త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TMC Crisis | పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్‌లో పెను ప్రకంపనలు: బీజేపీ గూటికి 20 మంది టీఎంసీ ఎంపీలు?

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. అసెంబ్లీలో తిరుగుబాటు తర్వాత, ఇప్పుడు ఏకంగా 20 మంది ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

J

National | Published On Jun 4, 2026, 2.23 pm IST

TMC Crisis | పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్‌లో పెను ప్రకంపనలు: బీజేపీ గూటికి 20 మంది టీఎంసీ ఎంపీలు?
Advertisement
  • మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో మరో భారీ చీలిక వచ్చే అవకాశం
  • సుమారు 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ అధిష్ఠానంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం
  • ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీలో 60 మంది ఎమ్మెల్యేలతో రితబ్రత బెనర్జీ వేరు కుంపటి
  • ఈ పరిణామం పార్లమెంట్‌లో ప్రతిపక్షాలకు, ముఖ్యంగా మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ

TMC Crisis | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో మరో భారీ కుదుపు రాబోతోందా? మాజీ సీఎం మమతా బెనర్జీకి (Mamata Banerjee) వరుస షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల తిరుగుబాటు సెగ చల్లారకముందే, ఇప్పుడు పార్లమెంట్‌లోనూ టీఎంసీ (TMC) ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఏకంగా 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీతో (BJP) టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

పార్లమెంట్‌లోనూ చీలిక తప్పదా?

ప్రస్తుతం పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు మొత్తం 41 మంది ఎంపీలు ఉన్నారు (లోక్‌సభలో 28, రాజ్యసభలో 13). వీరిలో సుమారు 20 మంది ఎంపీలు బీజేపీ హైకమాండ్‌తో అత్యున్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారేందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతిపక్ష శిబిరంలో ఎంపీల పరంగా రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న టీఎంసీలో గనక ఈ చీలిక వస్తే, అది దీదీకి మాత్రమే కాకుండా యావత్ విపక్షానికి అతిపెద్ద దెబ్బ (setback) అవుతుంది.

అసెంబ్లీలో అప్పటికే రెబల్స్ హవా

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం తర్వాత టీఎంసీలో అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) నేతృత్వంలో 60 మంది రెబల్ ఎమ్మెల్యేలు తమదే అసలైన టీఎంసీగా ప్రకటించుకున్నారు. అంతేకాకుండా మమతా బెనర్జీ ఎంపిక చేసిన నేతను కాదని, స్పీకర్ సైతం రితబ్రత బెనర్జీనే ప్రతిపక్ష నేతగా (Leader of Opposition) గుర్తించడం గమనార్హం.

దీదీపై పెరుగుతున్న ఒత్తిడి

ఆర్జీ కర్ (RG Kar) ఆసుపత్రి అత్యాచారం-హత్య కేసును డీల్ చేసిన విధానం, అలాగే పార్టీలోని అవినీతి ఆరోపణల కారణంగా చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత వారం ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా పలువురు టీఎంసీ నేతలు హాజరయ్యారు. ఫిర్హాద్ హకీమ్ లాంటి కీలక నేత రాజీనామా చేయడం పార్టీ శ్రేణులను మరింత కలవరపెడుతోంది.

రాబోయే రోజుల్లో లోక్‌సభ, రాజ్యసభల్లోనూ ఎంపీలు పార్టీ మారితే రెబల్స్ వర్గం మరింత బలపడే అవకాశం ఉంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలకు జరిగినట్లుగానే ఇప్పుడు మమతా బెనర్జీ తన పార్టీ పేరు, గుర్తును (party name and symbol) కాపాడుకునేందుకు న్యాయపోరాటం చేయాల్సిన కష్టకాలం దాపురించింది. రాబోయే రోజుల్లో బెంగాల్ పాలిటిక్స్‌లో ఇంకెన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Advertisement
Advertisement