త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Punjab Assembly Elections 2027 | పంజాబ్ ఎన్నికల సర్వే: ‘ఆప్’కే మళ్లీ చాన్స్.. కానీ ఆ ఒక్క తప్పే కొంపముంచొచ్చు!

2027 పంజాబ్ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ తాజా సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. ఆప్ దే స్వల్ప ఆధిక్యం అని తేల్చినా, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందట!

J

National | Published On Aug 6, 2026, 6.45 pm IST

Punjab Assembly Elections 2027 | పంజాబ్ ఎన్నికల సర్వే: ‘ఆప్’కే మళ్లీ చాన్స్.. కానీ ఆ ఒక్క తప్పే కొంపముంచొచ్చు!

సంక్షిప్త సారాంశం

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో (2027) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 58-63 స్థానాలతో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది. 36-43 సీట్లతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలవనుండగా, కొత్తగా బరిలోకి దిగుతున్న 'వారిస్ పంజాబ్ దే' 4-7 సీట్లతో సత్తా చాటనుంది. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ కే 40 శాతం మంది ఓటర్లు మద్దతు తెలిపారు. అయితే, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉందని, కొత్త వారికి టికెట్లు ఇస్తేనే గెలుపు సులువు అవుతుందని సర్వే స్పష్టం చేసింది.

Advertisement

Punjab Assembly Elections 2027 | త్రినేత్ర.న్యూస్ : 2027లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు (Punjab Assembly Elections) అత్యంత ఉత్కంఠ రేపనున్నాయి. పీపుల్స్ పల్స్ (Peoples Pulse) రీసెర్చ్ సంస్థ చేపట్టిన తాజా 'మూడ్ సర్వే'లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మళ్లీ స్వల్ప ఆధిక్యంతో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, 2022 ఎన్నికల తరహాలో ఈసారి వన్-సైడ్ వేవ్ (One-side wave) మాత్రం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండగా, స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఆప్‌కు అతిపెద్ద సవాలుగా మారబోతోంది.

సీట్లు, ఓట్ల లెక్కలు ఇలా

మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి 58 నుంచి 63 సీట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది. తద్వారా సింపుల్ మెజారిటీ మార్కును సునాయాసంగా చేరుకోనుంది. కాంగ్రెస్ పార్టీ 36 నుంచి 43 సీట్లతో బలమైన ప్రధాన ప్రతిపక్షంగా నిలవనుంది. ఇక రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న అమృత్‌పాల్ సింగ్ పార్టీ 'వారిస్ పంజాబ్ దే' 4-7 సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరచనుంది. భారతీయ జనతా పార్టీ (BJP) 2-6 సీట్లకు, శిరోమణి అకాలీదళ్ (SAD) 2-4 సీట్లకు పరిమితం కానున్నాయి.

ఓట్ల శాతం పరంగా చూస్తే.. ఆప్ 37%, కాంగ్రెస్ 31%, వారిస్ పంజాబ్ దే 14%, బీజేపీ 8%, అకాలీదళ్ 6%, ఇతరులు 4% ఓట్లు సాధించే ఛాన్స్ ఉంది. ఈ అంచనాలన్నీ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తాయనే ప్రాతిపదికన రూపొందించారు.

సీఎం రేసులో భగవంత్ మాన్ దే హవా

రాష్ట్రంలో అత్యంత పాపులర్ లీడర్‌గా ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) తన క్రేజ్‌ను అలాగే నిలబెట్టుకున్నారు. సీఎం పదవికి ఆయనకే అర్హత ఉందని 40 శాతం మంది ఓటర్లు మొగ్గుచూపారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీకి 33 శాతం మంది మద్దతు పలకగా.. అమృత్‌పాల్ సింగ్‌కు 13 శాతం మద్దతు లభించింది.

Punjab Assembly Elections 2027 Peoples Pulse Survey Predicts AAP Win

సిట్టింగ్ ఎమ్మెల్యేల వల్లే అసలు చిక్కు

ఈ మూడ్ సర్వేలో బయటపడిన అతి పెద్ద ట్విస్ట్.. ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న యాంటీ-ఇన్‌కంబెన్సీ (Anti-incumbency). సీఎం భగవంత్ మాన్, ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో పాజిటివ్ ఫీలింగ్ ఉన్నప్పటికీ.. స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం తీవ్ర అసంతృప్తి రగులుతోంది. ఎన్నికల నాటికి సిట్టింగ్‌లను పక్కనపెట్టి కొత్త వారికి అవకాశమిస్తేనే ఆప్ విజయావకాశాలు మెరుగుపడతాయని సర్వే తేల్చి చెప్పింది.

మిగతా పార్టీల పరిస్థితి ఏంటి?

కాంగ్రెస్: గ్రామీణ స్థాయిలో బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్ పార్టీ.. చన్నీని సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించి వర్గపోరును పక్కనపెడితే ఆప్‌కు చెమటలు పట్టించడం ఖాయం.

వారిస్ పంజాబ్ దే: డ్రగ్స్ ఫ్రీ పంజాబ్, సిక్కు అస్తిత్వం వంటి అంశాలతో ఈ పార్టీ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. శిరోమణి అకాలీదళ్ సాంప్రదాయ ఓటు బ్యాంకంతా ఇప్పుడు ఈ పార్టీ వైపు మళ్లుతోంది.

బీజేపీ: లూథియానా, జలంధర్, పటియాలా లాంటి పట్టణ ప్రాంతాల్లో, యువతలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నప్పటికీ.. రైతుల నమ్మకాన్ని తిరిగి పొందడం ఆ పార్టీకి ఇంకా సవాలుగానే మిగిలింది. రాఘవ్ చద్దా వంటి ఎంపీలు ఆప్ ను వీడినా.. గ్రౌండ్ లెవల్ ఓటర్లపై ఆ ప్రభావం శూన్యం.

డేరాల ప్రభావం: పంజాబ్ ఎన్నికల్లో డేరా సచ్చా సౌదా, రాధా స్వామి సత్సంగ్ లాంటి డేరాలు సామాజికంగా ఎంతో ప్రభావం చూపుతాయి. టైట్ ఫైట్ ఉన్న స్థానాల్లో వీరి నిర్ణయమే కీలకం కానుంది.

సర్వే ఎలా చేశారు?

పీపుల్స్ పల్స్ డైరెక్టర్ డాక్టర్ రాజన్ పాండే, సీనియర్ రీసెర్చర్ అమిత్ ఓహ్లాన్ నేతృత్వంలో జూన్ 20 నుంచి జూలై 31, 2026 వరకు (45 రోజుల పాటు) ఈ మెగా సర్వే జరిగింది. 117 నియోజకవర్గాల్లో తిరిగి.. 'సిస్టమాటిక్ స్ట్రాటిఫైడ్ రాండమ్ శాంప్లింగ్' పద్ధతిలో వివిధ వర్గాలకు చెందిన 8,000 మంది ఓటర్లను ఫేస్-టు-ఫేస్ (Face-to-face) కలిసి ఈ నివేదికను సిద్ధం చేశారు.

Advertisement
Advertisement