త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ebola | ఆ మ‌హిళ‌కు ఎబోలా లేదు : క‌ర్ణాట‌క ఆరోగ్య మంత్రి

Ebola | ఉగాండ (Uganda) నుంచి క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరు (Bengaluru)కు వ‌చ్చిన ఉగాండ మ‌హిళ‌కు ప్రాణాంత‌క ఎబోలా వైర‌స్ లేద‌ని క‌ర్ణాట‌క ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు అధికారికంగా ప్ర‌క‌టించారు. ప‌రీక్ష‌ల్లో ఆమెకు వైర‌స్‌ నెగెటివ్ వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

D

National | Published On May 27, 2026, 4.31 pm IST

Ebola | ఆ మ‌హిళ‌కు ఎబోలా లేదు : క‌ర్ణాట‌క ఆరోగ్య మంత్రి
Advertisement

Ebola | క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులో (Bengaluru) ప్రాణాంత‌క‌ ఎబోలా (Ebola) కలకలం రేపిన విష‌యం తెలిసిందే. ఉగాండ (Uganda) నుంచి వ‌చ్చిన మ‌హిళ‌కు వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అయితే, ఆమెకు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ అని వ‌చ్చింది. ఈ విష‌యాన్ని క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు (Dinesh Gundu Rao) అధికారికంగా ధృవీక‌రించారు. ప్ర‌జ‌లు ఎలాంటి ఆందోళ‌నా చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటోంద‌న్నారు. వైర‌స్ వ్యాప్తి విష‌యంలో ప్ర‌భుత్వం, వైద్య శాఖ జారీ చేసిన ఆదేశాల‌ను మాత్ర‌మే న‌మ్మాల‌ని ప్ర‌జ‌ల‌కు మంత్రి సూచించారు.

ఆఫ్రికాలోని కాంగో (Congo), ఉగాండా (Uganda) స‌హా ప‌లు దేశాల్లో ప్రాణాంత‌క వైర‌స్ ఎబోలా (Ebola) విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వైర‌స్ వ్యాప్తి దృష్ట్యా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో అన్ని దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఆఫ్రికా దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల విష‌యంలో క‌ఠిన చర్య‌లు అమ‌లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మ‌న దేశంలో అన్ని విమానాశ్ర‌యాల్లో ప్ర‌యాణికుల‌కు స్క్రీనింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈనెల 23న 28 ఏండ్ల‌ మహిళ ఉగాండ నుంచి బెంగ‌ళూరు చేరుకుంది. వైర‌స్ వ్యాప్తి ప్రాంతం నుంచి రావ‌డంతో ఆమెకు ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ నిర్వ‌హించ‌గా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

దీంతో ముందు జాగ్ర‌త్త‌గా అధికారులు స‌ద‌రు మ‌హిళ‌ను చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించి ఐసోలేష‌న్‌లో ఉంచారు. ఆమెనుంచి సేక‌రించిన న‌మూనాల‌ను పుణెలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి (NIV) పంపించారు. ఈ టెస్ట్ ఫ‌లితాల్లో ఆమెకు నెగెటివ్ అని వ‌చ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నెగెటివ్ అని తేలినా ప్రొటోకాల్ ప్ర‌కారం మ‌రో 48 గంట‌ల త‌ర్వాత మ‌రోసారి ఆమె న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల‌కు పంప‌నున్నారు. అప్పుడు కూడా నెగెటివ్‌గా తేలితేనే ఆమెను హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. అప్ప‌టి వ‌ర‌కూ ఆమెను వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఐసోలేష‌న్‌లోనే ఉంచుతారు.

Advertisement
Advertisement