త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court on Physical Relations | పెళ్లి కాకముందే ఫిజికల్ రిలేషన్‌ అవసరమా? ప్రశ్నించిన సుప్రీం కోర్టు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడన్న కేసు విచారణలో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందే శారీరక సంబంధం ఎందుకు అని ప్రశ్నిస్తూ, యువత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

J

National | Published On Feb 16, 2026, 8.43 pm IST

Supreme Court on Physical Relations | పెళ్లి కాకముందే ఫిజికల్ రిలేషన్‌ అవసరమా? ప్రశ్నించిన సుప్రీం కోర్టు

సంక్షిప్త సారాంశం

పెళ్లికి ముందే యువతీయువకులు శారీరక సంబంధం పెట్టుకోవడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "మేము పాతకాలం వాళ్లమే కావచ్చు.. కానీ పెళ్లికి ముందు ఇద్దరూ ఒకరికొకరు అపరిచితులే కదా.. అలాంటప్పుడు ఫిజికల్ రిలేషన్‌షిప్ ఎలా?" అని ధర్మాసనం ప్రశ్నించింది. పెళ్లి పేరుతో మోసం చేశారన్న కేసు విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Supreme Court on Physical Relations | త్రినేత్ర.న్యూస్ : వివాహానికి ముందే శారీరక సంబంధాలు పెట్టుకోవడంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో దాఖలైన ఒక బెయిల్ పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

"అలాంటప్పుడు ఫిజికల్ రిలేషన్ ఎలా?"

జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. "మేము పాతకాలం ఆలోచనలు కలిగిన వాళ్లమే కావచ్చు (May be we are old fashioned). కానీ పెళ్లికి ముందు ఒక అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు అపరిచితులే. వారి మధ్య సంబంధం ఎంత గాఢమైనదైనా సరే.. పెళ్లికి ముందే శారీరక సంబంధంలో ఎలా పాల్గొంటారో మాకు అర్థం కావడం లేదు" అని వ్యాఖ్యానించింది. యువత ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని, పెళ్లికి ముందే ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని కోర్టు హితవు పలికింది.

అసలు కేసు ఏంటి?

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని ఒక వ్యక్తిపై మహిళ కేసు పెట్టింది. నిందితుడు అప్పటికే వేరే పెళ్లి చేసుకున్నాడని, ఆ విషయం దాచిపెట్టి తనతో సంబంధం కొనసాగించాడని బాధితురాలు ఆరోపించింది. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన నిందితుడు, తనను ఢిల్లీకి, దుబాయ్‌కి పిలిపించుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

దుబాయ్ ఎందుకు వెళ్లారు?

విచారణ సందర్భంగా.. బాధితురాలు నిందితుడిని కలిసేందుకు దుబాయ్ ఎందుకు వెళ్లారని ధర్మాసనం ప్రశ్నించింది. "ఒకవేళ ఆమెకు పెళ్లి చేసుకోవడమే ముఖ్యమైతే, పెళ్లికి ముందే అతడిని కలవడానికి ఎందుకు వెళ్లారు? ఆమె అంత కచ్చితంగా ఉన్నప్పుడు పెళ్లి కాకుండానే వెళ్లకూడదు కదా" అని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు.

ఈ కేసులో నిందితుడికి గతంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే, ప్రస్తుత పరిస్థితులను గమనించిన సుప్రీంకోర్టు, ఈ కేసును మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.

సహజీవనం, ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాల నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పెళ్లికి ముందే శారీరక సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోర్టు పరోక్షంగా హెచ్చరించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement