త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP | జెన్ జీ దెబ్బ‌కు.. బీజేపీ అబ్బా.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఓట‌మి

BJP | మూడు రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. గుజ‌రాత్‌లోని మంజల్‌పూర్ స్థానంలో మాత్ర‌మే గెలుపొందింది. అటు బీహార్‌లోని త‌న కంచుకోట బంకీపూర్ అసెంబ్లీ (Bankipur) నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో హోరాహోరీగా సాగిన పోటీలో కాంగ్రెస్ చేతిలో బీజేపీ అభ్య‌ర్థి స్వ‌ల్ప తేడాతో ఓట‌మిపాల‌య్యారు.

D

National | Published On Aug 3, 2026, 5.40 pm IST

BJP | జెన్ జీ దెబ్బ‌కు.. బీజేపీ అబ్బా.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఓట‌మి
Advertisement
  • క‌మలంపార్టీ కంచుకోట బ‌ద్ద‌లు కొట్టిన ప్ర‌శాంత్ కిషోర్‌
  • గుజ‌రాత్‌లో ప‌డిపోయిన మెజారిటీ
  • మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పోరాడి ఓడిన క‌మ‌లం
  • చ‌ర్చ‌నీయాంశంగా మారిన బీజేపీ ఓట‌మి

BJP | త్రినేత్ర‌.న్యూస్ : నీట్ పేప‌ర్ లీక్‌, విద్యా వ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాల‌పై దేశ‌వ్యాప్తంగా గ‌ళం విప్పిన జెన్ జీ దెబ్బ‌ కేంద్రంలోని బీజేపీ (BJP) స‌ర్కార్‌పై గ‌ట్టిగానే ప‌డింది. ఈ నిర‌స‌నల‌ త‌ర్వాత ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో క‌మ‌లం పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. మూడు రాష్ట్రాల ఉప ఎన్నిక‌ల్లో మిశ్ర‌మ ఫ‌లితాలు వ‌చ్చాయి. క‌మ‌లం పార్టీ కేవ‌లం ఒక్క‌చోట మాత్ర‌మే గెలుపొంద‌డం గ‌మ‌నార్హం. మూడు స్థానాలకు జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం గుజరాత్‌లోని ఒకే ఒక్క స్థానాన్ని దక్కించుకోగ‌లిగింది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న‌ బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఘోర‌ పరాజయాన్ని చవిచూడాల్సి వ‌చ్చింది.

బీహార్‌లో బీజేపీ కంచుకోట బ‌ద్ద‌లు కొట్టిన పీకే

బీజేపీ కూట‌మి అధికారంలో ఉన్న బీహార్ రాష్ట్రంలో క‌మ‌లం పార్టీ కంచుకోట‌ను ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌, జ‌న‌సురాజ్ పార్టీ అధినేత ప్ర‌శాంత్ కిషోర్ బ‌ద్ద‌లు కొట్టారు. 30 ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ (Bankipur) నియోజకవర్గంలో ప్ర‌శాంత్ కిషోర్ ఘ‌న విజ‌యం సాధించారు. ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి నీర‌జ్ కుమార్‌పై పీకే ఏకంగా 20 వేల పైచిలుకు ఓట్ల‌తో విజ‌యం సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసే స‌రికి ప్రశాంత్ కిషోర్‌కు 63203 ఓట్లు రాగా, నీర‌జ్ కుమార్‌కు 44,250 ఓట్లు వ‌చ్చాయి.

బంకీపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌పున గెలుపొందిన నితిన్ న‌బీన్ ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా నియ‌మితులైన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న‌ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ్య‌స‌భ‌కు వెళ్లారు. ఆయ‌న రాజీనామాతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్‌ నబీన్ ఈ స్థానం నుంచి గెలుపొందుతూ వ‌స్తున్నారు. బీజేపీకి అంత‌ పట్టున్న బంకీపూర్ నియోజక వర్గంలో ఆ పార్టీని ప్రశాంత్‌ కిశోర్‌ ఓడించ‌డం విశేషం.

