆరోపించారు. పేరు మార్పును త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌న్నారు. ఉపాధి హామీ ప‌థ‌కానికి కేంద్రమే 90 శాతం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని చెప్పుచేత‌ల్లో పెట్టుకునేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం మన రాష్ట్రానికి నిధులు ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు. ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితిని పెంచ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌లో బీఆర్ఎస్‌కు స్థానం లేద‌ని అన్నారు. ఆ పార్టీ వాళ్లు కేవ‌లం సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. క‌విత అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కేటీఆర్ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. గాంధీ పేరు అంటేనే బీజేపీకి న‌చ్చ‌డం లేద‌ని మ‌రో మంత్రి అజారుద్దీన్ మండిప‌డ్డారు. ప్రపంచ‌మంతా గాంధీ సేవ‌ల‌ను కొనియాడుతుంటే బీజేపీకి మాత్రం న‌చ్చ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement