త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shatrughan Sinha | “కష్టకాలంలో దీదీని వదలను” – రెబల్ క్యాంప్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన శతృఘ్న సిన్హా

ప్రధాని మోదీని ప్రశంసిస్తూ టీఎంసీ ఎంపీ శతృఘ్న సిన్హా చేసిన ట్వీట్ బెంగాల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. తాను పార్టీ వీడుతున్నాననే వార్తలపై ఆయన ఏమన్నారంటే..

J

National | Published On Jun 11, 2026, 4.33 pm IST

Shatrughan Sinha | “కష్టకాలంలో దీదీని వదలను” – రెబల్ క్యాంప్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన శతృఘ్న సిన్హా

సంక్షిప్త సారాంశం

టీఎంసీ (TMC) ఎంపీల తిరుగుబాటు నేపథ్యంలో శతృఘ్న సిన్హా కూడా పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మమతా బెనర్జీని వీడేది లేదని, తన కష్టకాలంలో ఆమె అండగా నిలబడ్డారని సిన్హా స్పష్టం చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ట్వీట్ కేవలం స్పోర్టివ్ స్పిరిట్‌తో చేసిందేనని, అందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని వెల్లడించారు. ఇప్పటికీ మమతా దీదీకి 41% ఓటు షేర్ ఉందని, ఆమె ఒక రియల్ 'స్ట్రీట్ ఫైటర్' అని సిన్హా కొనియాడారు.

Advertisement

Shatrughan Sinha | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో (West Bengal Politics) తృణమూల్ కాంగ్రెస్ (TMC) అంతర్గత సంక్షోభం కొనసాగుతున్న వేళ.. పార్టీ సీనియర్ నేత, అసన్‌సోల్ ఎంపీ శతృఘ్న సిన్హా కీలక ప్రకటన చేశారు. రెబల్ ఎంపీల గ్రూపులో తాను కూడా చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన కష్టకాలంలో అండగా నిలబడిన మమతా బెనర్జీని ఈ క్లిష్ట పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదని గురువారం ఆయన స్పష్టం చేశారు.

ప్రధాని మోదీపై ప్రశంసలు.. ఆ వెంటనే క్లారిటీ

గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ శతృఘ్న సిన్హా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపింది. భారత ప్రధానిగా అత్యధిక కాలం పనిచేస్తున్న రికార్డు సృష్టించిన మోదీకి శుభాకాంక్షలు చెబుతూ, ఆ పోస్ట్‌లో మమతా బెనర్జీని కూడా ట్యాగ్ చేశారు. దీంతో ఆయన టీఎంసీని వీడి మళ్లీ బీజేపీ (BJP) గూటికి చేరుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

దీనిపై స్పందించిన సిన్హా.. "నా గురించి చాలా విషయాలు ప్రచారం చేస్తున్నారు. కకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని రెబల్ గ్రూప్‌లో (Rebel Group) నేను ఉన్నానని చెబుతున్నారు. కానీ అవన్నీ అబద్ధాలు. కేవలం ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోనే ప్రధానికి శుభాకాంక్షలు తెలిపాను" అని క్లారిటీ ఇచ్చారు.

దీదీ ఒక రియల్ స్ట్రీట్ ఫైటర్

పీటీఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ పట్ల తన విధేయతను చాటుకున్నారు. కొందరు భయంతోనో, ప్రలోభాలకో లొంగిపోయి దీదీని వదిలేయొచ్చు కానీ తాను మాత్రం ఎప్పటికీ పార్టీతోనే ఉంటానని తేల్చి చెప్పారు.


"ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ మమతా జీకి ప్రజల మద్దతు పుష్కలంగా ఉంది. ఆమె ఇప్పటికీ ఒక స్ట్రీట్ ఫైటర్ (Street Fighter). ప్రజలతో మమేకమయ్యే నాయకురాలు. నేటికీ ఆమెకు దాదాపు 41% ఓటు షేర్ (Vote Share) ఉంది." అని సిన్హా ప్రశంసించారు.

"2019 పట్నా ఎన్నికల్లో నేను ఓడిపోయి, రాజకీయంగా కష్టాల్లో ఉన్నప్పుడు మమతా బెనర్జీ నాకు అండగా నిలబడ్డారు. నన్ను అసన్‌సోల్ నుంచి పోటీ చేయమని ప్రోత్సహించారు. ఆమె మద్దతు, ప్రజల ఆదరణ వల్లే నేను మళ్లీ పార్లమెంట్‌లో అడుగుపెట్టగలిగాను. అలాంటి నాయకురాలిని ఈ కష్టకాలంలో నేను వదిలిపెట్టను. పార్టీ మారే ఉద్దేశం నాకు అస్సలు లేదు," అని సిన్హా స్పష్టం చేశారు.

ఢిల్లీలోనే అభిషేక్.. పార్టీలో ఉత్కంఠ

ఒకవైపు 20 మంది ఎంపీల తిరుగుబాటు వ్యవహారం నడుస్తుండగా, మరోవైపు ఫోర్జరీ కేసులో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్ CID నోటీసులు జారీ చేసింది. మమతా బెనర్జీ తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని 'ఇండియా' కూటమి (INDIA Bloc) నేతలతో భేటీల అనంతరం బుధవారం సాయంత్రం తిరిగి కోల్‌కతా చేరుకున్నారు. అయితే, అభిషేక్ మాత్రం ఇంకా ఢిల్లీలోనే ఉండిపోవడం, ఆయన ఎప్పుడు కోల్‌కతా వస్తారన్న దానిపై ఎలాంటి సమాచారం లేకపోవడం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.

Advertisement
Advertisement