త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Review | స్పెష‌ల్ కాంటింజెన్సీ పంట ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాలి.. క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్ సంజ‌య్ జాజు ఆదేశం

CS Review | వ‌ర్షాభావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో లోటు ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలని చీఫ్ సెక్రటరీ సంజ‌య్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఆయ‌న శ‌నివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వ్యవసాయం, ఆరోగ్యం, తాగునీరు, విద్య రంగాల్లో ప్రస్తుత పరిస్థితులు, సన్నద్ధతపై సమీక్ష చేశారు.

P

Telangana | Published On Jul 4, 2026, 6.51 pm IST

CS Review | స్పెష‌ల్ కాంటింజెన్సీ పంట ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాలి.. క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్ సంజ‌య్ జాజు ఆదేశం
Advertisement

CS Review | వ‌ర్షాభావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో లోటు ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలని చీఫ్ సెక్రటరీ సంజ‌య్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఆయ‌న శ‌నివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వ్యవసాయం, ఆరోగ్యం, తాగునీరు, విద్య రంగాల్లో ప్రస్తుత పరిస్థితులు, సన్నద్ధతపై సమీక్ష చేశారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సమీక్షలో భాగంగా కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా ప్రత్యేక కాంటింజెన్సీ పంట ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల లభ్యతతో పాటు పంపిణీపై కఠిన పర్యవేక్షణ అవసరమని ఆయన స్పష్టం చేశారు.

ప్రాంతీయ వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. పంటల వైవిధ్యీకరణపై రైతుల్లో విస్తృత అవగాహన క‌ల్పించి త‌ర్వాత కొంత మేర‌కు అనిశ్చితి ప్ర‌భావాన్ని త‌గ్గించొచ్చ‌ని, రైతుల ఆదాయ స్థిరత్వం పెరుగుతుందన్నారు. ఆరోగ్య రంగ సమీక్షలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని శాఖల మధ్య సమన్వయం బలోపేతం చేయాలని ఆదేశించారు. ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, గ్రామీణ నీటి సరఫరా శాఖలు కలిసి శుభ్రత కార్యక్రమాలు, దోమల నియంత్రణ చర్యలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముందస్తు చర్యలతో వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో విద్యుత్ సరఫరాను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

తాగునీటి సరఫరా అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా చూడాలని చీఫ్ సెక్రటరీ స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి లభ్యతపై నిరంతర సమీక్ష జరిపి, కొరత ఏర్పడే అవకాశం ఉన్నచోట వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా రంగ సమీక్షలో మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన వంటగది మౌలిక వసతుల కోసం అనువైన స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి అమ‌లును క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌ర్య‌వేక్షించాల‌ని, ప్రాధాన్య అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. వీసీల స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీలు, దాన కిశోర్‌, న‌వీన్ మిట్ట‌ల్‌, ఆయాశాఖ‌ల కార్య‌ద‌ర్శులు క్రిస్టినా చోంగ్తు, ఈ శ్రీ‌ధ‌ర్‌, సురేంద్ర మోహ‌న్‌, టీకే శ్రీ‌దేవి, దాస‌రి హ‌రిచంద‌న‌, అశోక్‌రెడ్డి, యాస్మిన బాషా, న‌విన్ నికోల‌స్‌, గోపీ, అభిలాష పాల్గొన్నారు.

Advertisement
Advertisement