త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AIADMK Poll Promises | ఇక నుంచి పురుషులకూ ఫ్రీ బస్సు.. మహిళలకు నెలకు రూ.2 వేలు: అన్నాడీఎంకే ఎన్నికల హామీల వర్షం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే సంచలన హామీలు ప్రకటించింది. పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు నెలకు రూ. 2 వేలు ఇస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారు.

J

News | Published On Jan 17, 2026, 4.10 pm IST

AIADMK Poll Promises | ఇక నుంచి పురుషులకూ ఫ్రీ బస్సు.. మహిళలకు నెలకు రూ.2 వేలు: అన్నాడీఎంకే ఎన్నికల హామీల వర్షం

సంక్షిప్త సారాంశం

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి ఐదు కీలక హామీలను ప్రకటించారు. ఇందులో మహిళలకు నెలకు రూ. 2,000 నగదు, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గృహ నిర్మాణం, ఉపాధి హామీ పథకం పెంపు వంటి ప్రజాకర్షక పథకాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితిపై విమర్శలు వస్తున్నప్పటికీ, సమర్థవంతమైన పాలనతో వీటిని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

AIADMK Poll Promises | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి అన్నాడీఎంకే (AIADMK) ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. మేనిఫెస్టో కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తికాకముందే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి (Edappadi K Palaniswami) శనివారం ఐదు కీలక ఎన్నికల హామీలను ప్రకటించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.

పార్టీ వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్ (MGR) 109వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం పళనిస్వామి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మేనిఫెస్టో కమిటీ పర్యటన పూర్తయిన తర్వాత మరిన్ని ప్రకటనలు ఉంటాయని ఆయన తెలిపారు.

అన్నాడీఎంకే ప్రకటించిన 5 ప్రధాన హామీలు ఇవే

మగలిర్ కులవిళక్కు తితం (Magalir Kulavilakku Thittam): రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలోని మహిళా యజమానికి నెలకు రూ.2,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం: ప్రస్తుతం మహిళలకు అందుతున్న ఉచిత బస్సు సౌకర్యాన్ని పురుషులకు కూడా వర్తింపజేస్తారు. సిటీ బస్సుల్లో పురుషులు ఉచితంగా ప్రయాణించవచ్చు.

అమ్మ గృహ నిర్మాణ పథకం: గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వమే స్థలంతో పాటు పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తుంది. పట్టణాల్లో బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లను నిర్మించి పేదలకు అందజేస్తారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గాల్లో కొడుకులు వివాహం చేసుకుని విడిగా కాపురం పెట్టినప్పుడు, వారికి కూడా స్థలం కొనుగోలు చేసి ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది.

ఉపాధి హామీ పథకం పెంపు: కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచింది. కానీ, తమిళనాడులో దీన్ని 150 రోజులకు విస్తరిస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారు.

AIADMK announces poll promises as free bus rides for men

అమ్మ టూ-వీలర్ పథకం: ఐదు లక్షల మంది మహిళలకు రూ.25,000 సబ్సిడీతో 'అమ్మ ద్విచక్ర వాహనాల'ను పంపిణీ చేస్తారు.

మహిళలకు రూ.2,000 ఇవ్వడం వల్ల రాష్ట్ర అప్పుల భారం పెరుగుతుందని అడిగిన ప్రశ్నకు పళనిస్వామి సమాధానమిస్తూ.. "డీఎంకే ప్రభుత్వానికి పాలనా దక్షత లేదు, కానీ మేము మా సామర్థ్యాన్ని నిరూపించుకున్నాం" అని అన్నారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే.. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణీలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రతి కుటుంబానికి 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పింది. ప్రజల్లో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడానికే ఇలాంటి పథకాలను ప్రకటించామని అప్పట్లో అన్నాడీఎంకే స్పష్టం చేసింది.

గతంలో అన్నాడీఎంకే హయాంలో కరోనా వంటి కష్టకాలంలో కూడా అప్పులను నియంత్రణలో ఉంచామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అప్పులను విపరీతంగా పెంచేసిందని విమర్శించారు.

పరిపాలనా సామర్థ్యం ఉంటే పురుషులకు ఉచిత ప్రయాణం వంటి పథకాలను సులభంగా అమలు చేయవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement