త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Asia Crisis | రిఫైన‌రీల్లో 40శాతం పెరిగిన ఎల్‌పీజీ ఉత్ప‌త్తి.. పుకార్ల‌ను న‌మ్మొద్ద‌ని కేంద్రం విజ్ఞ‌ప్తి..!

West Asia Crisis | పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయ ఇంధన సరఫరా విష‌యంలో కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దేశంలో సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని తెలిపారు.

P

National | Published On Mar 18, 2026, 4.13 pm IST

West Asia Crisis | రిఫైన‌రీల్లో 40శాతం పెరిగిన ఎల్‌పీజీ ఉత్ప‌త్తి.. పుకార్ల‌ను న‌మ్మొద్ద‌ని కేంద్రం విజ్ఞ‌ప్తి..!
Advertisement

West Asia Crisis | పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయ ఇంధన సరఫరా విష‌యంలో కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దేశంలో సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని తెలిపారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా ఉండేందుకు రిఫైనరీల ద్వారా దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని సుమారు 40 శాతం పెంచినట్లు వెల్లడించారు. గ్యాస్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. అన్ని రిటైల్ అవుట్‌లెట్లు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద 100 శాతం సరఫరా జరుగుతోందని, గృహ వినియోగ పీఎన్‌జీ, రవాణా సీఎన్‌జీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.

పీఎన్‌జీ మౌలిక వసతులు వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవ‌ల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న సీజీడీ పైప్‌లైన్ దరఖాస్తులకు ‘డీమ్డ్ అనుమతి’ ఇవ్వడం, కొత్త దరఖాస్తులకు 24 గంటల్లో అనుమతులు మంజూరు చేయడం వంటి నిర్ణయాలు తీసుకుంది. అలాగే రోడ్ల పునరుద్ధరణ, అనుమతి ఫీజులను మాఫీ చేయాలని సూచించింది. పని గంటలు, వాతావరణ పరిమితులను సడలించి, సమన్వయం కోసం నోడల్ అధికారులను నియమించాలని పేర్కొంది. ఎల్పీజీ నుంచి పీఎన్‌జీకి మార్పును ప్రోత్సహించేందుకు రాష్ట్రాలకు అదనంగా 10 శాతం కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపును బుధ‌వారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ ప్రోత్సాహకాన్ని దశలవారీగా అందించనున్నారు. సీజీడీ అనుమతుల కోసం రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తే 1 శాతం, డీమ్డ్ అనుమతులు ఇచ్చినప్పుడు 2 శాతం, ‘డిగ్ అండ్ రిస్టోర్ స్కీమ్’ ప్రారంభిస్తే 3 శాతం, వార్షిక లీజ్ ఛార్జీలు తగ్గిస్తే 4 శాతం అదనంగా కేటాయించనున్నారు.

ప్రత్యామ్నాయ ఇంధనాల స‌ర‌ఫ‌రా

ఎల్పీజీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించేందుకు బొగ్గు, కెరాసిన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగంలోకి తీసుకొచ్చారు. బీహార్, గుజరాత్, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఇప్పటికే కిరోసిన్ కేటాయింపుల‌పై ఆదేశాలు జారీ అయ్యాయి. దేశవ్యాప్తంగా నాన్-డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరాను కూడా కొంత మేర అందిస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ సహా 14కిపైగా రాష్ట్రాలు ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశాయి. గ్యాస్ దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్ నివారించేందుకు డెలివరీ ఆథెంటికేషన్ కోడ్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. మార్చి 15న 72 శాతంగా ఉన్న వినియోగం, మార్చి 17 నాటికి 81 శాతానికి పెరిగింది.

మార్కెట్ క్రమశిక్షణ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్చి 17 నాటికి 2,300కిపైగా తనిఖీలు నిర్వహించాయి. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దాడులు కూడా చేపట్టారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 30 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూములు, 22 రాష్ట్రాల్లో జిల్లా స్థాయి కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. వినియోగదారుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1800 2333 555, సీపీగ్రామ్స్, ఆయిల్ కంపెనీల వెబ్‌సైట్లు, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఎల్పీజీ ప్రమాదాలు, లీకేజీల వంటి ఫిర్యాదుల కోసం ప్ర‌త్యేకంగా 1906 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంచిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement