త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vikram-1 | ప్ర‌ధాని రాసిన పోస్ట్‌కార్డును మోసుకెళ్ల‌నున్న విక్ర‌మ్‌-1.. ఆ లెట‌ర్‌లో ప్ర‌ధాని ఏం రాశారంటే..?

Vikram-1 | హైద‌రాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్‌కు చెందిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ -1 శ‌నివారం నింగిలోకి దూసుకెళ్ల‌నున్న‌ది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చేతితో రాసిన 'వందే మాతరం' సందేశంతో ఉన్న పోస్టుకార్డును రాకెట్‌తో అంతరిక్షంలోకి పంపనున్నట్లు స్కైరూట్ శుక్ర‌వారం వెల్ల‌డించింది.

P

National | Published On Jul 17, 2026, 5.48 pm IST

Vikram-1 | ప్ర‌ధాని రాసిన పోస్ట్‌కార్డును మోసుకెళ్ల‌నున్న విక్ర‌మ్‌-1.. ఆ లెట‌ర్‌లో ప్ర‌ధాని ఏం రాశారంటే..?
Advertisement

Vikram-1 | హైద‌రాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్‌కు చెందిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ -1 శ‌నివారం నింగిలోకి దూసుకెళ్ల‌నున్న‌ది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చేతితో రాసిన 'వందే మాతరం' సందేశంతో ఉన్న పోస్టుకార్డును రాకెట్‌తో అంతరిక్షంలోకి పంపనున్నట్లు స్కైరూట్ శుక్ర‌వారం వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టింది. విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1లో ఈ ప్రత్యేక పోస్టుకార్డుతో పాటు సంస్థ బృందం, పెట్టుబడిదారులు, పాల‌సీ రూపకర్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు చేతితో రాసిన సందేశాలను కూడా ప్రత్యేక పేలోడ్‌గా తీసుకెళ్ల‌నున్న‌ట్లు పేర్కొంది. "విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1లో తీసుకెళ్తున్న పేలోడ్‌ల‌లో ప్రధాని మోదీ స్వయంగా 'వందే మాతరం' అని రాసిన చేతిరాత పోస్టుకార్డు అత్యంత ప్రత్యేకమైనది" అని పేర్కొంది. ఈ జ్ఞాపికలన్నీ 'మిషన్ ఆగమన్'లో భాగమని, కోట్లాది మంది ఆకాంక్షలు, అభినందనలకు ప్రతీకగా వీటిని అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నామని వివరించింది.

భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి లభిస్తున్న మద్దతుకు ఈ చేతిరాత సందేశాలు ప్రతీకలని స్కైరూట్ తెలిపింది. జ్ఞాపికలతో పాటు కోస్మోసర్వ్, డీ-క్యూబ్డ్, స్కైరూట్ అభివృద్ధి చేసిన సాంకేతిక ప్రదర్శన పేలోడ్‌లను కూడా విక్రమ్-1 మోసుకెళ్లనుంది. అలాగే 'కాస్మిక్ బ్లూమ్' పేరుతో కోస్మోస్ డైమండ్స్ రూపొందించిన మైక్రో ఆర్ట్ పేలోడ్‌ను కూడా ఈ ప్రయోగంలో నింగిలోకి పంపనున్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అయిన విక్రమ్-1, భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి చారిత్రక మైలురాయిగా నిలవనుంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ రాకెట్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటడమే కాకుండా.. భారత వాణిజ్య అంతరిక్ష రంగానికి మరింత ఊతమివ్వడం ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యంగా సంస్థ పేర్కొంది. ఈ నెల 18న (శ‌నివారం) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీశ్ ధావ‌న్ స్పేస్ సెంటర్ తొలి ప్రయోగ వేదిక నుంచి విక్రమ్-1 తొలి పరీక్షా ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు స్కైరూట్ ఇప్పటికే ప్రకటించింది. భారత్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ రాకెట్ తొలి ప్రయోగం ఇదే కావడం విశేషం. ప్రయోగానికి అవసరమైన గగనతల, ఓషియ‌న్ అనుమతులు ఇప్పటికే లభించాయని సంస్థ వెల్లడించింది. రాకెట్ ప్రయాణ మార్గం, ప్రభావిత ప్రాంతాలను పరిమిత మండలాలుగా ప్రకటిస్తూ సంబంధిత అధికారులు అవసరమైన నోటిఫికేషన్లు కూడా జారీ చేసినట్లు తెలిపింది.

Advertisement
Advertisement