త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

live-in relationship | పెళ్లైన పురుషుడు మ‌రో మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేయడం నేరం కాదు.. అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

live-in relationship | పెళ్లైన పురుషుడు మ‌రో మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేయ‌డం నేరం కాదని అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. పెళ్లయిన వ్యక్తి.. వేరే మహిళతో ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే.. ఏ చట్టం అడ్డుకోలేదని, అది నేరం కిందకు రాదని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

S

National | Published On Mar 27, 2026, 5.24 pm IST

live-in relationship | పెళ్లైన పురుషుడు మ‌రో మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేయడం నేరం కాదు.. అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు
Advertisement

live-in relationship | త్రినేత్ర‌.న్యూస్ : పెళ్లైన పురుషుడు మ‌రో మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేయ‌డం నేరం కాదని అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. పెళ్లయిన వ్యక్తి.. వేరే మహిళతో ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే.. ఏ చట్టం అడ్డుకోలేదని, అది నేరం కిందకు రాదని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. షాజ‌హాన్‌పూర్‌కు చెందిన నేత్ర‌పాల్ అనే పెళ్లైన పురుషుడు.. 18 ఏళ్ల యువ‌తితో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. దీంతో యువ‌తి కుటుంబ స‌భ్యులు సంబంధిత వ్య‌క్తిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ న‌మోదు కావ‌డంతో.. మొత్తానికి ఈ కేసు కోర్టు మెట్లెక్కింది. పెళ్లైన పురుషుడు త‌మ బిడ్డ‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడ‌ని ఇది నేరం అని ఆమె కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు. అయితే ధ‌ర్మాస‌నం ఈ పిటిష‌న్‌ను తిర‌స్క‌రిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించింది.

పెళ్లైన పురుషుడు మ‌రో మ‌హిళ‌తో లివ్ ఇన్ రిలేష‌న్‌షిప్‌(స‌హ‌జీవనం)లో ఉండ‌డం నేరం కాద‌ని అల‌హాబాద్ కోర్టు పేర్కొంది. ఇద్ద‌రి స‌మ్మ‌తితోనే స‌హ‌జీవ‌నంలో ఉన్నారు కాబ‌ట్టి.. ఎలాంటి నేరం కాద‌ని స్ప‌ష్టం చేసింది. సామాజిక నైతికత వేరు, చట్టం వేరు. పౌరుల హక్కులను కాపాడే విషయంలో కోర్టులు సామాజిక అభిప్రాయాలకు లేదా నైతికతకు కట్టుబడి ఉండవు అని కోర్టు స్పష్టం చేసింది. నేత్రపాల్ పెళ్లైన వ్య‌క్తి అయినప్పటికీ, ఇద్దరు వయోజనులు ఇష్ట పూర్వకంగా కలిసి ఉండటాన్ని చట్టం అడ్డుకోదు. ప్రాథమికంగా ఇక్కడ ఎటువంటి నేరం జరిగినట్లు కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.

తాను మేజ‌ర్‌ను అని పేర్కొంటూ షాజ‌హాన్‌పూర్ ఎస్సీకి స‌ద‌రు యువ‌తి ఆధారాల‌తో కూడిన ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించింది. నేత్ర‌పాల్‌తో ఇష్ట‌పూర్వ‌కంగానే ఉంటున్నాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని కూడా కోర్టు నొక్కి చెప్పింది. యువ‌తి త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యుల నుంచి త‌మ‌కు ప్రాణ‌భ‌యం ఉంద‌ని ఎస్పీకి ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ఎలాంటి చ‌ర్య తీసుకోక‌పోవ‌డంతో కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన కోర్టు.. ఇద్ద‌రు వ‌యోజ‌నుల‌ను ర‌క్షించ‌డం పోలీసుల ప్రాథ‌మిక విధి అని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ జంటకు పూర్తి రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement