త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | ఆర్డీఎస్ వద్ద అక్రమ నిర్మాణాలతో తెలంగాణకు అన్యాయం

Srinivas Goud | క‌ర్నాట‌క మాన్వి మండల పరిధిలో ఉన్న రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) వద్ద క‌ర్నాట‌క‌, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ నిర్మాణాలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

P

News | Published On Jul 8, 2026, 5.29 pm IST

Srinivas Goud | ఆర్డీఎస్ వద్ద అక్రమ నిర్మాణాలతో తెలంగాణకు అన్యాయం
Advertisement
  • ముగ్గురు సీఎంలు కలిసి కుట్ర చేశారు
  • మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌
  • క‌ర్నాట‌క‌, ఏపీ చేప‌డుతున్న నిర్మాణాల‌ను ప‌రిశీలించిన బీఆర్ఎస్ బృందం

Srinivas Goud | క‌ర్నాట‌క మాన్వి మండల పరిధిలో ఉన్న రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) వద్ద క‌ర్నాట‌క‌, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ నిర్మాణాలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిసరాలను సందర్శించి పరిస్థితిని తీసుకున్నారు. అక్ర‌మ నిర్మాణాల‌తో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు సాగునీరు రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని, ఆర్డీఎస్ ఎడమ కాలువ (లెఫ్ట్ కెనాల్)కు పూర్తిస్థాయిలో నీరు రాకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. దాంతో నడిగడ్డ ప్రాంతమే కాకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం నష్టపోతోందని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీరు అందకుండా చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రాంత ప్రయోజనాలను పణంగా పెడితే ప్రజలు తిరగబడతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ, క‌ర్నాట‌క‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రహస్యంగా ఏం చర్చించుకున్నారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందాల్సిన నీటిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారుగా నియమించారని ఆరోపించారు.

తెలంగాణలో జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డీఎస్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారా లేదా అన్న విషయాన్ని కాంగ్రెస్ మంత్రులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తూములు బద్దలు కొట్టి రైట్ కెనాల్ ద్వారా సుంకేసుల ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామని, ఇప్పుడు నీటిని తరలించేందుకు అవసరమైన అన్ని పనులు పూర్తిచేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులను కూల్చివేస్తామని, రైతుల హక్కులను కాపాడుతామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని, తెలంగాణ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

Advertisement
Advertisement