త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Politicians | గగనతలంలోనే విహరిస్తూ.. అనంతలోకాలకు వెళ్లిపోయారు

Politicians | మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ బుధవారం ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ప్రకటించింది.

S

National | Published On Jan 28, 2026, 11.10 am IST

Politicians | గగనతలంలోనే విహరిస్తూ.. అనంతలోకాలకు వెళ్లిపోయారు
Advertisement

Politicians | మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ బుధవారం ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ప్రకటించింది. బుధవారం ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన సమయంలో కంట్రోల్‌ తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయనతో పాటు విమానంలో ఉన్న ఇతర సిబ్బంది కూడా మృతి చెందారు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజల్లోనూ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అజిత్ పవార్ మృతి దేశ రాజకీయాల్లో తీరని లోటుగా పలువురు నేతలు పేర్కొంటున్నారు.

విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ రాజకీయ నాయకులు..

దేశంలో గతంలోనూ పలువురు ప్రముఖ రాజకీయ నేతలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించారు. వారిలో ముఖ్యుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

2025 - విజయ్ రూపానీ

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురవడంతో మృతి చెందారు. విమానం ఓక మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కూలి మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 241 మంది మృతి చెందారు. 68 ఏళ్ల రూపానీ తన కుటుంబాన్ని కలవడానికి యూకే వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

2011 - దోర్జీ ఖాండు

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖాండు చైనా సరిహద్దు సమీపంలోని మారుమూల ప్రాంతంలో పావన్ హన్స్ హెలికాప్టర్ కూలిపోవడంతో 2011 ఏప్రిల్ 30న మృతి చెందారు. ఐదు రోజుల తర్వాత ఆయన మృతదేహం లభ్యమైంది.

2009 - వైఎస్ రాజశేఖర రెడ్డి (వైఎస్సార్)

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విస్తృత గాలింపుల తర్వాత మరుసటి రోజు విమానం శకలాలు, మృత‌దేహాల‌ను గుర్తించారు.

2005 - ఓపీ జిందాల్, సురేందర్ సింగ్

హర్యానా విద్యుత్ శాఖ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఓపీ జిందాల్, మాజీ కేంద్ర మంత్రి సురేందర్ సింగ్ (మాజీ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ కుమారుడు) ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో 2005 మార్చి 31న మృతి చెందారు.

2004 - సిప్రియన్ సంగ్మా

మేఘాలయ గ్రామీణాభివృద్ధి మంత్రి సిప్రియన్ సంగ్మా సహా మరో తొమ్మిది మంది 2004 సెప్టెంబర్ 22న గువాహటి నుంచి షిల్లాంగ్‌కు వెళ్తుండ‌గా వారు ప్ర‌యాణిస్తున్న‌ పావన్ హన్స్ హెలికాప్టర్ బరాపానీ సరస్సు సమీపంలో కూలిపోవడంతో మరణించారు.

2002 - జీఎంసీ బాలయోగి

లోక్‌సభ స్పీకర్, టీడీపీ నేత జీఎంసీ బాలయోగి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదంలో 2002 మార్చి 3న మృతి చెందారు. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని అప్పట్లో అధికారులు వెల్లడించారు.

2001 - మాధవరావ్ సింధియా

కాంగ్రెస్ సీనియర్ నేత, గ్వాలియర్ రాజ కుటుంబ సభ్యుడు మాధవరావ్ సింధియా ఉత్తరప్రదేశ్‌లోని మైన్పురి జిల్లా భోగావ్ ప్రాంతంలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో 2001 సెప్టెంబర్ 30న మృతి చెందారు. ఆయన కాన్పూర్‌లో ర్యాలీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

1980 - సంజయ్ గాంధీ

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ 1980 జూన్ 23న ఢిల్లీ సఫ్దర్జంగ్ విమానాశ్రయం సమీపంలో టెస్ట్‌ విమాన ప్రయాణం చేస్తుండగా విమానం కూలిపోవడంతో 33 ఏళ్ల వయసులో మృతి చెందారు.

1973 - గుర్నామ్ సింగ్

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గుర్నామ్ సింగ్ 1973 మే 31న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

1965- బల్వంత్రాయ్ మెహతా

గుజరాత్ రెండో ముఖ్యమంత్రి బల్వంత్రాయ్ మెహతా 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ వైమానిక దళం పొరపాటున కాల్చిన పౌర విమానం కూలిపోవడంతో సరిహద్దు ప్రాంతంలో మృతి చెందారు.

Advertisement

తాజావార్తలు

Advertisement