త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

cyber cheat | హైద‌రాబాద్ యువ‌తికి సైబ‌ర్ వ‌ల‌.. బెట్టింగ్ వెబ్‌సైట్‌తో 30 ల‌క్ష‌లు కాజేసిన కేటుగాళ్లు

cyber cheat | ఆన్‌లైన్ గేమింగ్ (Online gaming), బెట్టింగ్ మోసాల‌కు పాల్ప‌డుతున్న భారీ ఆర్థిక నెట్‌వ‌ర్క్‌ ను పోలీసులు గుట్టుర‌ట్టు చేశారు. నలుగురు ప్రధాన నిందితుల (Four Accused)ను అరెస్ట్ (Arrest) చేసిన‌ట్లు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితులు సుమారు రూ. 26,07,01,460 లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు.

S

News | Published On Mar 26, 2026, 5.19 pm IST

cyber cheat | హైద‌రాబాద్ యువ‌తికి సైబ‌ర్ వ‌ల‌.. బెట్టింగ్ వెబ్‌సైట్‌తో 30 ల‌క్ష‌లు కాజేసిన కేటుగాళ్లు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఆన్‌లైన్ గేమింగ్ (Online gaming), బెట్టింగ్ మోసాల‌కు పాల్ప‌డుతున్న భారీ ఆర్థిక నెట్‌వ‌ర్క్‌ ను పోలీసులు గుట్టుర‌ట్టు చేశారు. నలుగురు ప్రధాన నిందితుల (Four Accused)ను అరెస్ట్ (Arrest) చేసిన‌ట్లు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితులు సుమారు రూ. 26,07,01,460 లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌, న‌గ‌దును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన 24 ఏళ్ల యువతి (24 years old women) ఇన్‌స్టా (Instagram)లో వచ్చిన ఒక తప్పుడు ప్రకటనను చూసి సుమారు రూ. 30 లక్షలు నష్టపోయింది. కేటుగాళ్లు వాట్సాప్ లో ఆమెను 'y1.game' అనే గేమింగ్/కాసినో ప్లాట్‌ఫామ్‌లోకి ఆహ్వానించారు. ప్రారంభంలో బోనస్‌లు, నగదు ఉపసంహరణలు (Withdrawals) చేసి నమ్మకం కలిగించారు. దీంతో అది నిజమైన సైట్ అని బాధితురాలు న‌మ్మి తన బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్ ఖాతాల నుంచి పలు యూపీఐ (UPI) లావాదేవీల ద్వారా భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేశారు. నిందితులు సూచించిన వివిధ యూపీఐ ఐడీలకు నిరంతరం నగదు పంపారు. ఈ క్ర‌మంలో పొదుపు చేసిన సొమ్మునంతా కోల్పోవడమే కాకుండా ఖాతాలో ఉన్న మిగిలిన డ‌బ్బులు కూడా నిలిచిపోయాయి. చివరకు తాను మోస‌పోయాన‌ని గుర్తించి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

గుజ‌రాత్, ఢిల్లీ, కేర‌ళ, హైద‌రాబాద్‌కు చెందిన‌వారే..

'వన్ స్టాప్ షాపింగ్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థకు రాజేష్ వెంకట రామన్, గుజరాత్‌కు చెందిన రుషభ్ జస్వంతరాయ్ గాంధీలు డైరెక్టర్లుగా ఉన్నారు. వీరు క్లోజ్‌ఎక్స్ పే (CloseX pay), ట్రస్ట్లీ పే (Trustly Pay), అకల్ట్ పే (Accult pay) వంటి పేమెంట్ గేట్‌వేలను సృష్టించారు. IMPS, UPI, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించేవారు. ప్రతి లావాదేవీపై 2% నుంచి 3% వరకు కమిషన్ వసూలు చేసేవారు. రాజేష్ వెంకట రామన్ ఈ కార్యకలాపాల కోసం భమిడిపాటి అభిషేక్, కేరళకు చెందిన అగస్టీన్ విలియమ్స్‌ను ఉద్యోగులుగా నియమించుకున్నాడు.
ఢిల్లీకి చెందిన ఆండీ షహీర్ నకిలీ కంపెనీల పేరుతో 'మ్యూల్ ఖాతాల'ను (Mule Accounts) తెరిచాడు. వాటి KYC వివరాలను గోవాకు చెందిన మన్మీత్ శర్మ సోనియాకు పంపేవారు. మన్మీత్ శర్మ ఆ పత్రాలను సేకరించి అభిషేక్‌కు పంపగా అభిషేక్ వాటిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల సూర్యోదయ బ్యాంక్ అధికారులకు పంపేవాడు. సూర్యోదయ బ్యాంక్ అధికారులు 0.75% కమిషన్ తీసుకుని పేమెంట్ గేట్‌వే సేవలను అందించేవారు. బెట్టింగ్ ద్వారా వచ్చే సొమ్ము రాజేష్ వెంకట రామన్ నిర్వహించే గేట్‌వేలో డిపాజిట్ అయ్యేది. రాజేష్ తన 5% కమీషన్, సోనియా వాటా 5% కమీషన్ దాచుకుని మిగిలిన మొత్తాన్ని ఆండీ ఖాతాకు పంపేవాడు. నిందితులంతా కలిసి బెట్టింగ్ వెబ్‌సైట్ల ద్వారా రూ. 26,07,01,460 భారీ మొత్తంలో లావాదేవీలు జరిపారు.

నిందితుల అరెస్టు, ప‌రిక‌రాలు స్వాధీనం..

ఈ కేసులో ప్ర‌ధాన నిందితులైన‌ రాజేష్ వెంకట రామన్ (హైదరాబాద్), భమిడిపాటి అభిషేక్ (హైదరాబాద్), అగస్టీన్ విలియమ్స్ (కేరళ), మన్మీత్ శర్మ, సోనియా (గోవా)ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఆరు మొబైల్ ఫోన్లు, 9 చెక్ బుక్కులు, రెండు షెల్ కంపెనీల స్టాంపులు, రూ. 6,50,000 న‌గ‌దు స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు. పరారీలో ఉన్న ఆండీ షహీర్, రుషభ్ జస్వంతరాయ్ గాంధీల కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

ఇన్ స్పెక్టర్ పి. శివ చంద్ర నేతృత్వంలోని రిజర్వ్ ఇన్ స్పెక్టర్ సి.హెచ్. ప్రవీణ్, ఎస్.ఐ. ఎ.ఉమ, హెచ్.సి. సునీల్, పి.సి.లు భాస్కర్, గణేష్, సందీప్, విజయ్ కుమార్, మనీష్ కుమార్, డబ్ల్యూ.పి.సి. ధరణి, ఎ.ఆర్.పి.సి. శివ కుమార్ కేసును ఛేదించారు. కాగా సోషల్ మీడియాలో డ‌బ్బులు సులభంగా వ‌స్తుంద‌ని ఆశచూపే ఆన్‌లైన్ లాటరీ, గేమింగ్ ప్రకటనల పట్ల ప్ర‌జ‌లు జాగ్రత్తగా ఉండాల‌ని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement