త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Vivek | 15 ఏండ్ల తర్వాత ఈఎస్ఐలో భారీ నియామకాలు

Minister Vivek | తెలంగాణ ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) శాఖలో దాదాపు 15 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో ప్రత్యక్ష నియామకాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా ఎంపికైన 247 మంది స్టాఫ్ నర్సులకు శుక్రవారం కొమురం భీం ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ జీ వివేక్ వెంకటస్వామి నియామక పత్రాలు అందజేశారు.

P

Telangana | Published On Jul 17, 2026, 4.29 pm IST

Minister Vivek | 15 ఏండ్ల తర్వాత ఈఎస్ఐలో భారీ నియామకాలు
Advertisement
  • 247 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అంద‌జేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి, మంత్రి వివేక్‌
  • త్వ‌ర‌లో వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు సహా మరో 300కుపైగా పోస్టుల భర్తీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డి

Minister Vivek | తెలంగాణ ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) శాఖలో దాదాపు 15 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో ప్రత్యక్ష నియామకాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా ఎంపికైన 247 మంది స్టాఫ్ నర్సులకు శుక్రవారం కొమురం భీం ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ జీ వివేక్ వెంకటస్వామి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ 2011 తర్వాత ఈఎస్ఐ శాఖలో ఇదే తొలి భారీ ప్రత్యక్ష నియామక ప్రక్రియ అని తెలిపారు. రాష్ట్రంలోని కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సిబ్బంది కొరతను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది బీమా పొందిన కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు కలిపి దాదాపు 75 లక్షల మంది ఈఎస్ఐ సేవలు పొందుతున్నారని చెప్పారు.

త్వరలో మరో 300కుపైగా పోస్టుల భర్తీ

ఈఎస్ఐలో మొత్తం 599 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామని మంత్రి వెల్లడించారు. అందులో భాగంగానే 247 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశామని చెప్పారు. త్వరలోనే 120 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఆరుగురు డెంటల్ సర్జన్లు, 99 మంది ఫార్మసిస్టులు, 34 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 54 మంది ఏఎన్‌ఎంలతో పాటు ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకాలు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో ఈఎస్ఐ ఆస్పత్రులపై సమగ్ర సమీక్ష నిర్వహించామని తెలిపారు. సుమారు రూ.72 కోట్ల బకాయిలు విడుదల చేసి మందుల కొరతను నివారించడంతో పాటు నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ అంశంపై ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కూడా చర్చించినట్లు వెల్లడించారు.

రామచంద్రాపురం, నాచారం ఆస్పత్రుల్లో ప్రత్యేక సేవలు

సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్, కార్డియాక్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కూడా డయాలసిస్ సేవలను బలోపేతం చేసి కార్డియాక్ సేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీంతో కార్మికులకు తమ ప్రాంతాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రామగుండం, శంషాబాద్, మహబూబ్‌నగర్, కొత్తగూడెం ప్రాంతాల్లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. వచ్చే 12 నుంచి 18 నెలల్లో రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులను దశలవారీగా ఆధునికీకరిస్తామని చెప్పారు. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలిపారు. రాష్ట్రంలో నర్సింగ్ విద్యను మరింత బలోపేతం చేయడమే దీని ఉద్దేశమన్నారు. కొత్తగా నియామకమైన నర్సులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఉద్యోగాన్ని కేవలం ఉపాధిగా కాకుండా సేవా ధర్మంగా భావించి పనిచేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ సిబ్బందికి మంచి డిమాండ్ ఉందని, ముఖ్యంగా జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. టామ్‌కామ్ ద్వారా విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం : భట్టి విక్రమార్క

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 15 ఏళ్ల తర్వాత ఒకేసారి 247 మంది స్టాఫ్ నర్సులను నియమించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. గత పదేళ్లలో ఈఎస్ఐ ద్వారా కార్మికులకు అందాల్సిన సేవలు అందలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ఈఎస్ఐ ఆస్పత్రుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఈఎస్ఐ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత, మౌలిక వసతుల లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారన్నారు. వాటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దశలవారీగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించిందని తెలిపారు. త్వరలోనే వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంల నియామకాలు కూడా పూర్తి చేసి ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గంగాధర్, ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ క్రాంతి సాగర్‌తో పాటు ఈఎస్ఐ, కార్మిక శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement