త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Liberation Day 2026 | బైరాన్‌పల్లి, నిర్మల్‌లో వెయ్యి మందిని ఉరితీసిన నిజాం రాజును అసెంబ్లీ వేదికగా కీర్తిస్తున్నరు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 79వ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, కేంద్ర మంత్రులు పాల్గొని నిజాం పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు.

J

Hyderabad | Published On Sep 17, 2026, 5.12 pm IST

Hyderabad Liberation Day 2026 | బైరాన్‌పల్లి, నిర్మల్‌లో వెయ్యి మందిని ఉరితీసిన నిజాం రాజును అసెంబ్లీ వేదికగా కీర్తిస్తున్నరు

సంక్షిప్త సారాంశం

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొని నిజాం పాలన, రజాకార్ల దురాగతాలపై ప్రసంగించారు. సాయుధ బలగాల కవాతు, పేరిణి నృత్యం, ఆదిలాబాద్ గోండు నృత్యాలు, డప్పుల దరువుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Advertisement
  • పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా 79వ హైదరాబాద్ విమోచన వేడుకలు
  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

Hyderabad Liberation Day 2026 | త్రినేత్ర.న్యూస్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా, చరిత్రాత్మక వాతావరణంలో జరిగాయి. భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ అధికారిక వేడుకల్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చరిత్రను దాచిపెట్టలేరు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటుంటే, తెలంగాణ ప్రజలు మాత్రం 13 నెలల పాటు రజాకార్ల నరకయాతనను అనుభవించారని గుర్తుచేశారు. చివరకు సర్దార్ పటేల్ చొరవతోనే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మజ్లిస్ పార్టీకి భయపడి గత పాలకులు అమరుల చరిత్రను తొక్కిపెట్టారని ఆరోపించారు. 2029 నాటికి తెలంగాణలోని ప్రతి పాఠశాల, ప్రతి చౌరస్తాలో ప్రభుత్వం తరఫున విమోచన వేడుకలు అధికారికంగా జరిగే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.

నిజాంను పొగడటం సిగ్గుచేటు: బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనపై, రజాకార్ల దురాగతాలపై పోరాడి ప్రాణాలర్పించిన వీరుల త్యాగఫలమే ఈ విమోచన దినోత్సవమని పేర్కొన్నారు. బైరాన్‌పల్లి, నిర్మల్‌లో వెయ్యి మందిని ఉరితీసిన నిజాం రాజును కొందరు నేతలు నేటికీ అసెంబ్లీ వేదికగా గొప్పవాడని కీర్తించడం తెలంగాణ సమాజానికే సిగ్గుచేటని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అమరుల అసలైన చరిత్రను వెలుగులోకి తెచ్చేందుకే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోందన్నారు.

ఆపరేషన్ పోలో న్యాయానికి దక్కిన విజయం: గజేంద్ర సింగ్ షెకావత్

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ఆపరేషన్ పోలో అనేది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదని, అన్యాయంపై న్యాయం సాధించిన విజయమని అభివర్ణించారు. జోధ్‌పూర్ లాన్సర్స్ సైన్యం కూడా హైదరాబాద్ విలీనంలో కీలక పాత్ర పోషించిందని, అమరులందరికీ నివాళులర్పిస్తున్నానని చెప్పారు.

ఆకట్టుకున్న కవాతు, జానపద కళారూపాలు

పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన పారామిలిటరీ, కేంద్ర సాయుధ దళాల మార్చ్‌పాస్ట్ ఆకట్టుకుంది. దీనితో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పేరిణి శివతాండవం, ఆదిలాబాద్ గోండు నృత్యాలు, డప్పుల దరువులు, ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ విచ్చేసిన అతిథులను విశేషంగా ఆకర్షించాయి.

Advertisement
Advertisement