త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AAP Allegations | పేదల బియ్యాన్ని ప్రైవేట్‌ సంస్థకు అమ్మేందుకు కుట్ర!

AAP Allegations | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రభుత్వంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాష్ట్ర అధ్యక్షుడు సౌరభ్‌ భరద్వాజ్‌ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని ప్రైవేట్‌ సంస్థకు విక్రయించేలా ఈ ఏడాది ఆరంభంలోనే భారీ పథకాన్ని రూపొందించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల కమీషన్‌ దందాకు ప్రణాళిక వేశారని ఆయన పేర్కొన్నారు.

P

National | Published On Aug 9, 2026, 5.27 pm IST

AAP Allegations | పేదల బియ్యాన్ని ప్రైవేట్‌ సంస్థకు అమ్మేందుకు కుట్ర!
Advertisement
  • ఢిల్లీ ప్రభుత్వంపై సౌరభ్‌ భరద్వాజ్‌ సంచలన ఆరోపణలు..
  • రూ.11 వేల కోట్ల కమీషన్‌ అంటూ వ్యాఖ్యలు
  • ఖండించిన బీజేపీ మంత్రి సిర్సా

AAP Allegations | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రభుత్వంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాష్ట్ర అధ్యక్షుడు సౌరభ్‌ భరద్వాజ్‌ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని ప్రైవేట్‌ సంస్థకు విక్రయించేలా ఈ ఏడాది ఆరంభంలోనే భారీ పథకాన్ని రూపొందించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల కమీషన్‌ దందాకు ప్రణాళిక వేశారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని పేదల కోసం ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యంలో ప్రతి వారం 31వేల మెట్రిక్‌ టన్నులను బయటకు తీసి, వరుసగా మూడేళ్లపాటు ప్రైవేట్‌ సంస్థకు విక్రయించేలా ప్రణాళిక రూపొందించార‌ని ఆరోపించారు. హరియాణాలోని ఓ ప్రైవేట్‌ కంపెనీకి మార్కెట్‌ ధర కంటే రెట్టింపు ధరకు బియ్యాన్ని విక్రయించేలా ఏర్పాట్లు చేశార‌న్నారు.

కిలో బియ్యంపై రూ.23 చొప్పున కమీషన్‌ వసూలు చేయాలని నిర్ణయించినట్లు భరద్వాజ్‌ తెలిపారు. ఈ లెక్కన వారానికి రూ.70 కోట్ల నుంచి రూ.71 కోట్ల వరకు కమీషన్‌ వచ్చేలా పథకం రూపొందించారని ఆరోపించారు. ఇదే విధంగా మూడేళ్లపాటు బియ్యం విక్రయాలు కొనసాగితే సుమారు రూ.22వేల కోట్ల విలువైన బియ్యం విక్రయమయ్యేదని, అందులో దాదాపు రూ.11వేల కోట్ల కమీషన్ దక్కేదని పేర్కొన్నారు. ‘‘రేఖా గుప్తా ప్రభుత్వం ఊహించలేనంత స్థాయిలో అవినీతికి పాల్పడుతోంది. మేము మాట్లాడుతున్న ఈ అవినీతి వ్యవహారానికి ఈ ఏడాది ఆరంభంలోనే ప్రణాళిక వేశారు’’ అని సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు.

ఖండించిన మంత్రి మంజీంద‌ర్ సింగ్‌

బియ్యం వ్య‌వ‌హారంపై ఆప్ చేసిన ఆరోప‌ణ‌లు ఢిల్లీలో రాజకీయ దుమారం రేపాయి. బీజేపీ నేతృత్వంలోని రేఖా గుప్తా ప్రభుత్వంలో రూ.22 వేల కోట్ల కుంభకోణానికి ప్రణాళిక జరిగిందంటూ ఆప్‌ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్‌ భరద్వాజ్‌ చేసిన ఆరోపణలను మంత్రి మంజీందర్‌ సింగ్‌ సిర్సా తీవ్రంగా ఖండించారు. ఆరోపణలను 24 గంటల్లో వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సౌరభ్‌ భరద్వాజ్‌, ఆప్‌ ఎమ్మెల్యే సంజీవ్‌ ఝాపై తగిన న్యాయ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలు ‘‘నిరాధారమైనవి, తప్పుడు, కల్పితమైనవి, దురుద్దేశపూరితమైనవి’’ అని పేర్కొన్నారు. తన పరువు, ప్రతిష్ట‌ను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఆరోపణలు చేయడం సౌరభ్‌ భరద్వాజ్‌, సంజీవ్‌ ఝాలకు ఒక అలవాటుగా మారిందని, ఇదే వారి రాజకీయ విధానంగా కనిపిస్తోందని సిర్సా మండిపడ్డారు. 24 గంటల్లో ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement