త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Somnath Swabhiman Parv | సోమనాథ్ సాక్షిగా ప్రధాని మోదీ గర్జన: ‘వలసవాద మనస్తత్వంతో మన చరిత్రను వక్రీకరించారు’

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొందరు చరిత్రకారులు, రాజకీయ నాయకులు భారతదేశ ఘనమైన గతాన్ని తుడిచిపెట్టేందుకు ప్రయత్నించారని, విదేశీ దురాక్రమణదారుల అరాచకాలను 'దోపిడీ'గా అభివర్ణించి వారిని వెనకేసుకొచ్చారని ప్రధాని మోదీ విమర్శించారు.

J

National | Published On Jan 11, 2026, 3.56 pm IST

Somnath Swabhiman Parv | సోమనాథ్ సాక్షిగా ప్రధాని మోదీ గర్జన: ‘వలసవాద మనస్తత్వంతో మన చరిత్రను వక్రీకరించారు’

సంక్షిప్త సారాంశం

సోమనాథ్ ఆలయ ప్రాంగణంలో జరిగిన 'శౌర్య యాత్ర'లో పాల్గొన్న ప్రధాని మోదీ, భారత చరిత్రలోని వక్రీకరణలపై ఘాటుగా స్పందించారు. స్వాతంత్య్రానంతరం వలసవాద మనస్తత్వం ఉన్నవారు సోమనాథ్ వంటి పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యతను తగ్గించేందుకు ప్రయత్నించారని, విదేశీ దాడులను సాధారణ దోపిడీలుగా చిత్రీకరించారని విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే కుట్రలను తిప్పికొట్టాలని, ఐక్యంగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

Somnath Swabhiman Parv | భారతదేశ చరిత్రను వక్రీకరించేందుకు, దేశ ఘనమైన గతాన్ని చెరిపేసేందుకు స్వాతంత్య్రానంతరం 'వలసవాద మనస్తత్వం' కలిగిన వ్యక్తులు తీవ్ర ప్రయత్నాలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. సోమనాథ్ ఆలయంపై మహ్మద్ గజినీ దాడి చేసి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' ముగింపు వేడుకల్లో భాగంగా జరిగిన 'శౌర్య యాత్ర'లో ఆయన పాల్గొన్నారు.

చరిత్ర వక్రీకరణపై ఆగ్రహం

ఈసందర్భంగా అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ మాట్లాడారు. "దురదృష్టవశాత్తూ, స్వాతంత్య్రం వచ్చాక కూడా వలసవాద మనస్తత్వం ఉన్నవారు మన పూర్వీకుల త్యాగాలను, ఆలయాల గొప్పనాన్ని విస్మరించారు. సోమనాథ్ ఆలయంపై జరిగిన మతపరమైన దాడులను కేవలం 'సంపద కోసం చేసిన దోపిడీ'గా పాఠ్యపుస్తకాల్లో చిత్రించారు. ఆ దాడుల వెనుక ఉన్న ద్వేషం, క్రూరత్వం, ఉగ్రవాదాన్ని దాచిపెట్టి, దురాక్రమణదారుల చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు" అని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్‌లను అడ్డుకున్నారు

నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పించినప్పుడు ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని మోదీ గుర్తు చేశారు. 1951లో అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. "అనాడు ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు నేటికీ చురుగ్గా ఉన్నాయి. అప్పట్లో వారు కత్తులతో దాడి చేస్తే, ఇప్పుడు కుట్రలతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారు" అని ప్రధాని హెచ్చరించారు.

శౌర్య యాత్ర - మన ఆత్మగౌరవ ప్రతీక

1026లో మహ్మద్ గజినీ సోమనాథ్‌పై చేసిన దాడికి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ 'శౌర్య యాత్ర'ను నిర్వహించారు. గుజరాత్ పోలీసుల అశ్వక దళంతో కూడినప్రదర్శన సోమనాథ్ ఆలయ పటిష్టతను, దేశ ప్రజల అచంచల విశ్వాసాన్ని చాటిచెప్పింది. 1947లో సర్దార్ పటేల్ తీసుకున్న నిర్ణయం ఫలితంగా 1951లో ఈ ఆలయం పునఃప్రతిష్టితమైంది. ఇప్పుడు 75 ఏళ్ల తర్వాతచరిత్రాత్మక ఘట్టాన్ని దేశం సగర్వంగా స్మరించుకుంటోంది.

"మనం ఐక్యంగా ఉండాలి. మనల్ని విడదీయాలని చూసే శక్తులను ఓడించాలి. గడిచిన 1000 ఏళ్ల ప్రయాణం రాబోయే 1000 ఏళ్ల భవిష్యత్తుకు మనకు స్ఫూర్తినివ్వాలి" అని ప్రధాని పిలుపునిచ్చారు.


Advertisement

తాజావార్తలు

Advertisement