త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Bharat sleeper | సుదూర ప్రయాణాలకు వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. ఫ్లయిట్‌ టికెట్ల తరహాలోనే కన్ఫర్మ్‌ టికెట్‌..!

Vande Bharat sleeper | భారతీయ రైల్వేశాఖ ఇటీవల ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ స్లీపర్‌ రైలును పట్టాలెక్కించింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య రాత్రి సమయంలో సుదూర ప్రయాణం చేసే వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఈ రైళ్లను ప్రారంభించింది. ప్రస్తుతం అసోంలోని కామాఖ్య నుంచి బెంగాల్‌లోని హౌరా మార్గంలో రాకపోకలు సాగిస్తోంది.

P

National | Published On Mar 12, 2026, 9.30 am IST

Vande Bharat sleeper | సుదూర ప్రయాణాలకు వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. ఫ్లయిట్‌ టికెట్ల తరహాలోనే కన్ఫర్మ్‌ టికెట్‌..!
Advertisement

Vande Bharat sleeper | భారతీయ రైల్వేశాఖ ఇటీవల ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ స్లీపర్‌ రైలును పట్టాలెక్కించింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య రాత్రి సమయంలో సుదూర ప్రయాణం చేసే వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఈ రైళ్లను ప్రారంభించింది. ప్రస్తుతం అసోంలోని కామాఖ్య నుంచి బెంగాల్‌లోని హౌరా మార్గంలో రాకపోకలు సాగిస్తోంది. ఇక దశలవారీగా 260 వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను నడిపించాలని భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం ఈ స్లీపర్ రైళ్ల తయారీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రైళ్ల రూపకల్పన, తయారీ బాధ్యతలను బీఈఎంఎల్‌, చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా చేపట్టాయి. రాత్రి ప్రయాణాలకు అనువుగా ఉండేలా ఈ రైళ్లను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. ప్రయాణికులు ఒక నగరం నుంచి మరో నగరానికి రాత్రి సమయంలో సౌకర్యంగా ప్రయాణించి ఉదయం గమ్యస్థానానికి చేరుకునేలా ఈ రైళ్లను రూపొందిస్తున్నారు. రైల్వే శాఖ ప్రణాళిక ప్రకారం.. 2026 చివరినాటికి కనీసం 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశంలోని పలు మార్గాల్లో నడిపించాలని భావిస్తోంది.

కొత్తగా బుకింగ్‌ విధానం..

కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ రైళ్లకు సంబంధించి టికెట్ బుకింగ్ విధానం, ఛార్జీల విషయంలో కూడా కొన్ని మార్పులు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. సాధారణ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలను మెరుగుపరుస్తూనే టికెట్ బుకింగ్ ప్రక్రియను కొంత భిన్నంగా అమలు చేయనుంది. ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ టికెట్లకు అవకాశం ఉండదు. ప్రయాణికులకు కేవలం కన్ఫర్మ్ టికెట్లు మాత్రమే జారీ చేస్తుంది. దాంతో ప్రయాణ సమయంలో కన్ఫర్మేషన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండదు. టికెట్లు పూర్తిగా ఆన్‌లైన్, డిజిటల్‌ విధానంలోనే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే కౌంటర్ల వద్ద ఈ రైళ్లకు టికెట్లు ఇవ్వకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. చార్జీల విషయంలో కూడా రైల్వే శాఖ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ప్రయాణ దూరాన్ని ఆధారంగా చేసుకుని టికెట్ ధరలు నిర్ణయిస్తారు. కనీసం 400 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ వర్తించేలా విధానం ఉండనుంది. 400 కిలోమీటర్ల ప్రయాణానికి థర్డ్‌ఏసీ టికెట్ ధర సుమారు రూ.960 వరకు ఉండే అవకాశం ఉందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక కోసం సౌకర్యాలు కల్పిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన పురుషులు, 45 ఏళ్లు దాటిన మహిళలకు లోయర్ బెర్త్‌లను ప్రాధాన్యంగా కేటాయించే విధంగా సిస్టమ్‌ను రూపొందిస్తున్నారు. దీంతో సినియర్‌ సిటిజన్లు అప్పర్‌ బెర్తులు ఎక్కాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. సాంకేతికత, వేగం, భద్రత పరంగా కూడా ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రస్తుత రైళ్లకంటే మెరుగ్గా ఉండేలా రూపొందిస్తున్నారు.

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో..

ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. దీంతో దీర్ఘదూర ప్రయాణాల సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైళ్లలో ఆధునిక భద్రతా వ్యవస్థలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా కవచ్‌ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.  అగ్నిప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రత్యేక ఫైర్ బారియర్ తలుపులు బిగించనున్నారు. కోచ్‌లలో గాలి పరిశుభ్రంగా ఉండేందుకు యూవీ-సీ ల్యాంప్స్‌ అమరుస్తున్నారు. ఇవి కోచ్‌లలోని గాలిని శుభ్రంగా ఉంచి సూక్ష్మక్రిములను తగ్గించడంలో సహాయపడతాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, పై బెర్త్‌లకు సులభంగా ఎక్కేందుకు సౌకర్యవంతమైన మెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రాత్రి ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను రూపొందిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement