త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mayawati | రాజకీయ రగడలో అసలు సమస్య మరుగున పడొద్దు : మాయావతి

Mayawati | నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటున్న నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలతో విద్యా వ్యవస్థలో చేయాల్సిన సమగ్ర సంస్కరణల అంశం పక్కదారి పట్టకూడదని పేర్కొన్నారు.

P

National | Published On Jul 25, 2026, 5.23 pm IST

Mayawati | రాజకీయ రగడలో అసలు సమస్య మరుగున పడొద్దు : మాయావతి
Advertisement
  • నీట్‌ వివాదంపై కేంద్రం, విపక్షాల తీరుపై బీఎస్పీ అధినేత్రి ఆందోళన

Mayawati | నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటున్న నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలతో విద్యా వ్యవస్థలో చేయాల్సిన సమగ్ర సంస్కరణల అంశం పక్కదారి పట్టకూడదని పేర్కొన్నారు. జంతర్‌ మంతర్‌ వద్ద జరుగుతున్న నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌ చుట్టూ రాజకీయ చర్చ సాగుతోందని తెలిపారు. అయితే, దేశంలోని పరీక్షా విధానంలో లోపాలను సరిదిద్దడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఉండాలని సూచించారు. “జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనకు ప్రజల నుంచి మద్దతు లభించింది. కానీ, మంత్రి రాజీనామా డిమాండ్‌పై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో అసలు సమస్య మరుగున పడకూడదు” అని ఆమె ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

నీట్‌ను రాజ‌కీయంగా వాడుకునేందుకు ప్ర‌తిప‌క్షాల ప్ర‌య‌త్నం

నీట్‌ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రతిపక్షాలు గ‌ల్లీ నుంచి పార్లమెంట్‌ వరకు ప్రయత్నిస్తున్నాయని మాయావతి ఆరోపించారు. ఈ పరిణామాలు కేంద్రం, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయని అన్నారు. “ఈ పరిస్థితులు భవిష్యత్తులో రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉంది. పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి” అని ఆమె సూచించారు. నీట్‌ వివాదం పూర్తిగా రాజకీయ అంశంగా మారిపోయిందని బీఎస్పీ అధినేత్రి అభిప్రాయపడ్డారు. జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకారులపై జరిగిన పోలీసు చర్యలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయని అన్నారు. ఈ వివాదం ప్రభావం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలపైనా పడుతోందని మాయావతి పేర్కొన్నారు. రాజకీయ ఘర్షణల కారణంగా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం తగ్గిపోతోందని విమర్శించారు.

లీకేజీల‌ను అరిక‌ట్టేందుకు ప‌టిష్ట‌మైన విధానం అవ‌స‌రం..

ప్రశ్నపత్రాల లీక్‌లపై ప్రభుత్వం ఘటన జరిగిన తర్వాత కఠిన చర్యలకు దిగుతోందని, కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు వ్యవస్థను బలోపేతం చేయడంపై స్పష్టత కనిపించడం లేదని ఆమె అన్నారు. “అవినీతి, నిర్లక్ష్యం కారణంగా పేపర్‌ లీక్‌లు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, అవి జరగకుండా నిరోధించే పటిష్ఠమైన విధానం అవసరం. అప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది” అని మాయావతి పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో బీఎస్పీ కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. ఆవేశానికి లోనుకాకుండా పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాల కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

Advertisement
Advertisement