త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Cabinet | నాలుగు కొత్త ప‌థ‌కాల‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్‌.. రూ.54,926 కోట్లు కేటాయింపు..!

Union Cabinet | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలో బుధ‌వారం కేంద్ర కేబినెట్ స‌మావేశ‌మైంది. ఈ సంద‌ర్భంగా కీల‌క ఆర్థిక నిర్ణ‌యాలు, ఇండ‌స్ట్రీ, వ్య‌వ‌సాయం, రోడ్లు, ఎన‌ర్జీ రంగాల‌కు సంబంధించి ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ సంద‌ర్భంగా నాలుగు ప‌థ‌కాల‌ను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

P

National | Published On Mar 18, 2026, 7.19 pm IST

Union Cabinet | నాలుగు కొత్త ప‌థ‌కాల‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్‌.. రూ.54,926 కోట్లు కేటాయింపు..!
Advertisement

Union Cabinet | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలో బుధ‌వారం కేంద్ర కేబినెట్ స‌మావేశ‌మైంది. ఈ సంద‌ర్భంగా కీల‌క ఆర్థిక నిర్ణ‌యాలు, ఇండ‌స్ట్రీ, వ్య‌వ‌సాయం, రోడ్లు, ఎన‌ర్జీ రంగాల‌కు సంబంధించి ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ సంద‌ర్భంగా నాలుగు ప‌థ‌కాల‌ను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఆయా ప‌థ‌కాల‌కు రూ.54,926 కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయించింది. కేబినెట్ స‌మావేశం అనంత‌రం నిర్ణ‌యాల‌ను కేంద్ర స‌మాచార‌శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు.

భారత ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ స్కీమ్ (BHAVYA)

కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ‘భారత ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ స్కీమ్ (BHAVYA)ని మంజూరుచేసింది. ఈ ప‌థ‌కానికి రూ.33,660 కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయించింది. ఈ ప‌థ‌కం కింద వంద ఇన్వెస్ట్‌మెంట్ రెడీ, ప్ల‌గ్ అండ్ ప్లే ఇండ‌స్ట్రియ‌ల్ పార్కుల‌ను దేశ‌వ్యాప్తంగా అభివృద్ధి చేయ‌నున్నారు. ప్ర‌తి ఎక‌రానికి రూ.కోటి వ‌ర‌కు ఆర్థిక స‌హాయాన్ని కేంద్రం అందించ‌నున్న‌ది. ఈ ప‌థ‌కం 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి 2031-32 వ‌ర‌కు అమ‌లుకానుంది. సాధార‌ణ ప్రాంతాల్లో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ క‌నీసం వంద ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈశాన్య, కొండ ప్రాంతాల్లో ఈ పరిమితిని 25 ఎకరాలుగా నిర్ణయించారు. ఈ చొరవతో దేశ తయారీ రంగాన్ని, ఉద్యోగ కల్పనను వేగవంతం చేయ‌నుంది.

ప‌త్తికి ఎమ్మెస్పీ

కేంద్ర కేబినెట్ 2023-24 పత్తి సీజన్‌లో కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాల నిర్వహణ కోసం వెచ్చించిన రూ.1,718 కోట్ల వ్యయాన్ని తిరిగి చెల్లించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అక్టోబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు కొనసాగిన ఈ సీజన్‌లో పత్తి ధరలు ఎంఎస్‌పీ కంటే దిగువకు పడిపోవడంతో రైతులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం 'కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (CCI) ద్వారా రైతుల నుంచి పత్తిని ఎంఎస్‌పీ ధ‌ర‌కు సేక‌రించింది. ఈ ప్రక్రియ ద్వారా 7.25 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందారు. మొత్తంగా 33 లక్షల పత్తి బేళ్లను సేకరించారు. ఈ సేకరణల ద్వారా రైతులకు సహాయం రూపంలో మొత్తం రూ.11,712 కోట్లు అందించారు. 2023-24 పత్తి సీజన్‌లో రైతులు మొత్తంగా 325 లక్షల బేళ్ల ప‌త్తిని ఉత్పత్తి చేశారు.

రోడ్లు-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

జాతీయ రహదారి అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు వేసింది. జాతీయ రహదారి-927లోని బారాబంకి నుంచి బహ్రాయిచ్ వరకు ఉన్న విభాగాన్ని 4-లేన్లుగా విస్తరించేందుకు రూ.6,969 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 101.515 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్స్ కేంద్రాలను అనుసంధానించే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ), బారాబంకి నుంచి బహ్రాయిచ్ వరకు 4-లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ జాతీయ రహదారి-927 నిర్మాణానికి రూ.6,969.04 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్‌ఎం)లో ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో సివిల్ పనులకు సుమారు రూ.3,485.49 కోట్ల వ్యయం కాగా.. భూసేకరణకు అదనంగా రూ.1,574.85 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్ర‌త్య‌క్షంగా 36.54 లక్షలు, 43.04 లక్షల ప‌రోక్ష ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌నుంది.

స్మాల్ హైడ్రోపవర్ డెవలప్‌మెంట్ స్కీమ్

కేంద్ర కేబినెట్ రూ.2,585 కోట్లు వ్యయంతో చిన్న హైడ్రోపవర్ స్కీమ్‌ని మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు రన్-ఆఫ్-ది-రివర్ విధానం ద్వారా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు అశ్విని వైష్ణ‌వ్ పేర్కొన్నారు. ఇందులో డ్యామ్‌లు నిర్మించాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. దేశంలో 7,133 సైట్ల‌లో 21,000 MW సామర్థ్యం ఉన్న చిన్న హైడ్రో ప్రాజెక్ట్‌లు సాధ్యమని మంత్రి చెప్పారు. ప్రస్తుతం 1,196 సైట్ల‌లో 5,100 MW సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు పనిచేస్తున్నాయ‌న్నారు. వీటి సామర్థ్యం 1 MW నుంచి 25 MW వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టులు 2030-31 వరకు ఐదు సంవత్సరాల్లో అమలు కానున్నాయి. ఈ పథకం ద్వారా సుమారు రూ.15వేల కోట్లు పెట్టుబడులు వ‌స్తాయ‌ని అంచ‌నా.

Advertisement

తాజావార్తలు

Advertisement