ఇక గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తొలిసారిగా పోటీ చేసిన జన్ సురాజ్ (Jan Suraaj) ఘోర ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో పీకే పోటీకి దిగ‌లేదు. 243 అసెంబ్లీ స్థానాల‌కు గానూ 238 స్థానాల్లో ఆ పార్టీ త‌న అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింది. అయితే, ఒక్క సీటులోనూ గెల‌వ‌లేక‌పోయింది. దీంతో అప్పట్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పీకే మౌనవ్రతం కూడా చేశారు. ఇప్పుడు బీజేపీ కంచుకోట‌పై క‌న్నేసిన పీకే అక్క‌డ‌ విజ‌య ఢంకా మోగించ‌డం విశేషం.

గుజ‌రాత్‌లో గెలిచినా.. త‌గ్గిన మెజారిటీ

ప్ర‌ధాన మంత్రి మోదీ సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్‌లో బీజేపీ విజ‌యం సాధించింది. మంజల్‌పూర్ (Manjalpur) నియోజకవర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్యర్థి సతీష్ పటేల్ త‌న స‌మీప కాంగ్రెస్ అభ్య‌ర్థి భిఖాభాయ్ రబారీపై సుమారు 30,567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నిక‌ల్లో స‌తీష్ ప‌టేల్‌కు 55481 ఓట్లు పోల‌వ‌గా.. భిఖాభియాకి 24851 ఓట్లు పోల‌య్యాయి. సీనియర్ బీజేపీ నేత యోగేశ్ పటేల్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇది కూడా బీజేపీకి కంచుకోటే. అయితే, 2022 ఎన్నికలతో పోలిస్తే ఈసారి మెజారిటీ గణనీయంగా తగ్గడం గమనార్హం. 2022 ఎన్నిక‌ల్లో ఈ స్థానంలో బీజేపీ అభ్య‌ర్థి ల‌క్ష ఓట్ల‌కుపైగా మెజారిటీతో గెలుపొందారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పోరాడి ఓడిన క‌మ‌లం..

అటు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ద‌తియా (Datia) నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో హ‌స్తం పార్టీ స్వ‌ల్ప మెజారిటీతో విజ‌యం సాధించింది. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై కాంగ్రెస్ అభ్య‌ర్థి కున్వర్ ఘనశ్యామ్ సింగ్ స్వ‌ల్ప మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి ఒక బ్యాంక్ స్కామ్ కేసులో అనర్హతకు గురికావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం కోసం ఇరు పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోటీ సాగింది. గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. అయితే, హోరాహోరీగా సాగిన ఈ పోరులో కాంగ్రెస్‌ తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. ఈ ఎన్నిక‌ల్లో కున్వర్ ఘనశ్యామ్ సింగ్‌కు 66,757 ఓట్లు రాగా, అశుతోష్ తివారీకి 60,741 ఓట్లు వ‌చ్చాయి. వీరిద్ద‌రి మ‌ధ్య కేవ‌లం ఆరు వేల ఓట్లు మాత్ర‌మే తేడా.

వ‌రుస‌గా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీకి ఈ ఎన్నిక‌లు గ‌ట్టి షాకిచ్చాయ‌నే చెప్పాలి. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ తన కంచుకోటలను కోల్పోవడం, ఓట్ల మెజారిటీ తగ్గడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జెన్‌జీ దెబ్బ‌తోనే బీజేపీకి ఈ గ‌తి ప‌ట్టిందంటూ ప‌లువురు నెటిజ‌న్లు, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు.

Also Read..

ప్యార‌డైజ్ కోసం కీర్తి సురేష్ రెండు రోజులు నిద్ర‌కు దూరం - మ‌హాన‌టిపై నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

వాంగ్‌చుక్ 2.0: జార్ఖండ్ స్టూడెంట్స్ కోసం దేవేంద్రనాథ్ మహతో ఆమరణ నిరాహార దీక్ష.. అసలు ఎవరీయన?

పాద‌చారుల‌కు దారివ్వండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు

Advertisement
Advertisement