త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | వాహ‌నాల‌కు ఇన్సూరెన్స్ ఉంటేనే ఇంధ‌నం..? ప‌రిశీలిస్తున్న కేంద్రం..?

Supreme Court | పూర్తి స్థాయి ఇన్సూరెన్స్‌ను ప‌క్క‌న పెడితే క‌నీసం థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా లేకుండా చాలా పెద్ద సంఖ్య‌లో వాహ‌నాలు రోడ్ల‌పై తిరుగుతున్నాయ‌ని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ పంపులలో ఇంధనం నిరాకరించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

S

Business | Published On Aug 6, 2026, 5.47 pm IST

Supreme Court | వాహ‌నాల‌కు ఇన్సూరెన్స్ ఉంటేనే ఇంధ‌నం..? ప‌రిశీలిస్తున్న కేంద్రం..?
Advertisement

Supreme Court | పూర్తి స్థాయి ఇన్సూరెన్స్‌ను ప‌క్క‌న పెడితే క‌నీసం థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా లేకుండా చాలా పెద్ద సంఖ్య‌లో వాహ‌నాలు రోడ్ల‌పై తిరుగుతున్నాయ‌ని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ పంపులలో ఇంధనం నిరాకరించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టీహెచ్)తో కలిసి వాహనాల ఇన్సూరెన్స్ స్థితిని ఇంధన కొనుగోలుతో అనుసంధానించే విధానాన్ని రూపొందించాలని ఆదేశించింది.

ఇన్సూరెన్స్ లేక‌పోతే నో ఫ్యుయ‌ల్‌..

ప్రతిపాదిత వ్యవస్థ ప్రకారం.. చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు అవసరమైన బీమా పాలసీ తీసుకునే వరకు పెట్రోల్ లేదా డీజిల్ విక్రయాన్ని నిలిపివేసే అవకాశం ఉంటుంది. మోటార్ వెహికిల్స్ యాక్ట్‌లోని నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినప్పటికీ, ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ 2024-25 నివేదిక ప్రకారం దేశంలో రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో దాదాపు 56 శాతం వాహనాలకు బీమా లేకపోవడం ఆశ్చర్యకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విధానం అమలైతే బీమా లేని లేదా రిజిస్ట్రేషన్ సమస్యలున్న వాహనాలను గుర్తించడం సులభమవుతుందని, అలాగే వాహన యజమానులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ కొనసాగించేలా ప్రోత్సాహం లభిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఏఎన్‌పీఆర్ కెమెరాల వినియోగం..

మోటార్ వెహికిల్స్ యాక్ట్ సెక్షన్ 146 అమలును క్షేత్రస్థాయిలో నిర్ధారించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను వినియోగించాలని కోర్టు సూచించింది. ఈ ప్రతిపాదనకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఎలాంటి అభ్యంతరం లేదని కూడా కోర్టుకు పేర్కొంది. 2018లో కొత్త కార్ల కొనుగోలు లేదా రిజిస్ట్రేషన్ సమయంలో మూడు సంవత్సరాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, కొత్త ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. అయినప్పటికీ ఎనిమిదేళ్లు గడిచినా భారీ సంఖ్యలో వాహనాలు ఇప్పటికీ బీమా లేకుండా నడుస్తున్నాయని పేర్కొంది. రోడ్డు భద్రత దృష్ట్యా ఈ కాలపరిమితిని మరో ఏడాది పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇకపై కొత్త కార్లకు నాలుగేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, కొత్త ద్విచక్ర వాహనాలకు ఆరేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను వెంటనే జారీ చేయాలని ఐఆర్‌డీఏఐను ఆదేశించింది.

స‌గానికి పైగా వాహ‌నాల‌కు బీమా లేదు..

దేశంలో మొత్తం 30.48 కోట్ల వాహనాల్లో 16.54 కోట్ల వాహనాలకు ఇన్సూరెన్స్ లేదని కోర్టు పేర్కొంది. దీనివల్ల ప్రమాద బాధితులకు చట్టపరంగా లభించాల్సిన పరిహారం ఆలస్యమవుతుందని, కొన్నిసార్లు పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. వాహన బీమా లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారు లేదా మృతుల కుటుంబ సభ్యులు పరిహారం కోసం దీర్ఘకాల న్యాయపోరాటం చేయాల్సి వస్తోందని కోర్టు పేర్కొంది. ప్రమాద బాధితులకు త్వరగా నష్టపరిహారం అందించడమే కాకుండా, వారిని దీర్ఘకాల న్యాయ వివాదాల్లోకి వెళ్లకుండా కాపాడటమే తప్పనిసరి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉద్దేశమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఏఎన్‌పీఆర్ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్‌తో పాటు వాహన్ పోర్టల్‌తో అనుసంధానం చేయాలని ఐఆర్‌డీఏఐ, ఎంఓఆర్‌టీహెచ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఉల్లంఘ‌న‌ల‌కు ఈ-చ‌లాన్లు..

ఈ వ్యవస్థ ద్వారా చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేని వాహనాలను ఆటోమేటిక్‌గా గుర్తించి ఈ-చలాన్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర పోలీసులకు సంబంధిత డేటాబేస్‌లతో అనుసంధానమైన హ్యాండ్‌హెల్డ్ పరికరాలు లేదా యాప్‌లు అందించి, వాహనాల ఇన్సూరెన్స్ స్థితిని తక్షణమే పరిశీలించి ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేలా చూడాలని కూడా ధర్మాసనం సూచించింది. జాతీయ రహదారులపై జరిగే రోడ్డు ప్రమాదాలు, టోల్ ప్లాజాల వద్ద ఏర్పడుతున్న భారీ ట్రాఫిక్ రద్దీని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఎంపిక చేసిన రహదారి మార్గాల్లో వాహనాలను ఆపకుండా ఆటోమేటిక్ వాహన గుర్తింపు వ్యవస్థలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. సాంకేతికత ఆధారిత అమలు వ్యవస్థలు చట్టపరమైన నిబంధనల అమలును మరింత సమర్థవంతంగా చేయడమే కాకుండా, భౌతిక తనిఖీల అవసరాన్ని కూడా తగ్గిస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Advertisement
Advertisement