త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maoist Leader Papa Rao Surrender | 35 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర.. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పాపారావు

దండకారణ్యంలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మావోయిస్టు అగ్రనేత పాపారావు తన 17 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనపై రూ.2 కోట్ల రివార్డు ఉంది.

J

National | Published On Mar 24, 2026, 9.20 pm IST

Maoist Leader Papa Rao Surrender | 35 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర.. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పాపారావు
Advertisement
  • ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ ఎస్పీ ఎదుట 17 మంది అనుచరులతో కలిసి లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య
  • బస్తర్ ప్రాంతంలో 50కి పైగా కేసులు ఉన్న పాపారావుపై రూ.2 కోట్ల భారీ రివార్డు
  • సరెండర్ అయిన వారిలో 10 మంది పురుషులు, 8 మంది మహిళలు
  • వీళ్ల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం
  • సుక్మా జిల్లా కలెక్టర్ కిడ్నాప్ ఉదంతంలో పాపారావు దే కీలక పాత్ర
  • కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్' ముమ్మరం కావడం, పోలీసుల ఒత్తిడి వల్లే అజ్ఞాతాన్ని వీడినట్లు సమాచారం
  • ఒడిశా రాష్ట్రంలో రూ.55 లక్షల రివార్డు ఉన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు 'సుక్రు' సైతం మరో నలుగురితో కలిసి పోలీసుల ఎదుట లొంగుబాటు

Maoist Leader Papa Rao Surrender | త్రినేత్ర.న్యూస్ : దండకారణ్యంలో దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న మావోయిస్టులకు మరో కోలుకోలేని భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తూ, 35 ఏళ్లుగా అజ్ఞాతవాసంలో ఉన్న సీపీఐ మావోయిస్టు పార్టీ (CPI Maoist Party) అగ్రనేత పాపారావు ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ ఎస్పీ ఎదుట తన 17 మంది అనుచరులతో కలిసి ఆయన సరెండర్ అయ్యాడు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31 గడువు ముగియకముందే ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం బస్తర్ ప్రాంతంలో పెను సంచలనంగా మారింది.

ఎవరీ పాపారావు? ఆయన ప్రస్థానం ఏంటి?

డివిజనల్ కమిటీ (DKSZC) కమాండర్‌గా ఉన్న పాపారావు కు 'మంగు దాదా', 'చంద్రన్న', 'సున్నం చంద్రయ్య' అనే అలియాస్ పేర్లు ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఇంద్రావతి-అబుజ్‌మడ్ (Indravati-Abuzmad) అటవీ ప్రాంతం కేంద్రంగా ఆయన తన కార్యకలాపాలు సాగించాడు. గెరిల్లా యుద్ధ తంత్రంలో మడావి హిడ్మా, బార్సే దేవా తర్వాత పాపారావు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా పేరుగాంచాడు.

భద్రతా బలగాలపై జరిగిన భారీ ఎన్‌కౌంటర్లు, మెరుపు దాడుల్లో ఈయనదే మాస్టర్ మైండ్. గతంలో 76 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన అత్యంత దారుణమైన ఘటనలోనూ, సంచలనం సృష్టించిన సుక్మా జిల్లా కలెక్టర్ అపహరణ ఉదంతంలోనూ పాపారావు కీలక పాత్ర పోషించాడు. బస్తర్ ప్రాంతానికి చెందిన ఈయనపై మొత్తం 50కి పైగా కేసులు ఉండగా.. ప్రభుత్వం ఏకంగా రూ.2 కోట్ల భారీ రివార్డును ప్రకటించింది. పలుమార్లు ఎన్‌కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్న ఆయన ఎట్టకేలకు ఆయుధాలు వదిలేశాడు.

పాపారావుతో పాటు లొంగిపోయిన కీలక నేతలు వీరే..

బీజాపూర్ ఎస్పీ ఎదుట పాపారావుతో పాటు మొత్తం 17 మంది అనుచరులు లొంగిపోయారు. వీరిలో 10 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సరెండర్ అయిన వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

లొంగిపోయిన వారిలో పాపారావుతో పాటు మావోయిస్టు పార్టీలోని పలువురు ప్రముఖులు ఉన్నారు. ఏసీఎం కొర్రం మనీష, ఏసీఎం పర్చాపి మంగేష్, సీవైపీసీఎం కమాండర్ కేశా సోఢి, పరాతాపూర్ ఏసీఎం చందర్ కట్లం, పరాతాపూర్ ఏసీఎం రూపి, దక్షిణ బస్తర్ డివిజన్ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ విజ్జా హేమలా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

సరెండర్ దిశగా ఎందుకు అడుగులు వేశారు?

ఈ నెల 31కల్లా దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతమొందించాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ కగార్' (Operation Kagar)ను ప్రారంభించింది. ఇది తుది దశకు చేరుకోవడంతో.. దక్షిణ బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. అడవులను జల్లెడ పట్టడం, మావోయిస్టుల సమాచార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాపారావు నెట్‌వర్క్ బలహీనపడింది. దానికి తోడు భద్రతా దళాల నుంచి పెరిగిన తీవ్ర ఒత్తిడి, ప్రాణభయం కారణంగానే ఓ స్థానిక జర్నలిస్టు ద్వారా అధికారులను సంప్రదించి ఆయన లొంగిపోయినట్లు తెలుస్తోంది.

దక్షిణ, పశ్చిమ బస్తర్ రీజియన్లలో మిగిలి ఉన్న చివరి డీకేఎస్‌జెడ్‌సీ కీలక కమాండర్‌ పాపారావు లొంగిపోవడంతో.. ఆ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి దాదాపు నామమాత్రంగా మారిందని భద్రతా దళాలు భావిస్తున్నాయి.

ఒడిశాలోనూ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లొంగుబాటు

అటు ఒడిశా రాష్ట్రంలోనూ మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ.55 లక్షల రివార్డు ఉన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత 'సుక్రు' కూడా ఈరోజు తన మరో నలుగురు అనుచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వరుస లొంగుబాట్లతో దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంలో పడింది.

Advertisement

తాజావార్తలు

Advertisement