త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MK Stalin | విజ‌య్ ప్ర‌భుత్వం ఎప్పుడైనా కూలిపోవ‌చ్చు.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణుల‌కు స్టాలిన్ పిలుపు

MK Stalin | న‌టుడు విజ‌య్ నేతృత్వంలోని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఎప్పుడైనా కూలిపోవ‌చ్చ‌ని డీఎంకే అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాలంటూ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

D

National | Published On May 19, 2026, 1.05 pm IST

MK Stalin | విజ‌య్ ప్ర‌భుత్వం ఎప్పుడైనా కూలిపోవ‌చ్చు.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణుల‌కు స్టాలిన్ పిలుపు
Advertisement

MK Stalin | త‌మిళ‌నాడులో (Tamil Nadu) కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరి 10 రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే డీఎంకే అధినేత‌, ఎంకే స్టాలిన్ (MK Stalin) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య్ నేతృత్వంలోని టీవీకే ప్ర‌భుత్వం (Vijay Government) ఎప్పుడైనా కూలిపోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంద‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

కాగా, ఇటీవ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాల్లో గెలుపొందిన విష‌యం తెలిసిందే. విజ‌య్ రెండు చోట్ల గెల‌వ‌డంతో ఓ స్థానానికి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం సొంతంగా 107 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. దానికి తోడు మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా డీఎంకే మిత్ర‌ప‌క్షాలైన సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు ప్ర‌భుత్వానిక బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తిచ్చాయి. వీరి మ‌ద్ద‌తుతో విజ‌య్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. వీరికి తోడు గ‌త‌వారం జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో సుమారు 25 మంది అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) తిరుగుబాటు ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడా తోడైంది.

అయితే, ప్ర‌భుత్వానికి బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తిస్తున్న డీఎంకే మిత్ర‌ప‌క్షాలు త‌మ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్నా.. లేదంటే ఏఐఏడీఎంకేకి చెందిన‌ తిరుగుబాటు ఎమ్మెల్యేల‌ను త‌మిళ‌నాడు స్పీక‌ర్ లేదా కోర్టులు అన‌ర్హులుగా ప్ర‌క‌టించినా రాష్ట్రంలో రాజ‌కీయ అనిశ్చితి ఏర్ప‌డొచ్చ‌ని డీఎంకే వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ ప‌రిణాల నేప‌థ్యంలో డీఎంకే అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఓట‌మి తాత్కాలిక‌మే..

"ఈ ఓట‌మి తాత్కాలిక‌మే. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఎప్పుడైనా కూలిపోవ‌చ్చు. రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నిక‌ల‌కు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. 2029 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటే మ‌ళ్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. తమిళనాడులో డీఎంకే సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు. గతంలోనూ మనం ఎన్నో స‌వాళ్ల‌ను అధిగ‌మించాం. ఇప్పుడు కూడా మ‌ళ్లీ పుంజుకుని విజ‌యం సాధిస్తాం" అంటూ జిల్లా కార్య‌ద‌ర్శుల స‌మావేశంలో స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇక తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యానికి పూర్తి నైతిక బాధ్యత తనదేనని స్టాలిన్ ప్రకటించారు.

సోషల్ మీడియాపై దృష్టి పెట్టాలి..

ఇదే స‌మ‌యంలో పార్టీ శ్రేణుల‌కు స్టాలిన్ కీల‌క సూచ‌న‌లు చేశారు. విజ‌య్‌కి చెందిన టీవీకే పార్టీ సోష‌ల్ మీడియాలో చాలా ముందుంద‌ని ప‌రోక్షంగా పేర్కొన్నారు. డీఎంకే కూడా సోష‌ల్ మీడియాలో త‌న ఉనికిని పెంచుకోవాల‌ని సూచించారు. "ఒకప్పుడు మనం టీ కొట్టుల్లో మాట్లాడిన రాజకీయాన్ని.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై మాట్లాడాల్సిన అవసరం వచ్చింది" అని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల్లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించాల‌ని స్టాలిన్ త‌న నేత‌ల‌కు సూచించారు. ప్రజల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ సేకరించాల‌న్నారు. ఇందుకోసం 36 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

Also Read..

రాబోయే ఐదు రోజులు గ‌రిష్ఠ స్థాయికి చేర‌నున్న‌ ఉష్ణోగ్ర‌త‌లు..

భారీ ఏఐ ఫీచ‌ర్ల‌తో వ‌స్తున్న ఐఓఎస్ 27.. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 కి యాపిల్ రెడీ..

వైట్ రైస్ కంటే 'పర్పుల్ రైస్' ఎందుకు బెస్ట్? షుగర్ ఉన్నవాళ్లు దీన్ని తినొచ్చా?

Advertisement
Advertisement