త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Halisahar | మమతా బెనర్జీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి

Halisahar | పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై ఆదివారం దాడి జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హాలిషహర్‌లో ఆందోళనకారులు ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అంత‌టితో ఆగ‌కుండా రాళ్లు, వాటర్‌ బాటిళ్లు, చెప్పులు వాహనంపైకి విసిరారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

P

National | Published On Aug 9, 2026, 4.26 pm IST

Halisahar | మమతా బెనర్జీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి
Advertisement
  • హాలిషహర్‌లో దీదీని అడ్డుకున్న ఆందోళనకారులు..
  • వాటర్‌ బాటిళ్లు, చెప్పులు విసిరడంతో ఉద్రిక్త ప‌రిస్థితులు

Halisahar | పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై ఆదివారం దాడి జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హాలిషహర్‌లో ఆందోళనకారులు ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అంత‌టితో ఆగ‌కుండా రాళ్లు, వాటర్‌ బాటిళ్లు, చెప్పులు వాహనంపైకి విసిరారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్త బిర్జు కియోట్‌ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ బ‌య‌లుదేరారు. ఆమె వాహనాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల కస్టడీలోనే బిర్జు మృతి చెందాడంటూ నిన‌దించారు.

పోలీసుల సమక్షంలోనే దాడి జ‌రిగింద‌న్న దీదీ

దాడి ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. తన కారుపై పెద్ద రాళ్లు విసిరారని ఆమె ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారన్నారు. ‘‘కారు అద్దం తెరిచి ఉంటే మా తలలు పగిలిపోయేవి. ప్రాణాలు కూడా పోయి ఉండేవి. అదృష్టవశాత్తూ మేం సురక్షితంగా బయటపడ్డాం’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగిందని ఆరోపించిన ఆమె.. ‘‘ఇలాంటి ఘటనను గతంలో ఎప్పుడూ చూడలేదు. ఏం జరుగుతోంది? పోలీసులు బీజేపీకి భద్రత కల్పిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిని టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘సువేందు అధికారి పోలీస్‌ శాఖను నాశనం చేశారు’’ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

అనుమానాస్ప‌ద స్థితిలో టీఎంసీ కార్య‌క‌ర్త మృతి

తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్త, మాజీ కౌన్సిలర్‌ భర్త అయిన బిర్జు కియోట్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబీకులు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం రాత్రి పోలీసులు బిర్జును అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసు కస్టడీలో ఆయనను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. మరుసటి రోజు పోలీసు లాక‌ప్‌లో అపస్మారక స్థితిలో కనిపించారని పేర్కొన్నారు. రాత్రి సమయంలో తన భర్తను కలిసినప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని బిర్జు భార్య తెలిపారు. అలాంటప్పుడు ఉదయం ఆయన మృతి చెందినట్లు సమాచారం ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పోలీసు కస్టడీలోనే తన భర్తపై దాడి జరిగిందని ఆరోపించారు. తన భర్త మృతదేహంపై తీవ్ర గాయాలు, రక్తపు మరకలు కనిపించాయని ఆమె పేర్కొన్నారు. చేతులు, కాళ్లు తాడుతో కట్టి కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement