త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఒట్టు అనేదానికి పాణముంటే నీ అబ‌ద్దాలు విన‌లేక చ‌చ్చేది

Harish Rao | ఒట్టేసి చెప్తున్నా మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతా అని సీఎం అంటున్నాడ‌ని.. ఆ ఒట్టు అనేదానికి ప్రాణం ఉంటే ఈ రేవంత్‌రెడ్డి అబ‌ద్దాలు విన‌లేక ఉరేసుకొని ఎప్పుడో ఆత్మ‌హ‌త్య చేసుకునేద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రైతుల‌కు బాకీప‌డిన రూ.30 వేల కోట్ల రైతుబంధు డ‌బ్బులు ఎప్పుడిస్త‌వో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Jun 30, 2026, 5.35 pm IST

Harish Rao | ఒట్టు అనేదానికి పాణముంటే నీ అబ‌ద్దాలు విన‌లేక చ‌చ్చేది
Advertisement
  • క‌న‌బ‌డ్డ దేవుని మీద‌ళ్లా ఒట్టేసి రుణ‌మాఫీ ఎగ్గొట్టిన‌వ్‌
  • తెలంగాణ కోసం రాజీనామా చెయ్య‌మంటే జిరాక్స్ కాయితం ఇచ్చిన‌వ్‌
  • స‌రేగ‌ని.. రూ.30 వేల కోట్ల రైతు బంధు ఎప్పిడిస్త‌వో చెప్పు
  • జిల్లా మంత్రి జూపల్లి మ‌తి ఉండే మాట్లాడ‌త‌డో ఏమో తెల్వ‌దు
  • ప్ర‌తి ప‌ల్లెల స్కీంలు, స్కాంల మీద చర్చ పెట్టాలే
  • జ‌డ్చ‌ర్ల స‌భ‌లో రేవంత్‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జం

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ఒట్టేసి చెప్తున్నా మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతా అని సీఎం అంటున్నాడ‌ని.. ఆ ఒట్టు అనేదానికి ప్రాణం ఉంటే ఈ రేవంత్‌రెడ్డి అబ‌ద్దాలు విన‌లేక ఉరేసుకొని ఎప్పుడో ఆత్మ‌హ‌త్య చేసుకునేద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కనబడ్డ దేవుని మీదళ్లా ఒట్టు పెట్టి రుణమాఫీ చెయ్యకుండా దేవుళ్ల‌నే మోసం చేసిన ఘనుడు రేవంత్ అని అన్నారు. రైతుల‌కు బాకీప‌డిన రూ.30 వేల కోట్ల రైతుబంధు డ‌బ్బులు ఎప్పుడిస్త‌వో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చెయ్యమంటే జిరాక్స్ కాయితం ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని విమ‌ర్శించారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జడ్చర్ల‌లోని వాసవి ఫంక్షన్ హాల్‌లో మంగ‌ళ‌వారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, SIR అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

తెలంగాణ కోసం రాజీనామా చెయ్యమంటే జిరాక్స్ కాయితం ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది. 2009లో కూటమిలో భాగంగా లక్ష్మారెడ్డికి టికెట్ రాకపోయినా పార్టీ కోసం నిబద్దతతో పని చేసి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించడానికి కృషి చేసిన నిజాయితీ గల నాయకుడు. రేవంత్ రెడ్డి ఉద్యమం గురించి, త్యాగాల గురించి మాట్లాడుతుంటే నవ్వి పోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టు ఉంది ఆయన తీరు. పాలమూరు ప్రజల జోష్ చూస్తుంటే బీఆర్ఎస్ మళ్ళీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఉంది అని ఆయ‌న పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో రైతు ఆశీర్వాద సభ అని పెట్టిండు. అది రైతు ఆశీర్వాద సభ కాదు రైతుల వంచన సభ. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి రైతును వంచించుతూనే ఉన్నాడు. యాసంగి రైతు బంధు ఎగొట్టి ఇప్పుడు వానాకాలం రైతు బంధు వేస్తానని మోసం చేస్తున్నాడు. రైతు రుణమాఫీ అన్నారు.. రెండు లక్షలు కాదు కదా లక్ష లోపు ఉన్నవాళ్లకు కూడా చెయ్యలేదు అని విమ‌ర్శించారు.

పాల‌మూరు బిడ్డ‌లు పాల‌లాంటి మ‌న‌సున్నోళ్లు..

పాలమూరు బిడ్డలు స్వచ్ఛమైన పాలలాంటి మనుసున్న బిడ్డలు. రేవంత్ రెడ్డి జూట మాటలు, బట్టెబాజ్ మాటలతో పాలమూరు పరువు తీస్తున్నాడు. ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పిన మనిషి రేవంత్ రెడ్డి. హామీ ఇవ్వక పోయినా ప్రజలకు కావాల్సింది అర్థం చేసుకొని రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్. రైతు బంధు పేరిట 29 వేల 300 కోట్ల రూపాయలు రైతులకు బాకీపడ్డాడు. మీ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మతి ఉండి మాట్లాడుతాడో మతి లేక మాట్లాడతాడో అర్థం కాదు. ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే అన్నారు. ఇప్పుడు కేవలం 7 రకాల వడ్లకే అంటున్నారు. జూపల్లి.. మీరు ఇచ్చిన బోనస్ 3 వేల కోట్లు, మీరు ఎగొట్టిన రైతు బంధు 30 వేల కోట్లు అని హ‌రీశ్‌రావు ఆరోపించారు.

తోలుబొమ్మ అయ్యిండు త‌ప్పా ఎవ‌రి తోలు తీయ‌లే..

కేసీఆర్ హయాంలో యూరియా కోసం గోదాములు కట్టించి నిల్వ ఉంచాడు. కానీ రేవంత్ రెడ్డి యాప్‌లు అంటూ నాటకాలు చేస్తున్నాడు. అసెంబ్లీలో తరుగు పెడితే తోలు తీస్తా అన్నాడు. కానీ తెలంగాణలో ఏ ఊరులో అయినా తరుగు లేకుండా ఒక్క బస్తా కొన్నారా..? రేవంత్ రెడ్డి ఎంత మంది తోళ్ళు తీసాడు. దళారుల చేతిలో, రైస్ మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ అయ్యాడు తప్ప ఎవ్వరి తోలు తియ్యలేదు అని ఎద్దేవా చేశారు.

పొద్దున 9 నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు క‌రెంట్ వ‌స్త‌దిగ‌..

కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి వచ్చాక 6 గంటలకు వచ్చింది. రైతుల కరెంటులో కోత పెట్టడానికే రైతు డిస్కం. సోలార్ పవర్ మాత్రమే రైతు డిస్కంలకు కేటాయిస్తారంట. ఒకవేళ అదే జరిగితే పొద్దున్న 9 నుండి సాయంత్రం 4 వరకే కరెంట్ వస్తది. రైతు డిస్కమ్ అనేది రైతు 24 గంటల కరెంటుకి ఉరితాడు అయిత‌ది అని హ‌రీశ్ రావు అన్నారు.

కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా రైతు కుటుంబాలకు ఒక ధీమా లెక్క ఉండే. కానీ కేసీఆర్ పోయాక ఒక 6నెలల నుండి రైతు బీమా బంద్ అయ్యింది. LICకి బీమా డబ్బులను రేవంత్ రెడ్డి కట్టలేదు. 7 వేల 600 రైతు కుటుంబాలు రైతు బీమా కోసం ఎదురుచూస్తున్నాయి. కరోనా వచ్చినా, కరువు వచ్చినా కేసీఆర్ హయాంలో రైతు బంధు ఆగలేదు. 11 విడతల్లో 73 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చాక వచ్చిన 5 విడతల్లో 3 విడతలు ఎగొట్టాడు. మూడు పంటలకు 3సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు.. ఇప్పటికే మూడు రైతు బంధులు ఎగ్గొట్టిండు అని మాజీ మంత్రి ఫైర‌య్యారు.

కేంద్రానికి స‌రెండ‌ర్ అయ్యారా?

బీఆర్ఎస్ హయాంలో 2021-2022లో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. దానితో పోల్చుతే మీరుకొన్నది ఎంత. మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పటిలోగా పూర్తి చేస్తావో చెప్పాలని రైతుల పక్షాన అడుగుతున్నాం. కేంద్రం కొన‌మన్న పంటే కొంటాం, కేంద్రం కొన‌మన్నంతనే కొంటాం అని అంటున్న రేవంత్ రెడ్డి ఉన్నది ఎందుకు? కేంద్రానికి సరెండర్ అయ్యారా? కేంద్రం టార్గెట్ 50 లక్షల మెట్రిక్ టన్నులు. అంతే కొంటే మిగతా రైతుల పరిస్థితి ఏంటి? వడ్లు కొనే చేతకాని ప్రభుత్వాన్ని రైతులు నమ్ముతారా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ ప్ర‌శ్నించారు.

పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్ గారిది. కల్వకుర్తిలో 3 లక్షల 30 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం. నెట్టెంపాడుకు లక్ష 60 వేల ఎకరాలకు, భీమాలో లక్ష 70 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం. చెరువులు, కాల్వలు పూర్తి చేసి వలసలను వాపస్ తెచ్చాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవవుతుంది ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చావా? తుంగభద్ర నది మీద శ్రీశైలంకు నీళ్లు రాకుండా 65 టీఎంసీలతో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు డ్యాములు కడుతుంటే మన పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంటి? న‌దుల అనుసంధానం, ఆల్మట్టి ఎత్తు, అక్రమ ప్రాజెక్టులు తుంగభద్ర, కృష్ణపై కడుతున్న ప్రాజెక్ట్‌ల‌పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా నోరు మూసుకున్నడు అని హ‌రీశ్ ఆరోపించారు.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇస్త‌లేడు..

కేసీఆర్ మాట ఇచ్చాడు. తండాలను గ్రామ పంచాయితీలను చేస్తా అని చేసి చూపించాడు. హైకోర్ట్ మొట్టికాయలు వేసినా పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు ఇవ్వడం లేదు. ఫీజు కట్టక పిల్లల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వాళ్ళ చదువులు ఆగిపోతున్నాయి. రేవంత్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం, బీసీలకు అన్యాయం, వృద్ధులకు మోసం, రైతులకు ఢోకా.. ఇలా రేవంత్ రెడ్డి మోసం చేయని ఒక్క వర్గం లేదు.

సిగాచి బాధితుల‌కు కోటి రూపాయ‌లు ఏమైన‌య్‌?

అందాల పోటీలకు వంద కోట్లు ఉంటాయి. ఫ్యూచర్ సిటీకి, నీ మనుమడి ఫుట్‌బాల్ ఆటకు, మూసీకి వందల కోట్లు ఉంటాయి. పిల్లల చదువులకు ఉండవా రేవంత్ రెడ్డి?. డబ్బులు లేక కాదు ఇవ్వాలనే మనుసు నీకు లేదు. సంగారెడ్డి పాశమైలారం సిగాచి ఘటనలో 54 మంది చనిపోతే మనిషికి కోటి రూపాయలు ఇప్పిస్తాన‌ని ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. రూ. 200 ఉన్న పింఛన్ రూ.2000 చేసిన కేసీఆర్. రూ.4000 ఇస్తానన్న రేవంత్ రెడ్డి రూపాయి పెంచలేదు. ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు.

ప్రతి కార్యకార్త ఒక సైనికుని లెక్క పోరాడాలే. ప్రతి గ్రామంలో రేవంత్ చేస్తున్న స్కాంల మీద, తప్పిన మాట మీద చర్చ పెట్టాలి. కొడంగల్‌లో నరేందర్ రెడ్డి చిత్తూ చిత్తుగా ఓడిస్తే పోయి మల్కాజ్ గిరిలో 5000 ఓట్లతో గెలిచావ్. మ‌ళ్లా నిన్ను ఇక్కడ ఓడించడం ఖాయం. పాలమూరులో 14కు 14 సీట్లను గెలిచి తీరుతాం. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం అని హ‌రీశ్‌రావు ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement