త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..

CBDT | దేశంలోని పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంతోపాటు స్వచ్ఛంద పన్ను చెల్లింపును ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కీలక నిర్ణయం తీసుకుంది.

S

Business | Published On Jul 17, 2026, 3.54 pm IST

CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..
Advertisement

CBDT | దేశంలోని పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంతోపాటు స్వచ్ఛంద పన్ను చెల్లింపును ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార ప్రకటన (ఏఐఎస్)లో విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని చూపించే సౌకర్యాన్ని ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ప్రారంభించింది. ఈ సమాచారం ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) వ్యవస్థ ద్వారా అందుతుంది. ఈ సౌకర్యాన్ని పన్ను చెల్లింపుదారులను పరిశీలించడం లేదా ఐటీఆర్ దాఖలుపై నిఘా పెట్టడం కోసం కాకుండా, వారు పన్ను నిబంధనలను సక్రమంగా పాటించేందుకు సహాయపడే ఉద్దేశంతోనే తీసుకొచ్చామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా భాగస్వామ్య దేశాలతో ఆర్థిక సమాచార మార్పిడికి సంబంధించిన అనేక అంతర్జాతీయ ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ప్రకారం, ప్రతి సంవత్సరం భారత పన్ను నివాసితులకు చెందిన విదేశీ ఆర్థిక ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని భారత్ స్వీకరిస్తుంది.

3 ఏళ్ల సమాచారం అందుబాటులో..

ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) కింద గత క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన సమాచారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి అందడం ప్రారంభమవుతుందని అధికారి వివరించారు. ఇందులో విదేశీ బ్యాంక్ ఖాతాలు, కస్టోడియల్ ఖాతాలు, కొన్ని ఆర్థిక పెట్టుబడులు, వడ్డీ, డివిడెండ్లు, అలాగే భాగస్వామ్య దేశాలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పంచుకునే ఇతర నిర్దిష్ట ఆర్థిక ఆదాయ వివరాలు ఉంటాయి. ప్రస్తుతం 2022, 2023, 2024 క్యాలెండర్ సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్ని ఏఐఎస్‌లో అందుబాటులో ఉంచారు. 2025 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన సమాచారం సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2026లో అందిన తర్వాత ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ప్రదర్శిస్తారు. ఏఐఎస్‌లో కనిపించే విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయ సమాచారం భారత్‌కు భాగస్వామ్య దేశాల నుంచి అందిన వివరాలకే పరిమితమని సీబీడీటీ స్పష్టం చేసింది. విదేశాల్లో పన్ను చెల్లింపుదారుడికి ఉన్న అన్ని ఆస్తులు, ఆదాయానికి ఇది పూర్తి రికార్డు కాదని తెలిపింది. అందువల్ల ఏఐఎస్‌లో సమాచారం కనిపించినా, కనిపించకపోయినా, ఆదాయపు పన్ను రిటర్న్‌లోని షెడ్యూల్ ఎఫ్‌ఏ, షెడ్యూల్ ఎఫ్‌ఎస్‌ఐలో విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయానికి సంబంధించిన పూర్తి, క‌చ్చితమైన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది.

విదేశీ ఆస్తులు, ఆదాయం తెలుసుకోవ‌చ్చు..

ఈ కొత్త సౌకర్యం ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ ఈ-ఫైలింగ్ ఖాతాలో సురక్షితంగా లాగిన్ అయి విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని సులభంగా చూడవచ్చు. దీంతో ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో షెడ్యూల్ ఎఫ్‌ఏ, షెడ్యూల్ ఎఫ్‌ఎస్‌ఐలో సరైన వివరాలను నమోదు చేయడం మరింత సులభం అవుతుంది. విదేశీ ఆస్తుల సమాచారాన్ని చూడాలంటే ముందుగా ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ కావాలి. అనంతరం ఏఐఎస్ విభాగంలోకి వెళ్లి కంప్లయన్స్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ రిపోర్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫారిన్ అసెట్స్ ఇన్ఫర్మేషన్‌ను ఎంపిక చేయాలి. ఆ తర్వాత సంబంధిత క్యాలెండర్ సంవత్సరాన్ని ఎంచుకుని పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సౌకర్యాన్ని పూర్తిగా పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసమే ప్రవేశపెట్టామని సీబీడీటీ తెలిపింది. శాఖ వద్ద ఉన్న అంతర్జాతీయ సమాచారాన్ని వారికి అందుబాటులో ఉంచి, వారు తమ ఆదాయపు పన్ను రిటర్నులను క‌చ్చితంగా, పారదర్శకంగా దాఖలు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. దీనిని విచారణ లేదా స్క్రూటినీ సాధనంగా ఉపయోగించబోమని స్పష్టం చేసింది.

ఆ వివ‌రాల‌ను న‌మోదు చేయాలి..

ఈ కార్యక్రమంలో భాగంగా 2026-27 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయ వివరాలను క‌చ్చితంగా నమోదు చేయాలని పన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్‌లు, ఈమెయిల్స్ పంపిస్తున్నారు. అలాగే ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ట్యాక్స్ సాథీ సేవలను కూడా పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోవచ్చు. సరైన రిటర్న్ ఫారం ఎంపిక, విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయ వివరాల నమోదు, ఇతర పన్ను సంబంధిత సందేహాలకు ఇది సహాయపడుతుంది. ఈ కొత్త సౌకర్యం ద్వారా అవసరమైన సమాచారాన్ని పన్ను చెల్లింపుదారులు ముందుగానే పొందవ‌చ్చ‌ని, అనుకోకుండా జరిగే నివేదికల లోపాలు తగ్గుతాయని, ఆదాయపు పన్ను రిటర్నులు మరింత క‌చ్చితంగా మారడంతోపాటు పన్ను అనుసరణ ప్రక్రియ గతంతో పోలిస్తే మరింత సులభంగా, పారదర్శకంగా ఉంటుందని సీబీడీటీ తెలిపింది.

Advertisement
Advertisement